పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
ముంగాలు మడవండి దండాలు పెట్టండి
బంగారునగలెంత బుసనాగు మణిచెంతఁ
సింగారమీ కెంపు సీమేను నెత్తురు
పొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁ
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
పోతులన్నిటికన్న నీడి పోతే మిన్న
తెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేను
తోకసప్పిటితోన దులిపేను దిక్కుల్ని
సూది కొమ్ములతోన సంపేను కామణ్ణి
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య
అమ్మోరి వాకిటా ఆగేడు సూడండి
బెమ్మోడి పుఱ్ఱెనే సాసేడు సూడండి
కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
గుమ్మనే మారేడు పువ్వోటి నావంతు
పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య






:)
ReplyDeleteతనికెళ్ళవారి తత్త్వాలు (ఆటగదరా శివా) చదివారా ఏమిటి? :)
ReplyDelete1. పంబోతు అంటే పనిపోతు అనా?
2. రెండవ చరణంలో ప్రాస వదిలేశారేమిటి? రెండవ చరణం రెండవ పాదంలో ఖండగతినుంచి నడక మారినట్టుంది?
3. బుసనాగు -- వింత ప్రయోగం :)
"కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
ReplyDeleteగుమ్మనే మారేడు పువ్వోటి నావంతు" - సాహో
@ రాఘవ,
ReplyDeleteకథేంటంటే, 'పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి' అన్నదానిలో పంబి అంటే ఏమిటా అని బ్రౌణ్యం వేదికాను. అలా పాట మొదలయ్యింది.
అసలైతే నాకు రెండవ చరణం ముందు వచ్చింది, ఒకటవదీ మూఁడవది పట్టిబట్టి వ్రాసినవి. రెండవది ఆశువుగావచ్చినదానిని మార్చడం ఇష్టం లేక వదిలేశాను.
ఇక ఛందస్సు విషయమై, పూర్తిగా వ్రాయడం అయిపోయాక ఛందస్సు చూసుకుంటే ౯౦శాతం ౫-౫-౫-౫ గా వుంది. ఒకటిరెంటిని దిద్దాను. కానీ గంగడోలును మార్చబుద్ధికాలేదు.
టమాటాపప్పు వండుకుంటూ అల్లుకున్న పాట. పాట గుఱించి ఆలోచిస్తూ పప్పులో ఇంగువ పాఱేశాను. పప్పు పోయింది కాని పాట బాగానేవుందని పిస్తుంది.
తనికెళ్ళ వారి తత్త్వాలు ఎప్పుడూ వినలేదు. నా దగ్గర బాలమురళి తత్త్వాలు వున్నాయి కానీ వాటి రచయిత తెలియదు.
బాగుంది
ReplyDelete