భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, January 24, 2011

పంబోతులారా ఆంబోతులారా

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

ముంగాలు మడవండి దండాలు పెట్టండి
బంగారునగలెంత బుసనాగు మణిచెంతఁ
సింగారమీ కెంపు సీమేను నెత్తురు
పొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁ

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

పోతులన్నిటికన్న నీడి పోతే మిన్న
తెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేను
తోకసప్పిటితోన దులిపేను దిక్కుల్ని
సూది కొమ్ములతోన సంపేను కామణ్ణి

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

అమ్మోరి వాకిటా ఆగేడు సూడండి
బెమ్మోడి పుఱ్ఱెనే సాసేడు సూడండి
కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
గుమ్మనే మారేడు పువ్వోటి నావంతు

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

5 వ్యాఖ్యలు:

  1. తనికెళ్ళవారి తత్త్వాలు (ఆటగదరా శివా) చదివారా ఏమిటి? :)

    1. పంబోతు అంటే పనిపోతు అనా?
    2. రెండవ చరణంలో ప్రాస వదిలేశారేమిటి? రెండవ చరణం రెండవ పాదంలో ఖండగతినుంచి నడక మారినట్టుంది?
    3. బుసనాగు -- వింత ప్రయోగం :)

    ReplyDelete
  2. "కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
    గుమ్మనే మారేడు పువ్వోటి నావంతు" - సాహో

    ReplyDelete
  3. @ రాఘవ,
    కథేంటంటే, 'పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి' అన్నదానిలో పంబి అంటే ఏమిటా అని బ్రౌణ్యం వేదికాను. అలా పాట మొదలయ్యింది.

    అసలైతే నాకు రెండవ చరణం ముందు వచ్చింది, ఒకటవదీ మూఁడవది పట్టిబట్టి వ్రాసినవి. రెండవది ఆశువుగావచ్చినదానిని మార్చడం ఇష్టం లేక వదిలేశాను.

    ఇక ఛందస్సు విషయమై, పూర్తిగా వ్రాయడం అయిపోయాక ఛందస్సు చూసుకుంటే ౯౦శాతం ౫-౫-౫-౫ గా వుంది. ఒకటిరెంటిని దిద్దాను. కానీ గంగడోలును మార్చబుద్ధికాలేదు.

    టమాటాపప్పు వండుకుంటూ అల్లుకున్న పాట. పాట గుఱించి ఆలోచిస్తూ పప్పులో ఇంగువ పాఱేశాను. పప్పు పోయింది కాని పాట బాగానేవుందని పిస్తుంది.

    తనికెళ్ళ వారి తత్త్వాలు ఎప్పుడూ వినలేదు. నా దగ్గర బాలమురళి తత్త్వాలు వున్నాయి కానీ వాటి రచయిత తెలియదు.

    ReplyDelete