భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, December 21, 2007

PHL - అసలైన హాకీ, సిసలైన ధీరులు

ఇంకో సంవత్సరం గడవనే గడిచింది. PHL క్రొత్త రూపం లో రానే వచ్చింది. ఈ సారి నా ఫేవరేట్స్ ఎప్పటిలాగా ఒరిస్సా ఉక్కుమనుషులే....
మీరు కూడా మీ అభిమాన హైదరాబాదు సుల్తానులనో... బెంగుళూరు డేగలనో... చెన్నపట్నం వీరులోనో... ప్రోత్సహించి వారిని జయప్రదం చేయండి..
నేను ఇంతకు ముందే హాకీ గురించి బ్లాగాను... మీరు చూడకుంటే వెంటనే చూడగలరు.. అది చదవని వారికి నా బ్లాగ్హృదిలో చోటులేదు.
ఇక PHL గురించీ కొన్ని విశేషాలు .

జట్లు Hyderabad Sultans
హైదరాబాదు సుల్తానులు
బెంగుళూరు హైఫ్లైయర్లు
చెన్నై వీరన్లు
మరాఠా వారియర్లు
ఒరిస్సా స్టీలర్లు
షేర్ ఈ జలంధర్
చండీగఢ్ డైనమోలు

స్వల్ప ఇతిహాసంChandigarh Dynamos
మన హైదరాబాదు జట్టు మూడేళ్లు క్రితం మొదటి పీహెచ్ఎల్ గెలిచి చరిత్ర సృష్టించింది. దానికి జట్టులోని ఒరిస్సా ఆటగాళ్లు (ప్రత్యేకించి దిలీప్ టిర్కీ) మఱియూ పాకిస్థానీ ఆటగాడు షకీల్ అబ్బాసీ చాలా తోడ్పడ్డారు. తరువాత ఒరిస్సా స్టీలర్స్ అని కొత్త జట్టుని సృష్టించడంతో వారు అక్కడికి వెళ్లిపోయి మన
సుల్తానులు గద్దె దిగవలసివచ్చింది. తరువాత సంవత్సరం బెంగుళూరు నెగ్గింది (లెన్ అయ్యప్పా వంటి వారితో). తరువాతి సంవత్సరం కత్తగా PHL కి వచ్చిన ఒరిస్సా జట్టు నెగ్గింది (రెండవ ఏఁడు వీళ్లు మొదటి డివిజన్ లో ఆడారు) . ఈ తడవ మారాఠా జట్టు చాలా బాగుంది.Chennai%20Veerans

ఇక దేశం లో మంచి హాకీ చోట్లు పంజాబ్, ఒరిస్సా, కొడగు (కూర్గ్). అందుకే జలంధర్లో ఒక జట్టూ, చండీగఢ్లో ఒక జట్టూ ఉన్నాయి. అందుకే పంజాబ్ జట్టులో అందరిపేరు లోనూ, మఱియూ అన్ని జట్లలోని పంజాబ్ ఆటగాళ్ల పేరులోనూ సింగ్ వుంటుంది.

పీహెచ్ఎల్ లో అందంBangalore Hi-Fliers
నాకు హాకీ అంటే చాలా ఇష్టం. కానీ పీహెచ్ఎల్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే...
ఏ క్రీడైనా లీగుల్లో ఆడినప్పుడే దానికి అందం. అబధ్రత గల వారు జాతి పరువును క్రీడలతో ముడికట్టి క్రీడని క్రిందకి లాగడం నాకు చిరాకుగా అనిపిస్తుంది. ఉదా- అమెరికాలో తీసుకోండి, అక్కడి విచిత్ర ఫుటబాలు బయట ఎవ్వరూ ఆడరు. కానీ వారి సంస్కృతి లో అది చాలా పెద్ద భాగం. ఇక కాలేజి ఫుట్బాలు గురించైతే వేరే చెప్పనక్కరలేదు. మా మిత్రుడు అనేవాడు "మాఁవా జార్జియా - జార్జియా టెక్ మ్యాచ్ కే అఱవై వేల మంది పట్టే స్టేడియం ఒక్క రోజులో నిండిపోతుందేంటిరా బాబూ.. మన ఆంధ్రాలో ఉస్మానియాకీ జెనటీయూకీ మ్యాచ్ అంటే ఒక్కడు కూడా వుండడుకదరా" అనీ.
Maratha Warriors
ఇంతకీ లీగ్ ల అందం ఏఁవిటంటే, ఇందులో క్రీడ అన్నిటికంటే ముఖ్యం. ఏ జాతి, ప్రాంత, దేశ వారైనా ఎందులోనైనా ఆడవచ్చు. సరిహద్దులులేని ఆదర్శ లోకానికో మచ్చుతునక, ఉదాహరణ. NHLలో ఐతే అమెరికా జట్లు,కెనడా జట్లు కూడా ఉంటాయి. ఇక EUFA గురించి చెప్పనక్కరలేదు.

ఈవాళ వారియర్స్ - వీరన్స్ మ్యాచ్ చూస్తుంటే.. వారియర్స్ స్టార్ ఆటగాడైన పాకిస్థానీ రెహాన్ భట్, గోలు చేసి తన జట్టువారైన మరాఠీలనూ, కొరియన్లనూ, నెథర్లాండ్లు వాళ్లను ఆలింగనం చేసుకుంటుంటే. గాంధీగారుSher-e-Jalandhar
సంతోషపడతారని పిస్తుంది. ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంత రోమాంచికంగా ఇంకోటి వుండదంటే నాకు నవ్వొస్తది. అంటే ఆట ఎంత నిరుత్సాహకరంగా ఉంటుందంటే, అందులో అతి సున్నితమైన కాశ్మీర్ అంశాన్ని కలపి, ఆ అంశాన్ని అమర్యాదపరచాలా? క్రికెట్ అనే కాదు, హాకీలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఫుట్బాలు వల్ల యుద్ధాలు కూడా వచ్చాయని పోకడ. ఈ లీగ్ ఇప్పుడు అవన్నిటినీ తిరగరాస్తుంది.


నా కల Orissa Steelers
ఒక రోజు, టీంలు కేవలం పేరుకే ప్రాంతీయ జట్లు కాకుండా. నిజంగా వారికి ఒక వ్యవస్థ వుండి, ఒక ఊరిలో ఇల్లూ, కఛేరీ, స్టేడియం ఉండి. అక్కడ వారి హోం ఆటలు ఆడితే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పటిలాగా అన్ని దేశాలవారూ ఆడుతూ. ఇక లాహోరు, కరాచీ, ఢాకా, కాట్మండూ వగైరా జట్లు ఉంటాయి (ఒక వంద ఏళ్ళ తరువాత కనీసం?).

ఇక మన దేశంలో క్రీడౌత్సాహికులు పెరుగుతారు, అందరి ఆరోగ్యోలూ బాగుంటాయి.
నాకు ఒక జట్టు యాజమాన్యం ఉంటుంది. ఏ విశాఖ ఉక్కు డేగలో, ఆంధ్రా నరసింహులో అని. అలానే ఒక ఫుడ్బాలు జట్టు కూడా. సీమ తోడేళ్ళో, బెజవాడ వడగాల్పులో అని... (red wings, coyotes, heat anyone?)

ఓం శాంతిః శాంతిః శాంతిః

Monday, November 26, 2007

నా దృష్టిలో "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం"

రవీయం అనే బ్లాగులో గడ్డం రవీంద్రనాథగారు వ్రాసిన "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం" టాపా చదివి దానికి నేను వ్రాయదలచిన వ్యాఖ్య మరీ పెద్దదయ్యే సరికి ఇలా ఇక్కడ టాపాగా వెస్తున్నా, ఎప్పటికైనా వుంటుందని. బ్లాగుల్లో ఇలాంటి 'విలువైన' టపా చదివి చాలా రోజులైంది. చదివిన తరువాత మనల్ని స్వల్పంగా ఆలోచింపజేసే టాపా (ఎక్కువ ఆలోచన మంచిది కాదు అ.నా.అ). ఒక నిర్దేశిత ఆలోచనా విధానంలో ఒక తాత్విక అంశం మీద బాగా వ్రాసారు. అలాంటి అంశాలమీద, ఎవరైన చర్చిస్తుంటే, నాకు చాలా సార్లు అర్థంలేని ప్రేలాపన అనిపించి ఎక్కువగా చర్చకి దిగను. ఈ టాపా అర్థంకావాలంటే అది చదవాలి మీరు.

"మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది."
ఈ విషయం నాకు తెలియనిది. నాకు స్వతహాగా మరణంలో వున్న బాధంటేనే భయం ఎక్కువ. నాకు పెద్ద మంచి జ్ఞాపకాలూ, అనుభవాలూ లేకపోవడం కారణం కావచ్చు. పెళ్లయిన వాళ్లు, పిల్లలున్న వాళ్లు, లేక తల్లిదండ్రుల పట్ల పెద్ద పెద్ద బాధ్యతలున్నవారికి ఇది బాగా వర్తిస్తుందనుకుంట.

"చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి .....ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం... కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు."
నాకైతే మనం శాశ్వతంకదా అనే నమ్మకం వలనే మరణభయం తగ్గింది. అంటే, ఆ ప్రక్రియ నాకు బగా పనిచేస్తుంది.


"శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. "

ఒక జన్మతో ఇంకోదానికి భౌతికంగా నిమిత్తం లేకపోవడం వలన, కొత్తదనం వస్తూనేవుంటుందనవచ్చు. ఇక జన్మ జన్మకీ ఆత్మ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మనం 'నిష్కామంగా' ధర్మాన్ని ఆచరించవచ్చు. అంటే ఎలాగూ పోయేదానికి నిజాయితీగా వుండి ఏం లాభం, లేక భగవంతుడు ఉన్నాడో లేడో తెలియనపుడు నిజాయితీగా వుండి ఏం లాభం అనుకోకుండా. ధర్మబద్దంగా వుండడం నిర్వాణసోపానమధిరోహణముగా భావించవచ్చు. భౌతిక వస్తువులు మఱియూ అంశాలూ శాస్వతమని నమ్మడం మూర్ఖత్వం అని వివేకులకు ఎఱుకే. కానీ ఆత్మ శాశ్వతమనీ, అది పురోగమిస్తుందనీ నమ్మడం చెడు కాదు!

"మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది"
చాలా బాగా చెప్పారు. చాలా మతాల్లా, పై ఆదర్శాన్ని సాధించడానికి ఒకే విధానం వుంది అని చెప్పడం కంటే, ఎవరి విధానం వారినే చూసుకోమనడం ఇంకా గొప్ప!
ఇక ప్రతి రోజూ మరణించే విషయమై..
నేటి జీవితంలో, ప్రజలు పనిచేసేదంతా ఎప్పటీకీ రేపుగా మిగిలిపోయే రేపు కోసమే! పిల్లలు పుట్టినప్పటినుండీ వారు విశ్వసంపన్నులు కావాలన్న కలను వారిలోనికి పెద్దలు ఎక్కించి దాని వెనుక పరిగెత్తించుచున్నారు. ప్రతి దినం ఒకేలా వుండే వ్యవసాయం, పౌరోహిత్యం, ఉపాధ్యాయం వంటి అందమైన వృత్తులంటే, జనులకు ఆకర్షణ లేకపోగా చిన్నచూపు వుంది. ఇక ఠాగూరు మార్గాన శాంతినికేతనాలకూ, థోరో మార్గాన వాల్డెనులకూ ఎంతమంది వెళ్తున్నారు, అలా వెళ్లడం అభినందనీయమని ఎంతమంది భావిస్తున్నారీనాడు?

తిలక్ అమృత వాక్కు
అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

Friday, November 23, 2007

కవితలు వ్రాయడం ఎలా

నాలుగు కవితల అనుభవం వున్న నేను, మీ అందరికీ కవితలు వ్రాయడం ఎలాగో బోధింపదలచాను.
"అదేఁవిటీ, నీలాంటి పిల్ల కవి దగ్గరా మేము నేర్చుకోవలసింది?" అన్న ధర్మసందేహం మీకు కలుగవచ్చు.
తప్పులేదు, డబ్బులు కట్టారు కాబట్టి మీ గురువు అర్హతలు తెలుసుకునే హక్కు "సమాచార హక్కు చట్టం" మీకు కలుగజేస్తుంది. పెద్ద కవులు దగ్గర నేర్చుకుంటే, భావం ఛందస్సు, ఎలగెన్సు, వగైరా వగైరా ఉండాలి, ఉండకూడదు, ఉండీవుండనట్టువుండాలి వగైరా వగైరా అని చాలా క్లిష్టంగా చెబుతారు. కాబట్టి నాలాంటి చిన్న కవి దగ్గర నేర్చుకుంటే, మూడంచెల్లో మీరు కవితాస్వర్గద్వారతీరాలకు ఎలా లంఘించగలరో సునాయాసంగా తెలుసుకోవచ్చు. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

ఉపోద్ఘాతం ("ఇప్పుడు వఱకు జరిగిన సుత్తేంటి మరి?" అంటారా)
నేను క్రిత శనాదివారాలు(వారాంతం అనడం నాకంతగా నచ్చుదు) బెంగుళూరు వెళ్లాను. ఈ సారి మంగతాయార్ల వెంట పడలేదు. అలానే మన బ్లాగర్లనూ కలవలేదు. పనులలో భాగంగా నేను బెంగుళూరులో దోమలూరి నుండి బనశంకరి బస్సులో వెళ్తున్నప్పుడు బెంగుళూరి మీద ఒ కవిత వ్రాసిపారేశాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి). దాన్ని విశ్లేషిస్తూ మీకు కవిత ఎలా వ్రాయాలో చెబుతా.

బస్సెక్కే ముందు
బెంగుళూరు వెళ్తున్నాని తెలిసి మా స్నేహితులు ఉచిత సలహా పారేశారు "అక్కడ దోమలూరులో వున్న పలానా కంపెనీ ఆఫీసులోకెళ్లి, అమెరికా యాసతో మాట్లాడి, హెచ్చార్ అమ్మాయికి రెజ్యుమే ఇచ్చిరా" అని. ఆ పని చేయడానికి ప్రయత్నించాకాని, రిసెప్షన్ పిల్ల "మా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి, ఇంత దూరం రావాల్సిన శ్రమ తగ్గుతుంది" అని చెప్పి నన్ను తోలేసింది. అప్పుడు నాకు తట్టింది, బెంగుళూరు మనకంటే చాలా ముందు కెళ్ళిపోయింది, ఈ గాజు౨ మేడల్లో మనకు చోటు లేదని. దాని మీద కవిత రాయాలని పించింది. టెక్ పార్కు బయటకెళ్లి బస్సుకోసం నించున్నా. చూస్తే జోబులో ఐదువందలు తప్ప ఏం లేదు. కొట్టు కొట్టు కూ వెళ్లి చిల్లర అడుకున్నా(ఈ సంగతి గుర్తుపెట్టుకోండి). చివరకు ఎవరో ఇచ్చారు, తరువాత బస్సొచ్చింది బస్సెక్కా.

మెదటి పద్యం
నా దగ్గర అంకోపరిసంచిలో అంకోపరి బదులు 'శ్రీశ్రీ జీవిత చరిత్ర' మఱియూ తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' వున్నాయి. (గమనించవలసిన విషయం, ముందు కవితలు వ్రాయడానికి స్ఫూర్తి ముఖ్యం. కాబట్టి మీరు నా కవితలు అచ్చు చేసుకుని, వాటిని మీ జేబులో పెట్టుకుని బస్సెక్కండి).
బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!
తిలక్ వ్రాసిన "నగరంలో హత్య" కవిత ఇలా మొదలవుతుంది.
హైదరాబాద్ నన్ను గుర్తించలేదు పలకరించలేదు.
పెద్ద పెద్ద వీధుల్లాంటి పైట సవరించుకుంటూ
తప్పుచేసిన ఆడదానిలా తప్పించుకు తిరిగింది
దీనికీ నా కవితకీ వున్న పోలిక కేవలం కాకతాళీయమే; అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. మొదటి పద్యాన్ని తిలక్‌లా మొదలు పెట్టి, అప్పుడే చూసిన టెక్పార్కు గురించి, బెంగుళూరి లోని ఇఱుకు రోడ్ల గురించి అదే రూపకంలో వ్రాసా. ఒకప్పుడు బెంగుళూరు లో చెట్లెక్కువుండేవి, ఇప్పుడు వాటిని నరికేసి అద్దాల మేడలూ, మెట్రోలూ కడుతున్నారు. అక్కడినుండి 'సెక్సీ' వచ్చింది. (దీని మీద మరింత వివరణ తరువాత)

రెండో పద్యం
అందని ద్రాక్షలు పుల్లన. మనకెలాగూ ఉద్యోగం ఇవ్వట్లేదు కాబట్టి, "ఏవరికి కావాలి మీ బోడి ఉద్యోగం" అన్నదాన్ని కొద్దిగా ఉత్ప్రేక్షిస్తే ఇలా తయారవుతుంది.
అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే సరిపోదు, పేదలని నిజంగా అభివృద్ధి పరచడం గొప్ప (ఇది అసాధ్యం కాబట్టి)...
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
అదే ధొరణిలో
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.
బస్సెక్కేముందు జరిగింది ఎలావుంది అలానే వ్రాసేయండి. దాని తరువాత... బస్సులో టికెట్లన్నీ రూపాయల్లోనే వుంటాయి. నా జేబులో యాభై పైసుల బిళ్లవుంది. అది చూపిస్తే నిజంగానే అవతలకి పొమ్మంటారు. కాబట్టి అదికూడా వ్రాయండి.

మూడో పద్యం
నేను కుటుంబం పని మీద ఎవరినో రైలు ఎక్కించడానికి స్టేషను వెళ్లా. అక్కడొకమ్మాయి, మన భీమవరంమే అయినా, మా బామ్మాళ్లతో ఆంగ్లం యాసతో తెలుగు మాట్లాడింది. బెంగుళూరులో ఇంలాంటి వారికి కొదవలేదు. కాబట్టి ఇది వ్రాయడం కూడా తేలికే.
ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!

నాల్గో పద్యం
బస్సులో నా వెనుక సీటులో ఒక తెలుగతను "ఎరా ఐడోన్ట్‌నో సిస్టంస్ లో సి అడుగుతున్నాడా, జావా అడుగుతున్నాడా" అని ఫోనులో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకో తమిళతను "మచ్చా చావరియా పటమ్ నోకియా" అని మాట్లాడుతున్నాడు. ఆ రెండిటినీ ఇక్కడ.
జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
బెంగుళూరు నిండా పార్కులే, అలాగే జేపీ నగర్ లో ఒకటి కనిపించింది. అప్పటివరకూ తెలుగు, తమిళ, అరవ కుఱ్ఱాళ్లతో ఏఁవ్ చేయ్యాలో అర్థంకాని నాకు. బల్బు ఎలిగింది. ఇక..
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.
ఇది బెంగుళూరు బస్సుల్లో ఎప్పుడూ జరిగేదే. ఆడామగా కండెక్టర్లిఱువురూ చేసేదే.

ఐదే పద్యం
నిజంగానే బెంగుళూరులో నాకు కావాల్సిన ఉద్యోగాలు లేవు. న్యూయార్కో, లండనో, హాఙ్ కాఙ్‌గో వెళ్లాలి (అంటే వాళ్లు రానిస్తే). అదీ ఇక్కడ పారేశా.
ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
ఒకప్పుడు నేను జీవితంలో డబ్బు, పెట్టుబడిదారు వ్యవస్థ వంటి వాటిలో నమ్మేవాడిని, అప్పటిలో "అదృష్టవంతుడను నేను, వడ్డించిన విస్తరి నా జీవితం". బెంగుళూరేఁవీ మారలేదు. రెండేళ్ల క్రితం ఎటు పోతుందో, ఇప్పుడూ అంతే, మారిందల్లా నేనే అన్న విషయం ఇక్కడ వ్రాసా.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.

రూపకం
ఈ ఒక్క అలంకారం తెలిస్తే చాలు మీర ఒక మోస్తరు నుండి భారీ కవి కావచ్చు. నా పేరే ఒక రూపకం కాబట్టి, అక్కడ నాది కొద్దిగా ముందంజ. (పేరుకు అర్థం అడగకండి).
నవ్యసమాజం ఎప్పుడూ "ఖండాంతర వాసులతో సంభాషిస్తున్నాం, గ్రహాంతర వాసులకు సంకేతాలు పంపిస్తున్నాం" అని ప్రగల్బాలు(?) పలకడమేగానీ, పెద్ద మనిషైన పదేళ్లకు కూడా కుఱ్రవాళ్లకు పెళ్లి చేయలేకపోతున్నది. అలాంటి కుఱ్ఱవాళ్లకి ఇంకేంచూసినా అమ్మాయే కనిపిస్తుంది. మామూలు అమ్మాయి కాదు సంప్రదాయాన్ని విడిచి సెక్సీగా తిరిగే అమ్మాయి, పార్కులలో చెట్టాపట్టాలేసుకు తిరిగే అమ్మాయీ, బావా అని పిలిచే అమ్మాయీ కనిపిస్తూంటారు. అద్దంపద్దం(అర్థంపర్థం?) లేని బెంగుళూరు నగరాల్ని చూసినా అంతే! అలాగే, మీకు అప్పడాలంటే భ్రమ అనుకోండి, మీరు లిబర్టీ విగ్రహాన్ని అప్పడంగా భావించి ఓ కవిత వ్రాయండి. ఉదాః
గేసు పొయ్యలాగా కాగుతున్న వేడి న్యూయార్కు దినాన,
లిబర్టీ విగ్రహం అప్పుడే వేసిన అప్పడం లా కాగిపోతుంది.
తాకడానికి వేడిగా, తినడానికి కరకరలాడేట్టుంది.
శబ్ద మఱియు ఇతర అలంకారాలు
నేను వ్రాసిన నిరుద్యోగులు పద్యాన్ని పైవిధంగా విశ్లేషించడం అంత తేలిక కాదు. పైది తిలక్ శైలి, ఇది మాత్రం శ్రీశ్రీ శైలి.
విశ్లేషణ కష్టం కానీ, శ్రీశ్రీ శైలి లో వ్రాయడం మాత్రం చాలా తేలిక. మీకు తోచినట్లు వ్రాయండి. కొద్దిగా మాత్రాఛందస్సు వాడండి. రూపకాలం'కారాల'తో రెచ్చిపోండి. కొంత కాన్సొనెన్సు(తెలుగులో?) వాడండి.
ఉదాహరణకు
అసమర్థ చితులుండే శ్మశానాల్లో,
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు
***
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !
జనులు "అసమర్థ చితులు కాకపోతే సమర్థ చితులుంటాయా ఎక్కడైనా?", "కళేబరం కాలనప్పుడు పుఱ్ఱైనా ఇంకోటైనా ఎలా పేలుతుంది?", 'నత్తకెవరైనా మంగళారతి పడతారా?" అని ప్రశ్నించరు! దాని బదులు అద్భుతమనీ, పత్రికలకు పంపాలనీ అంటారు. ఇక...
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !
ఆ రోజు నిజంగా మా అక్క గులాబ్జామూఁలు చేసి వాటికి పాకం పట్టలేదు. కానీ ఇలాంటివి కవనవ్యాపార రహస్యాలు. వీటిని బయటకు చెప్పకూడదు. నేను నా గురువృత్తి ధర్మానికి అన్యాయం చెయ్యలేక మీకు చెబుతున్నాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

త.రా: ఇంకేముంది కష్టమైన వృత్తాలు విడచి, అభ్యుదయపూరిత బావ కవిత్వం వ్రాయండి!

Monday, November 19, 2007

బెంగుళూరు మారిపోయింది

బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!

అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.

ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!

జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.

ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.

Thursday, November 15, 2007

రానారె తో ముఖాముఖి

ఉపోద్ఘాతం
ఒక నెల రోజుల క్రితం, ఓ వేడి ఆంధ్రా మధ్యాహ్నం వేళ, సృజనాత్మకత పేగుల్లో కొట్టుకొచ్చినప్పుడు, రెండు పాత్రలను కల్పించి వ్రాసిన సంభాషణ ఇది. ఒక యువ విలేకరి, ఒక పెద్ద రాజకీయవేత్తని ఇంటర్వ్యూ చేస్తుంది. రాజకీయనాయకుడి పాత్ర నా నుంచి జనించినదైనా, అతను వ్యక్తపరిచే అభిప్రాయాలు నావి కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది, 'ది డైలీ షో'లో ఒక స్కిరిప్టు అనుకోండి.

ముఖాముఖి

నమస్కారం రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి) గారు.

నమస్కారఁవమ్మా.

మీరు శ్రీశ్రీ కవిత్వాన్ని మీ రచనల్లో ఖూనీ చేస్తారు అని ప్రజాభిప్రాయం, మీరేమంటారు ?

నేనే మంటాను, ఎవరి అభిప్రాయం వారిది. ఇతర రాజకీయనాయకులలా నేను అన్యుల అభిప్రాయాలను ఖండించను, నాది విశాల దృక్పదం.

మీరలా వ్రాయడం శ్రీశ్రీ అభిమానులూ, గాంధీ అభిమానలూ తీవ్రంగా ఖండిస్తారోమో ?

శ్రీశ్రీ అభిమానులకు - ఇక్కడ శ్రీశ్రీ కవిత్వం గురించి, తెలుగు కవిత్వం గురించి పలువురికి ఆసక్తి కలుగుతుందాలేదా అన్నది ముఖ్యం. ఏ ఉద్యమంలోనైనా కొందరు పాలికాపుల బలి అవడం జరుగుతుంది కామ్రేడ్! మీలాంటి వారికి లేడి నెత్తురు కావల్సినప్పుడు మాలాంటి పులిలకు ఖూనీ చెయ్యక తప్పదు!
గాంధీవాదులకు - లోక కల్యాణం కోసం నలుగుర్ని చంపినా పర్వాలేదన్న వితండవాదం చేసి హింసఖాండని సమర్ధించుకునే '*కామీ'గాళ్లతోనా మీకు సహవాసం. అయినా గాంధేయులంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలి కాని, ఇలా ప్రశ్నించకూడదు. ఉదాహరణకు, "శ్రీశ్రీని ఖూనీ చేసారు, ఇదిగో తిలక్" అని చూపించాలి.

మీ ఈ మాటలు వారిని ఇంకా బాధకలిగిస్తాయేమో?

మీరు ఇంటర్‌వ్యూ చేస్తున్నారా? పుల్లలు పెడుతున్నారా? అయినా వారి భాషలోనే, వారికి నేను చెప్పదలచుకుంది ఒక్కటే "పతితులారా, బ్రష్టులారా, దగాపడిన దమ్ములారా, ఏడవకండి"!

ఎం సార్ జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయా?

రావట్లేదమ్మా, అయినా ఎవరో ఒకళ్లు వెళ్లి వాటిని తీసుకొస్తారనుకోవడం మూర్ఖత్వం. ఒక వెయ్యి మంది లాగితేనే గాని కదలనిది, ఎవరో వెళ్ళి నీ కోసం తీస్కొస్తానంటే నమ్మేయడమే? అయినా, అవి వచ్చినా ఎఁవ్ చేస్తావఁమ్మా, వాటి కింద తలపెట్టి చావడం కంటే ఎం చెయ్యలేవు? ఇదే నమ్మా ఈ దేశానికి వచ్చిన చిక్కు, ఎప్పుడూ ఎవరో అవతార పురుషుడు వచ్చి తమ బ్రతుకుని ఉద్దరిస్తారని చేతులు దులుపుకుని ఎదురు చూస్తుంటారు. దాన్ని ఉపయోగించుకుని జనాలు జగన్నాథుడని కవితలు వ్రాసో లేదా శివాజీ, ఠాగుర్, రామయణం అని సినామాలను డబ్ చేసో సొమ్ము చేసుకుంటున్నారు.

అయితే ఎఁవ్ చేయమంటారు సార్ ?

అలాంటి సినిమాలు పరభాషలలో వచ్చిన తరువాత వాటిని డబ్ చేయడం కంటే, మీరే సొంతంగా తీయండమ్మా! ఆ సెంటిమెంట్‌ని మీరే సొమ్ము చేసుకోండి! ఎవడో అరవోడు వచ్చి సినిమా తీస్తాడు అని ఎదురుచూడడం మానేయండి.

మరి రామాయణ ప్రస్తావన ?

అదేనమ్మ, ఎవరో సంస్కృత కవి ఎదో మన ద్రావిడులని ప్రతినాయకులు చేసి రాసిన నవలను, మనము ముగ్గురు మహాకవులని నియమించుకొని డబ్ చేసుకున్నాముగా. అలాంటి పనులు మానేసి, మన మాస్‌ని హీరోగా, ఆర్యుడూ, ఉత్తరదేశస్తుడూ ఐన రాహుల్ దేవ్‌ని విలన్‌గా పెట్టి మాస్ అని సినిమాలు తియ్యమంటున్నాను.

కవిత్రయం వ్రాసింది మహాభారతం సార్! మీకు తెలియనిదేఁవుంది గాని! ఇంతకీ మీరు కూడా రామాయణం నమ్మరా సార్?

షీర్ నాన్సెన్స్! మనల్ని దానవులు చేసి రాసిన పుస్తకం. అందునా నమ్ముకొచ్చిన ఆలిని క్షణం సుఖపెట్టలేని వాడమ్మా మీకు దేవుడు ?

అయ్యో రామా !

అఱే చెప్తుంటే నీకు కాదు? ఆ పేరు ఎత్తొద్దంటే!

మరేమనాలి సార్ ?

ఎంకన్న అనుకో, యాదన్న అనుకో, అప్పన్న అనుకో!

అన్నీ ఆ పురుషోత్తముని నామాలేగా సార్?

ఎంటమ్మా నీ పోలిక? మీ కాలం పిల్లలందరూ ఇంతే! ఆంగ్ల చదువులు నేర్వడంకాదు, అమ్మమ్మ దగ్గర రామాయణం వినాలి.

మీరే కద సార్ మన కథలు మనమే రాసుకోవాలి ఎఱువు తెచ్చుకోకూడదన్నారు? ఇప్పుడేమో వాటినే వినాలంటున్నారు!

పక్కవారివి చదివితే అందులో తప్పులు పట్టొచ్చమ్మ. ఏమో ఎవరికి తెలుసు, కొంత పుణ్యం కూడా రావచ్చు, ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు?

అప్పన్నకీ సీతాపతికీ పోలిక గురించి ఏదో అంటున్నారు?

అవును పొట్ట చీల్చి పేగులు తినే సింగముఖుడు మన అప్పన్నకీ, చెట్లు వెనకాల దాగి బాణాలు వేసే కౌశలేయునికా నీ పోలిక? అఖిలస్ ఎవఁన్నాడో తెలుసా, బాణాలు పిరికివారి ఆయుధాలఁట. అఖిలస్ అంటే తెలుసుగా?

తెలుసు సార్, అఖిలస్ అంటే బ్రాడ్ పిట్, ఎంత హాట్‌గా వుంటాడో. హెక్టర్ గా ఎరిక్ బానా కూడా చాలా హాట్‌గా వుంటాడు. మా కాలేజీ బ్రాడ్ పిట్ ఫాన్ క్లబ్‌కి నేనే అధ్యక్షురాలిని. ఇక ఒర్లాండో బ్లూమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒకే సినిమాలో ముగ్గురు హంక్సు. ట్రాయ్ ఎన్నిసార్లు చూసానో రెక్కలేదు.
మీతరం అమ్మయిలందరూ ఇంతేనమ్మ, ఆంగ్ల సినిమాలు ఆపోశన పడతారు. రామాయణభారతాలు తెలిసీ తెలియనట్టు వుంటారు. అందుకే దేశం వెనక బడిపోతుంది. ఆడ యువతకి వారి బాధ్యత తెలిసిరావట్లేదు.

ఏంటి సార్ వినిపించుకోలేదు, ట్రాయ్ గురించి ఆలోచిస్తూ వుండి పోయా...

అందుకేనమ్మా నేను కూడా ఎవరైనా కుఱ్ఱాడిని పంపమన్నాను.

మీరామాటంటే గుర్తొచ్చింది. మీకు స్త్రీల సామర్థ్యం మీద నమ్మకం లేదని, మీరు మగాధిపత్యవాదులని ఆరోపణలు వున్నాయి, వాటి మీద మీ వ్యాఖ్యానం?

స్త్రీల సామర్థ్యం మీద నాకు చాలా మంచి అభిప్రాయం వుంది. జనాబాలో సగం మంది వారే కాబట్టి, ప్రభుత్వాన్ని నిలబెట్టగల, కూల్చగల సత్త ఉంది వారికి.

అంటే జనాబా ఎక్కువ కాని, వారు చేతగాని వారనా మీ అభిప్రాయం ?

ఆడవారు ఎంత తెలివైన వారంటే, వారు ఆలోచించడం మొదులు పెడితే మగ వారికే ముప్పు. అయినా ఆడవారంటే అందానికి ప్రతిరూపం, ఆ అందాన్ని ఆస్వాదించడానికే భగవంతుడు వారిని సృష్టించాడు. అలాంటి అందం పని చేయవలసి రావడం, ఆలోచించవలసి రావడం నాగరికతకే అవమానం. తెల్లవారు స్త్రీ అభ్యుదయం పేరుతో, ఆడవారి చేత అన్ని పనులూ చేయిస్తుంటారు. శాస్త్రం, సాంప్రదాయం, ఆచారం, సంస్కృతి, పరంపర లేని వాళ్లు వారికేం తెలుసు. నేను చెప్పొచ్చేదేంటంటే, ఆడదాని తెలివితేటలు నమ్ముకున్న వాడికంటే వెఱ్ఱివాడు లేడు.

మీరు ఎంత తెలివిగా మాట్లాడినా, మీ మాటల్లో ద్వందత్వం, అవకాశవాదం, మీ కుటిల ఆలోచన, ఇఱుకు దృక్పదం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మీలాంటి దిగజారిన రజకీయవేత్తని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నా. ఇక్కడితో ఇంటర్‌వ్యూ సమాప్తం ఉంటా.

శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు!

Monday, November 12, 2007

రెండు కులాలు, దీపావళి, మహాకవి, మంగతాయారు

స్కంధము ౧
గురువారం కుటుంబం పనిమీద బెంగుళూరు వెళ్లవలసివచ్చింది. అసలు పని గంట మాత్రమే. ఎలాగూ వెళ్లానుగా అని చెప్పి "ఈ డాకుమెంటు ప్రపంచంలో నాకు ఇంకా మంచి స్థానం కల్పించే నాలుగు డాకుమెంట్లు పోగేసుకుందా"మని నేను ఒక రాత్రికి బెంగుళూరులోనే వుండిపోయాను. గురువారం బెంగుళూరుకు శెలవు. ఇక్కడ (తమిళ, మలయాళ నాడుల కూడా) నరక చతుర్ధశి నాడు దీపావళి జరుపుకుంటారు! నేను ఆ రాత్రి బెంగుళూరులో వుండి తరువాతి రోజు అంటే శుక్రవారం కావలసిన డాకుమెంట్లు సంపాదించాలని నిశ్చయించాను.

శుక్రవారం అమావాశ్య నాడు ప్రొద్దుటే మా పాత కంపెనీకి వెళ్లా. పాత మిత్రులని కలిసా. ఎం చేస్తున్నావన్న ప్రశ్నని ధీటుగా ఎదురు కొని, ఏఁవీ చెయ్యట్లేదని చెప్పా, ఒక అందమైన మళయాలీ భామకైతే అంతర్ముఖుణ్ణయ్యా అని చెప్పా. ఎం చేయబోతున్నావని అడిగినవారికి, ఏదో పెద్ద ప్లాను చెప్పి, అది చాలా కష్టం అని వివరించాను. కొంత సేపు నేను ఈశ్వరవాదినా నిరీశ్వరవాదినా అన్న చర్చ జరిపారు మావాళ్లు, మొత్తానికి నాస్తికుణ్ణని తేల్చారు! కలికాలం! సంవత్సరం నుండి మహిషాసురమర్దిని గోడకాగితం వున్న నన్ను నాస్తికుణ్ణి చేసేశారు.
అందుకే నేనంటా. రెండేకులాలండి. ఈశ్వరవాదులు, నిరీశ్వరవాదులూ.

స్కంధము ౨
మధ్యాహ్నానికల్లా డాకుమెంటు పనులన్నీ అయ్యిపోయాయి. ఖండాతరాన నాకు అప్పిచ్చిన నా ఫ్రెండుకు అప్పు తీర్చుదామని, వాడి తల్లదండ్రుల ఇంటికి బయలుదేరాను. అప్పుడెప్పుడో అమెరికాలో నాకు నాలుగు నెలల్లో ఉద్యోగమొస్తుందన్న నమ్మకంతో నాకు ఓ రెండు వేలు అప్పిచ్చాడు. నేను కాస్తా 'నాన్ పెర్ఫామింగ్ అసెట్' అయ్యి కుర్చున్నా. తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు! డాలరు విలువ పడిపోయింది. వడ్డీ కలుపుకున్నా రూపాయిల్లో వాడిచ్చినదానికన్నా తక్కువయ్యింది. మా మిత్రుడి అమ్మానాన్నా మామూలు తెలుగింటి తల్లిదండ్రులు. మాదేవూరని అడిగారు, నేను "రాజమండ్రి దగ్గరండి, పశ్చిమ గోదావరి జిల్లాలో" అని చెప్పా. పశ్చిమ గోదావరి జిల్లానా అయితే "మీరు రాజులా? కమ్మోరా?" అని అడిగారు ఆంటీ. నాకు నవ్వచ్చింది. పాత కాలపు మనషులులే అని చెప్పి నేను సమాధానం ఇచ్చా. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో తిప్పికొడితే ఆ రెండు కులాల జనాభా కలిపి పది శాతం కూడా వుండదు.

నేను రాష్ట్రం బయట చదివా కాబట్టి, అక్కడ మన ఆంధ్రులంటే, కట్నం ఎక్కువ తీసుకునే పెద్ద రైతులని అపోహ. వివాహ మహాసంతలో వారి ధర పెంచుకోవడానికే వారు ఇంజనీరింగు చేస్తారని వారి నమ్మకం. కాబట్టి వారు మామూలుగా, "మీరు తెలుగా? రెడ్లా, కమ్మోరా?" అని అడుగుతారు! ఈ రెండు కులాల జనాభా కూడా తిప్పికొడితే ఆంధ్ర జనాభాలో ౧౫శాతం కూడా వుండదు. ఎంటో మిగితా వాళ్లందరూ లేనట్టే! ఇలాంటి సమాధానాలకి నేను అడిగిన వారి బట్టి సమాధానమిస్తూవుంటా. చిరాకేసుంటే, "అదంత అవసరమా?" అని అడుగుతా, లేక పోతే ఏ బుట్టలల్లేవారో, కుమ్మరులో, అయ్యరికపాత్రులో, రాములోరి వంశంలో పుట్టిన క్షత్రియలమో, ఎఱుకలవారో, లేకపోతే ఇంకేమైనా మహత్తర కాంబో పాక్ అనో చెబుతా (మొన్నే ఒకడికి మా అమ్మ పాములు పట్టేవారు, మా అయ్య చేపలు పట్టేవారు అని చెప్పా).

కానీ నా అంత అభూతకల్పన లేని నా మిత్రుడొకడ్ని, మా మొదటి సంవత్సరం ఇంజనీరింగులో, వాడి పంతులు క్లాసులో అడిగాడు "నాకు తెలుసు మీ ఆంధ్రావాళ్లు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతారో.. కట్నం కోసం.. బీటెక్ చేస్తే ఐదు లక్షలు, ఎమ్‌టెక్ చేస్తే పది లక్షలు ఇస్తారు మీకు. ఇంతకీ నువ్వే కులం రెడ్లా, కమ్మొరా" అని. "రెండూ కాదు" అనడానికి వాడి అమాయకత్వమో, కమ్మత్వమో అడ్డుపడ్డాది. అసలే నందమూరు వాడి వూరికి చాలా దగ్గర. ప్రఫెసర్ వాడిని కొంత సేపు ఆడుకున్నాడు. ఇంకా నయ్యం, "చీపుగా ఐదు పది లక్షలేంటి సార్, వ్యవహారం కోట్లలో నడుస్తుంటే" అని సవరణ ఇవ్వలేదు. వాడికిప్పటికీ అర్థంకాదు వాడు ఆ సబ్జెక్టు ఏ కారణం చేత తప్పాడో. అదే కేరళ బదులు విజయవాడైతే మావాడు వాడిని యేస్సేవాడు! "కమ్మ కేరళందు కొంచమై యుండదా" అని సద్దుమణిగాడు.
అందుకే నేనంటా. రెండే కులాలండీ. పాసయ్యే వాళ్లు, ఫేలయ్యేవాళ్లు.

నేను చెప్పిన సమాధాని బట్టి ఆంటీగారు, మా ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారనుకుంటా. చెప్పడం మరిచా. వారు కడప నుండి బెంగుళూరు వచ్చిన, స్వచ్ఛమైన రెడ్లు. కానీ మా వాడికి బెంగుళూరత్వం ఎంత ఎక్కువంటే, వాడికి 'ర'కి ఎకారం, 'డ'కి ఇకారం పెట్టడం రాదు. అలా పెట్టినా వాడు అది రెడీ అనుకుంటాడు కానీ, రెడ్డి అని వాడికి గోచరించదు. పెళ్లి సమయానికి వాడికి అర్థమవుతుంది వాడి సిలికాన్-లోయ ఉద్యోగం కంటే వాడి రెడ్డత్వమే విలువైందని!
అందుకే నేనంటా. రెండే కులాలండీ. ప్రేమించి పెళ్లిచేసుకునేవారు, ఆరీసీలో చదివినవారు.

అంతా అయ్యాక ఆంటీ నాకు ఉచిత సలహా ఇచ్చారు. "తొందరగా ఉద్యోగం చూసుకొని, పెళ్లి చేసుకొని, ఇల్లు కొనుక్కో నాయనా. అసలే బెంగుళూరులో ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి" అని. అంకులు "ఎం మాట్లాడాలో తెలియదు" అంటూ దూషించడం మొదులు పెట్టారు. ఎంటో ఏ ఆంధ్రా తల్లిదండ్రులను చూసినా ఒకేలా వుంటారు. బాస్టనైనా బెంగుళూరైనా. ఎవరికైనా "మా అమ్మానాన్నే అనుకున్నా ఎవరైనా ఇంతేనేమో" అనిపిస్తుంది.
ఆంటి ఆమె ఆత్మసమర్ధనలో "అందుకే గదండి సామెత ఉంది 'ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసి చూడు' అని" అన్నారు. నేను దాన్ని ఈ తరానికి తగినట్టుగా "వీసా పట్టిచూడు, పిల్ల పటాయించి చూడు" అని అర్థంచేసుకున్నా.

స్కంధము ౩
ఆ పని అయ్యాక నేను అక్కడికి దగ్గరలో వున్న ITPL కి వెళ్లాలనకున్నా. అది ఒక పెద్ద ఆఫీసు కాంప్లెక్సు. భారతదేశంలోనే అతి పెద్దది కావచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కడ పని చేసా. చాలా మధురానుభూతులున్నాయక్కడ. అవి నేను పూర్తిగా పెట్టుబడిదారువాదిగా (కాపిటలిష్టుగా) ఉండే రోజులు, భారతదేశం ఇంకా బీదగా వున్న రోజులు. కాబట్టి ఆ చోటును ఒక దేవాలయంగా భావించేవాడిని. ఇద్దరు ముగ్గురు యోగ్యులైన పరశురామక్షేత్రాంగనలు కూడా వుండేవారు. మొత్తం మీద నాకు చాలా ఇష్టమైన చోటు.

నా స్నేహితురాలొకమ్మాయి ఇంకా అక్కడే పని చేస్తుంది. ఆమెని కలసినట్లూ వుంటుంది, టెక్ పార్క్ చూసినట్టూ వుంటుంది అని చెప్పి నేను బయులుదేరాను. ఆమెకి ఫోను చేస్తే ఎత్తలేదు. మెసేజ్ వచ్చింది "నేను పనిలో వున్నాను, మీటింగ్ వుంది తరువాత పిలుస్తా" అని. "సరే నేను టెక్ పార్కు మాల్ లో కూర్చుంటా, నీ పనయ్యాక రా" అని మెసేజ్ పెట్టా. సరేనంది.

టెక్ పార్కుకి వెళ్లా. హెబ్బాగిలు(ముఖద్వారం) దగ్గర సెక్యూరిటసురుడు కనిపించాడు. నేనసలే నా అంకోపరి(లాప్టాప్) సంచితో, క్రెడిట్ కార్డు సేల్సుమాన్ లా వున్నాను. వాడు నన్ను ఐడీ చూపించమన్నాడు. ఎక్కడినుండి వస్తున్నావు? ఏ కంపెనీ? అని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టాడు. బాడ్జి చూపించమన్నాడు. నాదగ్గర లేదు. ప్రవేశం లేదన్నాడు. అప్పుడెప్పుడో అలమేలుమంగాపురంలో ఒక మహాభక్తుడు సూద్రుడు అవ్వడంచేత తాయారు గుడిలోనికి ప్రవేశం నిరాకరించరంట. కాని అతను భక్తిని ఆపుకోలేక లోనిక ప్రవేశించి, జైలు పాల్యాయడట. ఆఖరుకి రాజగోపాలాచారి అతని తరఫున వాదించి కాపాడారంట. రాజగోపాలాచారి ఎప్పుడో పోయారు కాబట్టి నేను అంత సాహసించలేదు.
అందుకే నేనంటాను. ఈ కాలంలో రెండే కులాలండి నిరుద్యోగులు, బాడ్జివున్న ఉద్యోగులూ.

ఆఖరుకి సెక్యూరిటీ అతనితో నా అమెరికా ఆంగ్లంలో వేడుకున్నా, వచ్చీ రాని కన్నడంలో వేడుకున్నా. అతను చలించక వచ్చీ రానీ ఆంగ్లలో "నో సార్. హౌ డు ఐ నో. యూ కాల్ కన్‌సరన్‌డ్ పార్టీ" అన్నాడు. నా తాయారుచూస్తే ఎవరో ఖండాతరం ఆస్వామితో టెలికాన్లో వుంది. వీడేమో ఆమెతో మాట్లాడందే లోనికి పోనియ్యనంటున్నాడు. కొంత సేపు అక్కడే నుంచుని దుఃఖించా. దేశానికి డబ్బులొచ్చి ఏం లాభం? మనిషిని మనిషి సేల్సుమాన్ కంటే హీనంగా చూడడానికా అని. అలా కొంత సేపు ఆదర్శ ప్రపంచానికి ఉపాయాలు ఆలోచించి, ఏమీ తట్టక ఇంకొంత దుఃఖించా. ఆఖరికి ధైర్యం తెచ్చుకొని, బుద్ధి కూడా తెచ్చుకుని, మా తాయారుకి ఫోను చేయమని సందేశం పంపా. ఎండలో ఎం నిలబడతాంలే అని, "ఆమె ఫోను చేస్తుంది, అప్పటివరకూ మీ ఆఫీసులో కూర్చుంటా" అని వాడినడిగా. వాడు సరేనన్నాడు.

రానారె-ఆదులు నా బ్లాగు చదివి తమ గురించి తాము సంతోషపడినట్లు, నేను "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!" అన్న శ్రీశ్రీ జీవిత చరిత్ర చదువుతూ "వీడికంటే నా పరిస్థితి నయ్యం" అని సంతోషించడం మొదలుపెట్టా. ఓ గంటసేపు చదివా. నా ముందున్న సెక్యూరిటీ అతను. "కాల్ సెయ్యొచ్చునుగా" అని అడిగాడు బెంగుళూరు తెలుగులో. ఆమె మీటింగులో వుంది, పదైదు నిమిషాల తరువాత ఫోనుచేస్తుంది అన్నా. సరే బ్యాగ్లో ఏముంది అన్నాడు. చూపించా, వీసా పాసుపోర్టు, ఇతరత్రా డాకుమెంట్లు, రెండు దేశాల డ్రైవరు లైసెన్సులూ వగైరా. మహా కవి శ్రీశ్రీ జీవితచరిత్ర చదువుతున్నాడు. సేల్సుమాను స్థాయికి దిగజారివుండడనుకొని నన్నులోనికి పొమ్మన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. కవిత్వం చదివేవారు. క్రెడిట్ కార్డులు అమ్మేవారు.
(అన్నట్టు మీకు తెలుసా శ్రీశ్రీని రెండుసార్లు పిచ్చాసుపత్రిలో చేర్చారని !)

స్కంధము ౪
లోపలికి వెళ్లి అలా అలా ఒక గంటసేపు తిరిగా. ఎంత సేపుకూ నా అలమేలుమంగ తాయారు ఫోను చెయ్యట్లేదు. ఇంతలో ప్రాంగణం అంతా ఒక రెండు సార్లు తిరిగిన నేను, వెళ్లిపోదామా లేదా అని అలోచిస్తూవున్నా. అసలే నేను మైసూరు వెళ్లాలి. దీపావళి రోజు, మా ఇంట్లో వాళ్లు ఎం సంబరాలు చేసుకుంటున్నారో ఏఁవో. కానీ మా తాయారుని కలవకుండా వెళ్లడానికి మనసొప్పలేదు. ఆవిడేమో, ఎవరితోనో టెలికాన్ లో వుంది. నేనైనా వేచివున్నా.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన అమ్మాయిలూ, చాలా అందంగా వున్న ఆ విషయం ఎరుగక వారి కోసమే చూసే బుద్ధిమంతులైన అబ్బాయిలూ.

ఆఖరికి ఆమె ఫోను చేసి నేను ఇంకొంత సేపులో వచ్చేస్తున్నా అని చెప్పింది. నేను మైసూరు వెళ్లాలన్న విషయం ఆమెతో చెప్పలేదు. ఇంకో గంటైనా ఇంకా అత్తా పత్తా లేదు. ఈ సారి నేనే ఫోను చేసా, ఏడవ్వచ్చు అంది. నాకు లేటవుతుందని నేను బయలు దేరతానని అన్నాను. పోనీలే తాయారుని కలవకపోయినా, మంగాపురం వచ్చాగా అని ఆత్మసంతాపం చేసుకొని వెనక్కి బయలు దేరా. బస్సు స్టాండులో నించుని. మెజెస్టిక్ వెళ్లే బస్సులు వస్తాయా అని అడిగా. వస్తాయన్నాడు. కొంత సేపటికి వాల్వో ఒకటి వచ్చింది. అది మహాతాంత్రిక బెంగుళూరులో మహాతాంత్రిక సిటీబస్సు. నా ప్రక్కతను, అదిగో బస్సన్నావుగా వచ్చింది అన్నాడు వెటకారంగా. వాల్వో సిటీ బస్సులలో రేటు రెండింతలుంటుంది. నేను అతనిని, సిగ్గు విడిచి, నా నిర్జీతాన్ని దాచుకోకుండా, టికెట్ ఎంతుంటుంది అనడిగా. తెలియదన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. డబ్బున్నవారు మఱియు లేనివారు, తమ దగ్గర డబ్బుందో లేదో తెలియని వారూ.

స్కంధము ౫
ఎక్కనే ఎక్కా. అట్లాంటాలో బస్సెక్కినట్టుంది అచ్చంగా. బయటేమీ కనిపించట్లేదు. అద్దాలకి నిండా పొష్టరుండడం వలన బయటేఁవీ కనిపించట్లేదు. దూరం పాతిక కిమీలు. టికెట్టు పదిహేనంట. మీకు కూడా పదిహేనని వినిపించిందా. కాదు యాభై. ఫిఫ్టీ! పోనీలే అని ఇచ్చా.
ఈ అమ్మాయిలని నమ్ముకోకూడదు, ఎప్పుడూ ఇలా నమ్మించి వంచిస్తారు.
ఉ. అంగన నమ్మరాదు తన యంకకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు... భాస్కరా
అదీను, నన్ను మానేసి నా పాత రూమ్మేటుని ప్రేమించిన వారిని అస్సలు నమ్మకూడదు!
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన పరశురామక్షేత్రాంగనలను ప్రేమించిన మనము, వారిని షారూఖ్ ఖాన్ శైలిలో బుట్టలో పెట్టిన మన వంగదేశ రూముమేటులు.

ఇంతలోకే ఫోను మోగింది. "హలో ఎక్కడున్నావ్ ? నా టెలికాన్ అయ్యిపోయింది" అంది తాయారు. "అయ్యో నేను బస్సెక్కాసానే" అన్నా. అలా కొంత సేపు నేను నా పది దేశాలు తిఱిగిన యాసవున్న ఆంగ్లంలో; ఆమె తన బండీ ఱలతో, ళలతో అప్పుడప్పుడూ ೞలతో కూడుకున్న మలయాళీ యాసలో మాట్లాడుకున్నాం. ఇంతకీ అమెకి వాళ్ల దీపావళి అయిన గురువారం నరక చతుర్దశినాడూ, మనకు దీపావళి అయిన శుక్రవారం అమావాశ్య నాడూ రెండు రోజులూ శెలవులేనంట. కానీ పనుండి ఆఫీసులోనే వుండవలసి వచ్చిందంట.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. నిరుద్యోగులు, మన పండుగనాడు తెల్లవాళ్లకు బానిసలయ్యేవారూ.

తరువాత ఎఱ్ఱగౌడ బస్ స్టాండులో మైసూరు బస్సెక్కి, బెల్టు పెట్టుకున్నా. వాడు ౯౦కిమీ ప్రతిగంట వేగంతో తోలి రెండు గంటలలో ౧౩౦ కీమీలు దాటాడు. ప్రయాణంతో ప్రమాదం ఉచితంగా ఇచ్చి నన్న మైసూరులో దించాడు. అప్పటికే మావారందరూ దీపావళి జరుపుకుని నిద్రపోవడానికి సిద్ధవఁయ్యారు. నేను వరుసగా లెక్క మఱచి పోయినన్నేళ్లు దీపావళి జరుపుకోనందుకు సంతోషించి, నాలుగేళ్ల క్రితం అదే ITPLలో పని చేసే వేరే పరశురామక్షేత్రాంగని తో దీపావళి నాడు బ్ససులో తిరగడం గుర్తుతెచ్చుకొని, నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నించా.

జీవితం మొత్తం మీద మూడ నాలుగు దీపావళులకన్నా ఎక్కువ ఎప్పుడూ జరుపుకోలేదేమో. దానికి తోడు ఈ మధ్య భూవాతావరణ ప్రేమ ఒకటి అపారంగా పుట్టుకువచ్చింది. అప్పుడెప్పుడో దగ్గర దగ్గర పన్నెండేళ్ల క్రితం దీపావళికి మందులులేవేంటి అని అడిగితే, మా అమ్మ డబ్బులిచ్చి, మాలపల్లి పంపించి, కొనుక్కు తెచ్చుకోమన్న విషయం గుర్తొచ్చి, తెలియన బాధ చాలా వేసింది. చాలా దీపావళులతో పోలిస్తే ఈసారి దీపావళి బాగానే అయినట్టే.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. దీపావళిని సంతోషంగా జరుపుకునే వారు, మానసిక వైద్యుల అవసరం వున్నవారు.

గుఱజాడ వాక్కుః రెండే కులాలు. వివేకులు, అవివేకులు.

Wednesday, November 07, 2007

కందం, మందం, బావతో సరసం

కందం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. తెలియదా ?
అయితే ఇక్కడ కందం గురించి చూడండి. కందానికి ముందు మీరు గురు లఘువుల గురించి నేర్చుకోవాలి. వాటికి లంకె. అబే లాభంలేదు, లంకెలిస్తే మాత్రం ఎవరు చదువుతారు అంటే, ఇకనేనే విన్నవించుకుంటా.

లఘువు (గుర్తు I)
సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు ఉదా: అ, ఌ, ఎ, ఘి, పు, తృ, వఁ, ళొ వగైరా

గురువు (గుర్తు U)
క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి. ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, కౄ, చా, డం, నః, రై వగైరా
ఒక అక్షరం తరువాత పొల్లక్షరం వస్తే అది కూడా గురువౌతుంది. ఉదా: అక్, విశ్, ముల్, నెన్ వగైరా

ఒక పాదం మఱియు దాని గురులఘువిశ్లేషణ
"శారికా కీరపంక్తికిఁ జదువు సెప్పు"
శాU రిI కాU కీU రI పంక్U తిI కిఁI జI దుI వుI సెప్U పుI
గమనించ వలసిందేంటంటే సెప్పులో సె గురువు ప్పు లఘువు!

కందం
పైన చెప్పినట్టు గురువులకు రెండు మాత్ర(లిప్త)ల కాలం, లఘువుకు ఒక మాత్రాకాలం పడుతుంది. అంటే లఘువుకి రెండింతల కాలం పడుతుంది గురువుకి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ నిష్పత్తి ౧.౪౬౧౨౫ కి దగ్గరలో వుంటుంది. మీకు తెలుగు అంకెలు చదవటం రాదు కాబట్టి రెండని అనుకుందా.

కందం పద్యాన్ని నాలుగేసి మాత్రలగా విడగొట్టవచ్చు. నాలుగు మాత్రలంటే ప్రతి గణం
నల IIII
భ UII
జ IUI
స IIU
గగ UU
గణాలలో ఒకటై వుండాలి.

ఉదా:
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
UII UII UII (భ భ భ)
మప్పటి కామాటలాడి - యన్యుల మనముల్
UII UU IUI - UII IIU (భ గగ జ - భ స)
నొప్పిం పక తా నొవ్వక
UU UII UII (గగ భ భ)
తప్పించుక తిరుఁగువాడె - ధన్యుడు సుమతీ
UU IIII IUI - UII IIU (గగ నల జ - భ స)

కందంలో ౩, ౫, ౩, ౫ గణాలతో నాలుగు పాదాలు రాస్తే చాలు.
కానీ అలా వుంటే మఱీ అందరూ వ్రాసేస్తారు, ఇక కవిత్వం అందరికీ వచ్చేస్తుంది, సమాజం బాగుపడిపోతుందని, కొందరు ఛాందసవాదులు ఇంకా చాలా అనవసర నియమాలు పెట్టారని కొందరి అభిప్రాయం. నేను దానితో ఏకీభవిస్తానా లేదా అన్నది అప్రస్తుతం, అప్రముఖం.
ఉదా- పై పద్యంలో ప్రతి పాదానికి రెండో అక్షరం 'ప్ప' వుంది. దీనిని ప్రాస నియమం అంటారు (ఇంకా ఇలాంటి నియమాలు చాలా ఇక్కడ వున్నాయి)

భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు, అరసం
వెనకటి రోజుల్లో చదువుకునే కాస్త మందీ, తెలుగొక్కటే చదువుకునే వారు. కాబట్టి వారికి క్లిష్టమైన ఛాందస నియమాలు పెద్ద లెక్కకాదు. కానీ తెల్లవాళ్లు లెక్కలు, తుపాకులూ చదువుకుని ఇతరులపై రాజ్యం చెయ్యడం చూసి, మనవారు కూడా తెలుగుని పక్కన పెట్టి లెక్కలూ, లైంగిక మనస్తత్వ శాస్త్రాలూ చదవడం మొదలు పెట్టారు. కాబట్టి నియమాలు పాటించడం కష్టమయ్యింది, భావాలకి ఛందస్సు అడ్డు పడడం మొదలయ్యింది.
అందుకే ౧౯వ శతాబ్ధం మొదట్లో భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు వంటి ఉపాయాలు వేసారు కవులు రచయితలూ కనుగొన్నారు. ఆ కవుల సంఘాలే అరసం, విరసం వగైరా! నేను ఆఱునెలల క్రితమే తెలుగు చదవటం మొదులు పెట్టాను, కాబట్టి నాకు పెద్దగా వాటితో సంపర్కం(టచ్చి) లేదు. అందుకే మీరు తెలియ జెప్పుతారని లంకెలిచ్చా.

మాత్రా ఛందస్సు
ఇది మాత్రలమీద ఆధారపడి వుంటుంది. కందంలోని గణాల నియమాలు తప్ప ఇతర నియమాలు తీసేస్తే ఒక విధంగా మాత్రాఛందస్సు వర్తిస్తుంది.
ఇందులో గురువు U = ౨, లఘువు I = ౧ అని వూహించుకొని, ఒక పాదం పలకడానికి ఎన్ని మాత్రలు పడతాయే లెక్కవేసి, అన్ని పాదాలకూ ఒకే మాత్రా బరువుండేట్టు చూడాలి.
ఉదా:
ప్రతిజ్ఞ (పాదానికి నాలుగు నాలుగు మాత్రల గణాలు, అంటే పదహారు మాత్రలు)
పొలాలనన్నీ, హలాలదున్నీ, (జ గగ జ గగ)
ఇలాతలంలో హేమం పిండగ (జ గగ జ భ)
జగానికంతా సౌఖ్యం నిండగ (జ గగ జ భ)
విరామమెరుగక పరిశ్రమించే, (జ నల జ గగ)
బలం ధరిత్రికి బలికావించే, (జ భ భ గగ)
కర్షక వీరుల కాయం నిండా (భ భ గగ గగ)
కాలువకట్టే ఘర్మజలానికి, (భ గగ భ భ)
ఘర్మజలానికి ధర్మజలానికి, (భ భ భ భ)
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌! (భ భ ద గగ)

బావ కవిత్వం
కొత్త సహస్రాబ్ధిలో తెలుగు నేర్చుకునేవారు బాగా తగ్గిపోవడంతో, కవిత్వాలు రాయడం కష్టఁవవ్వడ్డంతో, నేను కొత్త కవితా విధానం కనుగొన్నాను. ఇది ఒక శతాబ్ధం క్రితం గుఱజాడ కనిపెట్టిన మాత్రాఛందస్సుకు అక్రమ సంబంధాల ద్వారా కలిగిన సంతానం. దాని పేరే

మందం
ఇందులో నాలుగు పాదాలు పాదానికి నాలుగు గణాలు గణానికి నాలుగు మాత్రలు! ౪ x ౪ x ౪= ౬౪
అఱవై నాలుగు మాత్రల అఱుదగు
నీలారవింద హారం మందం!
(స భ భ నల; గగ జ గగ గగ)
రెండు పాదాలున్న దీని అరమందం అంటారు. కావాలంటే మందం ఇంకా తగ్గించి పావు మందాలు కూడా వ్రాసుకోవచ్చు!

మందం ఉదా:
చదువెందుకు సంక నాకడానికి !
గురువెందుకు గుద్ద నాకడానికి !
పదిగోవులు కాసుకున్న, పాశము
దొరుకును గదరా ధరిలో సుమతీ!
(స స జ భ; స స జ భ; స స జ భ; స స స స)
దీని కన్నా పరమ సత్యం వుందా? ఎంత అద్భుతంగా వుంది పద్యం! చూశారా ఛందస్సుని కొద్దిగా తగ్గించి బావం మీద బుఱ్ఱపెడితే వజ్రాలు రాలతాయి!
వివరణ: ఇది వ్యవసాయ పొలాల్లో తరతరాలుగా వినబడుతున్న పద్యం. భూమిని నమ్ముకోవడంలోని ఆనందాన్ని, చదువు యొక్క అప్రయోజనాన్ని తెలిపే చాటువు.

గొప్ప తగ్గింపు
ఇంతకీ భావ కవిత్వానికీ బావ కవిత్వానికీ వున్న ముఖ్య వ్యత్యాసం చెప్పనేలేదు కదా. మా బావ కవిత్వంలో మీకు నియమాలు ఇష్టమైతేనే పాటింటవచ్చు. లేక పోతే మానేయ్యవచ్చు.
కాబట్టి, పైన చెప్పబడిన ౪x౪x౪ నియమాన్ని పాటించకపోయినా మీరు దాన్ని మందం అనిపిలుచుకోవచ్చు. కానీ మందం కొద్దిగా తగ్గుతుంది.

బుద్ధి మందం ఉదా:
చెండాలం చెంబులవాద్యం
సాయంత్రం సాంబారన్నం
పిల్లి తినని పిండాకూడూ
బల్లి వదిలిన తెల్ల తోకా
పందిఁ చంపిన పిల్ల బంటూ
కంది పప్పులో గుండ్రాయీ
- వద్దోయీ నవకవనానికి
(ప్రతి పాదానికి పద్నాలు మాత్రలు)

ప్రశంస
మా మందానికొచ్చిన ప్రశంసలు కొన్ని
"మందం is the modern day scalable alternative to మత్తేభం" - సాయంకాలం.నెట్
"మందం మన శతాబ్ధ కవిత్వానికే మేకప్ ఆర్టిష్టు" - ఆమాట.కామ్
"మందమా మందగామినా" - సృజనభంజని.ఆర్గ్
"మందగిస్తున్న మాడరన్ కవిత్వాన్ని మందాగ్నిలా తాకిందీ మందం" - పాతపెన్ను.బ్లాగుస్పాటు.కామ్
"మందమా! చాటంత దానందమా!" - కోడలి.ఆర్గ్
"సుమతీ పక్కకి తప్పుకో వచ్చేసింది మందమతీ" - చల్లెద.కామ్

బావతో సరసం
మీరూ మాలాగే మందాల అందాల అర్ణవాల లోతులు తీయ్యాలని ఆరాట పడుతున్నారా? ఆగలేకున్నారా? అయితే వెంటనే చేరండి "బావకవుల తోవలో సరదా రాసేవారి సంఘం" (బావతో సరసం)!

Saturday, November 03, 2007

ఆర్కుట్ లో తెలుగు

"సినిమాలలో హ్యాపీడేస్ ఎలాగో, అంతర్జాలంలో ఆర్కుట్ అలా" అనేది మీలో ఆర్కుట్ అకౌంటు వున్నవారికి తెలిసిన విషయమే ! అకౌంటు లేని వారు ముందు హ్యాహీ డేస్ చూసి తరువాత ఆర్కుట్ అకౌంటు తెరవండి ! అప్పుడు అర్థమవుతుంది! అప్పటికీ అర్థమవ్వకపోతే, అక్కడ వున్న హ్యాపీ డేస్ అనే కమ్యూనిటీలో చేరండి ! అప్పుడు అర్థమవుతుంది బ్లాగులకంటే పెద్ద వ్యసనం, వాటికంటే చెత్త టైం పాస్ ఇంకోటి వుందని !

ఇంతకీ మంచి మాటేంటంటే,
బ్లాగులు తెలుగులో వచ్చి నట్లు ఆర్కుట్ కూడా తెలుగులో వచ్చింది.
మీ హోమ్ కి వెళ్లి అందులో ఎడమ పక్క పట్టీలో సెట్టింగులు లో Display Language ని తెలుగు లోకి మార్చుండి. మీ ఆర్కుట్ అనుభవం తెలుగులోకి అనువదించబడుతుంది.

ఆర్కుట్ నుండి కొన్ని అనువాదాలు
Home హోమ్
Settings సెట్టింగులు
Album ఆల్బమ్
Scrapbook స్క్రాప్బుక్
Communities కమ్యూనిటీలు
State స్టేట్
Add Stuff స్టఫ్ చేర్చుట

Passions - transliterate passions as is to telugu, ఇష్టాలు
Activities కార్యకలాపాలు
Email ఇమెయిల్, e- చిరునామా
Relationship Status సంబంధ స్థితి
Single ఒంటరి (How true!)
Here for ఇక్కడ ఎందుకోసం
Children: None పిల్లలు: లేదు

Edit సవరించు
Sexual Orientation లైంగిక దృక్పదం (మరిన్ని వివరాలు ఇవ్వదలచుకోలేదు, మీరే చూసుకోండి)

కొన్ని సవరణల అవసరం వున్ననూ, తెలుగులో వారి గూడును ప్రవేశపెట్టినందుకు ఆర్కుట్ మఱియు గూగుల్ వారిని నిజంగా అభినందించాలి!

ఇప్పుడే గమనించిన విషయం :
ఆర్కుట్ లో మీ ప్రోఫైలుకి మీ బ్లాగు చేర్చవచ్చు, పైన పోర్కొన్న స్టఫ్ చేర్చు లో స్టఫ్ అంటే బ్లాగులు ఫీడులు వగైరా అంటా! ఇంకేంటి అగ్నికి పెట్రోలు తోడైనట్టే!

Tuesday, October 30, 2007

అట్లాంటాలో అప్పుడెప్పుడో

కొత్తపాళీ గారి టపాలో నృత్య ఫోటోలు చూసి నాకు అప్పుడెప్పుడో అట్లాంటాలో నే వెళ్ళిన ఒక నృత్య ప్రదర్శన గుర్తొచ్చింది.
అవి ఆడుతూ పాడుతూ తిరిగే రోజులు, లెక్క ప్రకారం ఉద్యోగం వెతుక్కోవలసిన రోజులు. కానీ వీసాలు రెండు రోజులలో అయ్యిపోయేసరికి, నాలా ఆదర్శాలెక్కువా చొ౨రవ తక్కువా వున్న వారికి, అనంతమైన శెలవలు వీసా లేమి రూపంలో నాఱుమళ్లపై వర్షంలా వచ్చి పడ్డాయి.

అలాంటి రోజుల్లో ఎక్కడ ఉచిత భోజనం దొరికితే అక్కడికి పరుగెత్తుకెళ్లడం చేసేవారం. అలానే కొన్నేళ్ల క్రితం మాహాచొ౨రవుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర కొద్దిగా చదివా. ఆయన కూడా కాలేజీ మానేసి కాళీగా కూర్చున్న రోజుల్లో ఎక్కడ ఉతిచ భోజనం దొరికితే అక్కడికి వెళ్ళేవాడంట. మనలా నాలుగూ పాయింట్ సున్నాల వెంట పడక, చ౨దువు సగంలో లోనే ఆపేశాడు. ఆలా అన్నదానభక్షణలో భాగంగా ప్రతి శనివారం దగ్గరలో వున్న హరేకృష్ణ మందిరానికి ఐదు మైళ్లు నడిచి వెళ్లేవాడంట. ఆయన అడుగుజాడల్లో నేను కూడా మా దగ్గరో వున్న హరేకృష్ణ మందిరంలో ఆనాడు అన్నదానం వుందని తెలిసి, నడుచుకు వెళ్దామని మా మిత్రులకు సూచించా. మా మిత్రులు "ఆఁ ఎంత గ్రాడ్ స్టూడెంట్లైతే మాత్రం ఒక రెండు డాలర్లు పెట్టి బస్సెక్కి వెళ్లలేమా" అన్నారు ఎయిడ్ వుందన్న గర్వంతో.

సరే అని అందరం బస్సు స్టాండుకు వెళ్లాం. అందరం బస్సుకూడా ఎక్కాం. నేను టికెట్టు డబ్బులు కట్టా. కానీ మా మిత్రులకు దేశీ చొ౨రవ ఎక్కువే, కాబట్టి టికెట్టు లేకుండా ప్రయాణం చేసే విధానం ఒకటి కనుగొని గమ్మున కూర్చున్నారు. ఎంట్రా అంటే, "నీలా మాకు ఆదర్శాలు లేవురా" అని మంచిగా మనవి చేసారు. తెలుగు సినామా హీరోయిన్ వంటిపై వుండీ-వుండని అంగ వస్త్రాల్లాగా నన్ను కప్పీ-కప్పని నా ఆదర్శాలను చూసి నాకు సిగ్గేసింది. అంతలో వారిలో తెలివైన వాడు, "ఆదర్శఁవనేది వుత్త భ్రమ" అని నన్ను భ్రమింప జేసి, హఠాత్ పవన వీచికతో అటే తొలగింపజేసాడు నా ఆదర్శాంగవస్త్రాలను.

ఇంతకూ గుడికి వెళ్లాం, ప్రార్థన చేసాం. "ఏంటీ ఇంకా ఘుమఘుమలు ఎక్కడ తగలట్లే"దని విచారిస్తే. భక్తులు దగ్గరలోని 'పీడుమాంటు పార్కు'లో జగన్నాథుని రథచక్రాలు కదిలిస్తున్నారని చెప్పారు. మొయిల్ దారిన బయల్ దేరిన జగన్నాథ రథచక్రాల్‌ని ఇలా పార్కులలో నిర్బంధించారని దుఃఖించినా, వాటినసలు అమెరికాలో దింపినందుకు సంతోషించాము.
రథచక్రాల్ లాగిన భక్తులు, వాల్వో చక్రాలపై రానేవచ్చారు. మంచి సాత్విక భోజనం పెట్టనే పెట్టారు. వారికి పుణ్యం బాగా అందాలనే సదుద్దేశంతో మేము రెండురెండు సార్లు పెట్టుంచుకొని మరీ తిన్నాము.

ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. వారు రాక్ మఱియు రోల్ శైలిలో భక్తి పాటలు పాడారు. పర్వాలేదని పించాయి. ఆ తరువాత ఒక ఉత్తర భారతాది తల్లితండ్రులు తమ బిడ్డల నాట్య ప్రావిణ్యాన్ని చూపించడానికి ఇదే అవకాశమని చెప్పి, ఆ పిల్లల్ని బలివితర్ది ఎక్కించారు, కానీ బలైంది మాలో కొందరు. కానీ పిల్లలు కదా నేర్చుకోవడానికి ఇంకా సమయం వుందిలే.

ఆ తరువాత వచ్చారు. ముగ్గురు అప్సరసలు.
వారిలో ముందు పొడుగమ్మాయి వచ్చింది. పొడుగ్గా చాలా బాగుంది. ఆమే ఒంటరిగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. తరువాత ముగ్గురూ కలిసి నర్తించారు. సాల్సానో రుంబానో ఖచ్చితంగా కనిపెట్టగలను గానీ, భరతనాట్యమో కదక్కో అంత ఖచ్చితంగా చెప్పలేను. కానీ తెల్ల బట్టలు వేయలేదు కాబట్టి మా మలయాళ మోహన 'మోహినీ ఆట్టం' అయితే కాదు. పళ్ళాలూ, చెం౨బులూ లేవు కాబట్టి మన కూచుపూడీ కాదు. ఇక తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత పాటలకు నర్తించారు కాబట్టి కదక్ మఱియూ ఒడెస్సీ అవ్వవు. "ఇది భరతనాట్యమే అయ్యివుండాలి" అని నిర్దారించాను.

నృత్యం అత్యద్భుతంగా వుంది. అప్పుడప్పుడూ మనకి అనిపిస్తుందిగా "వామ్మో వీళ్లు చాలా బాగా నర్తిస్తున్నా"రని, అలా అనిపించింది నాకు కూడా. ఇక ఇద్దరు చిన్న కవల పిల్లలైతే వేదిక ముందు బుడతనాట్యం చేయడం మొదులు పెట్టారు. ఎంతైనా చాలా మఱపు రాని అనుభవం. మీతో పంచుకోవాలని ఫోటోలు కూడా తీసాను. కాని అవి మా స్నేహితుడి కెమరా ఫోనులో వున్నాయి ఖండాంతరాన. కాబట్టి ప్రస్తుతనానికి నా అద్వితీయమైన వర్ణనా ప్రతిభ మీదే మీరు ఆధారపడి సరిపెట్టుకోవాలి.

సాంప్రదాయమైన భరతనాట్య దుస్తుల్లో వున్న వారు దేశీయులా అమెరికన్లా అని చాలా సేపు అనుమానపడ్డా. చూడడానికి పదహారణాల తెలుగమ్మాయిల్లావున్నారు. కానీ ఆఖరుకి వారు ఇద్దరు తెల్ల అమ్మాయిలూ, ఒక నల్ల అమ్మాయీ అన్న కఠువు నిజాన్ని దిగమింగుకున్నా. ఎంటో వోణీ వంటివి వేస్తే ఎవరైనా మన తెలుగమ్మాయిల్లానే వుంటారు. వారి గురువు ఓ తెల్ల ఆయన, ఆయన నిక్షేపంగా నిక్కరేసుకొచ్చారు, పైగా నెత్తిమీద బ్లాండు జుట్టు వుంది, కాబట్టి ఈయన నూరు సెంట్ల అమెరికన్ అని కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. వారి పాఠశాల ఫ్లారిడాలో వుందిట.

అంతా అయ్యిపోయాక దక్షిణం(సరైన పదం తెలియదు) అడగడానకి దోసిళ్లతో ప్రేక్షకుల మధ్యకి వచ్చారు. చేతులు చాచని అమెరికాలో ఇలా అహంకారాన్ని చంపుకోవడం చాలా అభినందించవలసిన విషయం. ఆ అమ్మాయి దగ్గరకొచ్చి అడిగే సరికీ, 'ఆః' లో వున్న నేను జోబులో వున్న డబ్బంతా చేతికిచ్చేసా. మాజీ విధ్యార్థి, కొత్త నిరుద్యోగిని కాబట్టి, చిల్లరతో కలిపి ఐదు డాలర్ల కంటే ఎక్కువేం లేదు. కానీ ఇచ్చిన తరువాత తెలిసింది ఇంటి కెళ్ళడానికి బస్సు టికెట్ డబ్బులు కూడా లేవని.

మా మిత్రులేమో, భోజనం అయ్యిందిగా అని, నృత్య ప్రదర్శన కోసం ఆగక బస్సుకోసం రోడ్డు మీద నించున్నారు. అవకాశవాదులూ, దురదృష్టవంతులూ ఏం చేస్తాం. ప్రదర్శన అయ్యిన సమయానికి నాకు ఫొను చేసి "నీ కోసం బస్సు ఆపాం, తొందరగా రా" అని ఫొను చేసారు. నేను పరిగెత్తుకు వెళ్లి, షూలు ధరించి, మైదానాలు దాటి, అగడ్తలు దూకి, రోడ్లు లంఘించి, సిగ్నల్లు లక్ష్యపెట్టక, ప్రాణాలు పణంగా పెట్టి, నా కోసం ఆగిన బస్సెక్కి, నా కోసం ఆపిన బస్సారథికి ధన్యవాదాలు తెలిపి, ఊపిరందుకుని, తీఱికగా నా దగ్గర టికెట్టుకి డబ్బు లేదన్న విషయాన్ని గ్రహించాను.

డబ్బు లేని చోట ఆదర్శాల లేమి టిక్కెట్టు పెడుతుంది. అవి రెండూ లేనప్పుడు చొ౨రవ టిక్కెట్టు పెడుతుందన్నది వేదవాక్కు. కానీ అది కూడ లేని వాడికో? సిగ్గు లేమి టికెట్టు పెడుతుంది! తమ కోసం కూడా టికెట్టు తీసుకోని మా మిత్రులు నా కోసం రెండు డాలర్లు వెచ్చించారు. ఆ అనుభవం కూడా ఎంతో మఱపురానిది.

Saturday, October 13, 2007

నిరుద్యోగులు

అంతేలే, నిరుద్యోగ రెజ్యుమేలు !
కంచల్లే మ్రోగే ఖాళీ చెంబులు !
మానవ వనరుల భామల బల్లలపై,
పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !

అంతేలే, నిరుద్యోగ ఈమెయిళ్లు !
వ్యాకరణం వాడని తిరస్కారములు !
అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !

అంతేలే, నిరుద్యోగుల అర్హతలు !
సిగ్గువిడిచిన సినిమా హీరోయిన్లు !
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !

అంతేలే, నిరుద్యోగ జీవితాలు !
జీతం పెట్టని మహోద్యోగాలు !
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !

అంతేలే, నిరుద్యోగ భోజనాలు!
పూరీలు, పరాటాలు, పులావులు,
పాల పాయసాలు, పెసరపప్పు చార్లు !
పర్సు కాళి గాని పేగు కనలనీరు !


లంకెలుః పేదలు, శ్రీశ్రీ, Les Pauvres, Emile Verhaeren

Sunday, October 07, 2007

బుక్కులు

వైరు లెస్సు,
లిప్పు కిస్సు,
సెక్సి మిస్సు-
కామంగా చూడకు దేన్నీ!
సోది మయమేనోయ్ అన్నీ!

బీరు బుడ్డి,
మఱుగు దొడ్డి,
ఎఱువు చెడ్డి-
నీ వైపే చూస్తూ వుంటాయ్!
తమనింకా ఏస్‌కో మంటాయ్!

ఉచ్చమల్లి,
పచ్చ కిల్లి,
వెచ్చ బుల్లి-
కాదేదీ బ్లాగు కనర్హం!
ఔనౌను టపాలనర్ఘం!

ఉండాలోయ్ బ్లాగావేశం!
కానీవోయ్ నస నిర్దేశం!
దొరకవటోయ్ హిట్లశేషం!
నోరంటూ వుంటే మెక్కి,
బ్లాగుంటే వ్రాసీ!

బ్లాగ్లోకమొక మురికి వరద!
బ్లాగడమొక తీరని దురద!


బ్లాగ్బహిష్కరణ చేసుకోవాలనుకున్నా కానీ, ఆముదము తాగిన వాడికి విరేచనం వచ్చినట్లు సృజన శక్తి పేగుల్లో దట్టిగా నిండి వుంది. 'విసర్జన' చేస్తే కాస్త అంత్రానలము చల్లారుతుంది, తెలుగు సాహిత్యానికి తీరని నష్టమూ తప్పుతుందని ఈ టపా వేస్తున్నాను! ఇంకో సారి చదివి మరీ ఆస్వాదించిండి.

ఈ కవనశిఖరాన్ని అధిరోహించడానికీ, పూర్తిగా ఆస్వాదించడానికీ కొన్ని లంకెలు
మహాప్రస్థానం, శ్రీశ్రీ, హ గణం, బ్రౌణ్యం

Friday, September 21, 2007

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతం
ఇది తెలుగు సినిమా పరిస్థితి శీర్షికతో వేస్తున్న టపద్వయంలో రెండవది. ఒకటే పెద్దది, వ్రాస్తే మీకు సోదనిపించవచ్చని రెండుగా విడదీయడమైనది. మొదటిది సినిమా పతనం గురించి, రెండవది, దాని పనరుత్కృష్టం గురించి మనము కనగలిగిన కలలకు కల కరాణాల గురించి వ్రాద్దామని నిశ్చయించాను. కానీ అలా చేసిన విభజనలో, నిరాశతో కూడినది ౯౦శాతం, ఆశతో కూడినది ౧౦శాతం గా కనిపించాయి! (దానిలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు). అందుకే రెండు సగాలుగా విభజింజడం జరిగింది. క్రిత టపాకి తరువాయిగా దీన్ని పరిగణించగలరు.

కాపీ రాజులు
నాకు భగవంతుడు పనికిరాని ప్రజ్ఞ ఒకటి పెట్టాడు. అది ఎఁవటంటే, ఒక సినిమాని అరనిమిషం చూసినా అది దేనినుండి కాపీ కొట్టారో, లేద దేనికది కాపీనో చెప్పగలను. మొన్న ఒక రోజు 'ఎ షాట్ ఇన్ ది డార్క్' చూస్తుంటే, అరే ఇది చంటబ్బాయే అని అనుకున్నాను. ఇన్స్‌పెక్టర్ జాక్వస్ క్లసో ని కొట్టడం ఎవరి తరమూ కాదు, మన చంటబ్బాయి తరం అసలు కాలేదు. అప్పటి వఱకూ చంటబ్బాయి మీద చాలా అభిమానవుండేది. కానీ ఆ రోజు, సాంటా క్లాజ్ లేడని అర్థవఁయ్యింది. చంటబ్బాయి పూర్తగా కాపీకాదులెండి, అందులోని చాలా మంచి భాగాలు మాత్రమే కాపీలు. మిగిలిన మెలోడ్రామా అంతా, మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన ఒక నవల మీద ఆధారం. నానా రకాలు కలిపితే కుడిత తయారైనట్టు, రెండు మూడు సినిమాలు కలిపి ఒక తెలుగు సినిమా తియ్యడంచాలా సార్లు జరుగుతుంది. అలాంటిదే ఇంకో ప్రయోగం 'మైఁ హూఁ నా' కి 'ది డిపార్టెడ్' కలిపితే వచ్చిన కషాయం 'ఖతర్నాక్'.

మీకో మలయాళీ మిత్రుడుంటే అడగండి, మలయాళంలో అతి మంచి సినిమా ఏదని? (మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి). చాలా మంది 'మణిచ్చిత్రత్తాೞು' అనే చెబుతారు. దాన్ని తెలగుతమిళాల్లో 'చంద్రముఖి'గా తీసి కంపుచేయడం జరిగింది. అసలు సినిమాలో మోహన్ లాల్ సినిమా సగంలో వస్తాడు, (రజనీలా ముందు వచ్చి మళ్ళీ వెళ్ళడం వుండదు). ఇప్పుడు అదే సినిమాని హిందీలో తీస్తున్నారు. అన్ని హిందీ సినిమాల్లోలాగ ఇందులో కూడా అక్షయకుమారు, విద్యాబాలన్ నటిస్తున్నారు. సినిమా పేరు 'బూలుబులయ్యా'. నాకు మామూలుగా సినిమా ప్రకటన చూస్తేనే అది దేని కాపీనో అర్థమవుతుంది, కానీ ఈసారి అలా జరగలేదు. దానికి కారణం. "హరే రాం, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రాం" అనే పాట వుంది ఆ సినిమాలో. అందులో, నిక్కర్లేసుకున్న ఫారిన్ అమ్మయుల వెనుక భాగం తూగుతూ చూపించబడినది. సినిమా కథకీ, సినిమా లోగోగా వాడుతున్న ఆంగ్ల భూతం బొమ్మకీ, పాటలో భగవన్నామ స్మరణకీ, మారుతున్న దుస్తులకీ, ఆ అమ్మాయిల వెనుకలకూ గల సంబంధం నాకు గోచరించలేదు.

కాపీ కొడితే తప్పేంటి ?
అందరూ అడిగే ప్రశ్న "కాపీ కొడితే తప్పేంటి? ఆఖరున సినిమా బాగుంటే" అని. చాలా తప్పులున్నాయి.
గమనికః హక్కులు కొని సినిమాని తీయ్యడం కాపీకాదు.

నైతికంగా
సినిమాలో కాపీ అనేది సంఘంలో కాపీకి ఒక నిదర్శనం మాత్రమే. ఈవాళ ఆంధ్ర దేశం నైతికంగా ఎంత దిగజారిపోయిందో, తెలియాలంటే, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్లలో, పదో తరగతి పరీక్షల కిచ్చే శిక్షణ గురించి తెలుసుకోండి. కాపీ కొట్టమని చెప్పి మరీ పంపుతారు పిల్లల్ని. అలా ఆఖరుకి ఎవరైతే వ్యవస్థని వంచి, పెడదారి వెంట పిల్లలందరినీ పాస్ చెయిస్తారో వారే ఘనులు. అలా పాసైనోళ్లు, రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు, వారే కలక్టర్లు, వారే కాంట్రాక్టర్లు, వారే రాజకీయవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఇంక చెప్పేదేఁవుంది ?
బొట్టూ బొట్టూ కలిస్తే వరదౌతుంది, ఆ వరదలో దేశం మునకెత్తుతుంది.
మన కంపు ప్రపంచమంతా ప్రసరిస్తుంది.

సృజనాత్మకత పరంగా
మన సృజనాత్మకత నుండి జనించిన కళ మనకు మనోరంజనం మాత్రమే కాదు. అది మర్త్యులైన మనము మన భావి తరాలకందించే సంపద. ప్రస్తుతము మన భావితరాలకి "మన ముందు తరాలవారు చేతగాక, ఇతర భాషలనుండి కాపీకొట్టి, మన సంఘానికి దర్పణం పట్టని సినిమాలు తీసార"నే భావం కలిగిస్తున్నాం. అది మీకు సమ్మతవైఁతే "అదృష్టవంతులు మీరు, వడ్డించిన విస్తరి మీ జీవితం".

సంఘానికీ సినీ దర్పణవేఁది
ఈ విషయ ప్రస్తావన మొదటి భాగంలో కూడా జరిగింది. నేటి సమాజంలో జరిగే రీతిలో ఒక్క విషయాన్ని కూడా తెరకెక్కించరు.
సంఘంలో చోటు చేసుకునే మార్పులు, విస్తరించిన అన్యాయాలు, వ్యాపించిన వ్యత్యాసాలు, బురదలోని పందుల మధ్య వికసించిన పుండరీకములు, సాధారణ జీవన అసాధారణందాలు, ధైర్యవంతుల అపజయాలు, మోసగాళ్ల అంతశ్శూన్యాలు. ఇలా ఎన్నింటి మీదైనా తీయవచ్చు. అవేవి లేవు.

కనీసం నిజ జీవితం లో జరుగు విధంగా 'మామూలు మనుషులు ధైర్యం వహించి, చివరకి ఏ ప్రయోజనం లేకుండ మట్టి కఱచిన వైనం' వంటివి కూడా సినిమాలలో లేవు. అలాంటివి తీసినా చూసే వారు లేరు. ఏ కేరళలోనో తప్ప. అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.
ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు. సంఘం మారే కొద్ది ఇవి కూడా మారతాయి.

మన గొప్ప సంస్కృతినీ, పురాణాలనీ వాడుకుని సినిమాలు తీయడం చేతకావట్లేదు. ఏ మైథాలజీ లేని పాశ్చాత్యులు మాత్రమ పైరేట్స్, హ్యారీ పాటర్ వంటివి విరివిగా తీసేస్తున్నారు.

ఏ లోకాలలో ఉంది కళా
తెలుగునాట ఏకైక కళన్నారు సినిమా. దేనిలోనైనా ఒక్కటి మాత్రమే మిగిలి ఉండండం వల్ల వచ్చే సమస్యేమిటంటే, కొంత సేపటికి ఏమీ లేకుండా పోతాయి!
సమాజంలో వెలసిన కళంటే, ఎవరో కొందరు ఒక నగరంలో కూర్చుని విరచించేది, రాష్టమంతటా దాన్ని చూచి ఆనందించేదీ కాదు. కళంటే, నిత్యజీవితంలో అందరూ పాలుపంచుకునేది. కళ జీవన విధానం. డబ్బు విలువకు సమాజంలో నిలకడైన అభిప్రాయవేఁర్పడినప్పుడు, నిజానందాల వేట ఫలించగా దొరకిన అమృత భక్షణం.
లాటినమెరికాలో అందరూ ఆడే సాంబాసాల్సాలు, హార్లెంలో హిప్‌హాప్, న్యూయార్లెన్సులో జాజ్, మనూళ్ళలో కోలాటం, జపానులో హైకూ పద్యాలు, పాకిస్థానులో షాయరీలు, వియన్నాలో పిల్లవాడు లెక్కలతోబాటు నేర్చుకునే పియానో, కొరియాకెనడాలలోఅమ్మయిలు నేర్చుకునే ఫిగరు స్కేటింగు, ఇంగ్లాండులో యుద్ధయోదులు సైతం నేరిచిన వాల్‌ట్సు!
కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరిసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వూరి పడుచులు పెట్టే ముగ్గు.

అన్ని సినిమాలూ, కొన్ని సినిమాలు

సమరసింహారెడ్డి
మంచి సినిమా, దీనితో నిర్మాతలకు, ప్రేక్షకాభిరుచుల విశ్వరూప దర్శనవైఁయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి తెలుగు సినిమాలోనూ దీని ప్రభావం కనబడుతూనే వుంది. ప్రక్షకులకు తమలోని నీచత్వం సంఘమనే అద్దంలో కనిపిస్తున్నది. దానిపై కలిగిన అసహ్యాన్ని హింసతో దులుపేసుకునే ఒక సదుపాయం చూపించిందీ సినిమా. ప్రతి కథానాయకుడు ఈ కథతో ఒక సినిమానైనా తీసాడు. నరసింహ నాయిడు, ఇంద్ర, సింహాద్రి, మాస్, లక్షీ, పోకిరీ... చిన్న చిన్న బదలాయింపులతో (సీమకక్ష్యల బదులు మాఫియా, రాయలసీమ బదులు విశాఖపట్నం).

నువ్వే కావాలి, ఖుషీ
ఈ రెండూ తెలుగు నాట కొత్తగా వచ్చిన 'ప్రేమకీ, అన్నాచెల్లెల్ల సంబంధానికి మధ్య తూగే స్నేహ'మనే కొత్త అంశంమీద తీయబడ్డ సినిమాలు. అప్పట్నుంచి, వేలాది సినిమాలు వీటినుండి స్ఫూర్తి పొందాయి. ఇప్పటికీ కొత్త సినిమాలు, నిజజీవిత యువత యొక్క అంతర్లైంగిక సంబంధాలలోని వైవిధ్యాల కన్నా ఈ రెంటి సినిమాలనుండే ఎక్కువ 'స్ఫూర్తి' పొందుతున్నారు. చిత్రవేఁవిటంటే, ఒకటి మలయాళం నుండి, ఇంకొకటి తమిళం నుండి తీసుకోబడ్డాయి (అది తప్పేంకాదు). ఈ సినిమాలలో తెలుగు విశ్వవిద్యాలయ పంతుళ్లకు సరికొత్త అవతారమివ్వబడినది. విద్యాభ్యాసానికో కొత్త నిర్వచనం ఇవ్వబడినది.

పై రెండిటి ఛాయలూ లేని తెలుగు సినిమా ఈవాళ చాలా అరుదు.

ఇక సూపరు డైరెక్టరు శంకర్ సినిమాలు చూస్తే. జెంటిల్‌మాన్‌కి, శివాజీకి తేడా పెద్దగా ఎఁవ్ లేదు. ఆమాట కొస్తే రామాయణానికీ, శంకర్ సినిమాలైన భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు వంటివాటికీ పెద్ద తేడా లేదు. అదే ప్రజ, అదే అసుర (రావణుడి బదులు అవినీతి), అదే యుగపురుషుఁడు (రాముని బదులు రజినీ), అదే పూజించే ఆచారం. అమెరికా వ్యక్తిత్వవాదానికి, రష్యా సమానవాదం విరుద్ధం అంటారు. కానీ అవి రెండూ ఒకటే, వాటికి విరుద్ధం, తమలోని రాముని చూడలేని, నేటి భారతీయం. భౌతికవాదానికి, మిథ్యావాదానికీ మన జవాబు సంతృప్తివాదం, సర్దుకుపోదాం.

హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా ?
ఆఖరుగా చెప్పుకోదగ్గవి, బొమ్మరిల్లూ, శేఖర్ కమ్ముల.

బొమ్మరిల్లు
నేటి యువత యొక్క మారుతున్న ఆలోచనావిధానం మీద ఆధారపడిన మంచి సినిమా. మొదటి సగం మాత్రం, నేటి తెలుగు సినిమా భుజంగకోరలలో చిక్కుకున్న మూషికమే. అదే వెకిలి కాలేజీ హాస్యం, అదే ఉపాధ్యాయలపై హాస్యం. కాని రెండవ భాగం మాత్రం తెలుగు సినిమా చరిత్ర మొత్తం ఇప్పటి వఱకూ నడిచిన దారిలో వేసిన ఓ ముందడుగు. రేపటి సినిమాలకో దిక్సూచి.

కమ్ముల
తెలుగు సినిమాలో ఎన్నడూ లేని (కనీసం ఈమధ్య కాలంలో), "attention to detail" ని ప్రవేశ పట్టారు. బొమ్మరిల్లు తెలుగు సినిమా నడిచిన బాటలో ముందడుగైతే. ఇది తెలగు సినిమాలకే కొత్త తరం. నాటకాల నుండి సినిమాకి లభించబోయే పూర్తి విముక్తి!

బొమ్మరిల్లు కథా గోదావరి (అదృష్టఁవుంటే హ్యాపీడేస్) కథనం కలిసినపుడు, తెలుగు నాట మంచి సాంఘిక సినిమా అవతరిస్తుంది. కాని చిక్కేవిఁటంటే, వీటిని కాపీ కొట్టలేం. కానీ అయ్యో మన వరికొచ్చిందదొకటేగా !

ఇక హారీ పోటర్, పైరేట్స్ అఫ్ కరీబీయన్ లాంటి సినిమాలు తెలుగునాట తీయ్యాలంటే, దానికోసం, ఇంకో యాభై ఏళ్ల తరువాత ఏ శైలేశ్వరో, దినేశ్వరో వారి బ్లాగులో వేసే టాపా, 'తెలుగు సినిమా దుస్థితి' (౧౦భాగలలో ౭వది) చూడండి.

(సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఎ అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)

కొన్ని ప్రతిసూచనలు (రిఫరెన్సులు)
౧) నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు - కాలిపు కూర్మావతారం
౨) Interactivity in Art - కిరణ్ వారణాశి
౩) సంతోషం-మున్నాభాయ్-పోకిరి - వెంకట్ సిద్దరెడ్డి
౪) రీమేక్ సినిమాలు - కృష్ రేం

Sunday, September 16, 2007

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

ఉపోద్ఘాతము
ఈ మధ్య నేను చాలా టీవి చూస్తునాను. టీవి చూస్తుంటే అందులోని కొత్త సినిమా ప్రకటనలు, 'కామేడి బిట్లు' కూడా చూడాల్సివస్తుంది. కాని నా అంతటనేను ఇష్టపడి చూసే సినిమాలు మాత్రం పాత తెలుగు సినిమాలు, మంచి ఆంగ్లల సినిమాలు. కొత్త సినిమా ప్రకటనలకంటే పాత సినిమాలలోని మెలోడ్రామానే నచ్చుతుంది. దాని బట్టి అర్థఁవవుతుంది, తెలుగు సినిమా నేడు ఎంత అధ్వాన స్థితిలో వుందో. దానికి తోడు మన జానతా అంతా "మన తెలుగు నాట కళలకేం తక్కువ లేదు, ఎన్నో గొప్ప కళలు వెలసిన చోటిది. అలానే, గత యాభై ఏళ్ళగా మనము సినిమాని బాగా పోషించాం" అనడం దయనీయకం. అంటే తెలుగునాట ఇప్పుడు ఎగురుతున్న కళా బావుటా సినిమా మాత్రమే, తోలు బొమ్మలాట, హరికథ, బుఱ్ఱకథ, యక్షగానం అన్నీ సచ్చిన తురువాత, మిగిలిన ఏకైక 'కళ', ఏ పాతాళంలో ఉందో వివరించడానికీ టపద్వయం.

తండ్రి నుండి తనయుని వఱకూ
ఈ మధ్య పాత తెలుగు సినిమాలు టీవీలో వచ్చినవి వచ్చినట్లే చూసేస్తున్నా. వాటిలో మొన్న వచ్చిన, నాకు చాలా నచ్చిన సినిమా, 'నేరము శిక్ష'. ఈ కృష్ణ సినిమా ఇప్పటికి నాలుగైదు సార్లు చూసా. చాలా చాలా మంచి కథ, చలా మంచి కథనం. ధర్మానికీ అర్ధకామాలకీ మధ్య జరిగే సంఘర్షణలో మానవులు పావులై, తమతో తాము ఆడుకునే ఆటలో నుంచి, తీయబడ్డ మూడుఘంటల మంచి నమూనా. ఆనాటి సంఘానికో మంచి ప్రితిబింబం. కథ అష్టవంకర్లు తిరగకుండా దాని మూలం చుట్టూ చాలా బాగా తిరుగుతుంది. నటనలో నాటకీయం ఉన్నా అది అప్పుడే నాటకాలనుండి విడిపోయి, సినిమా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సమకూర్చుకుంటున్న రోజులు కాఁవట్టి. క్షమించవచ్చు.
అది ఆనాటి సినీతత్వం మాత్రమే.


దానితో పోల్చనున్నాం, ఈనాడు తెలుగు నాట అతి సంచలనం సృష్టించిన సినిమా, పోకిరి! నా బ్లాగు లో ఈ సినిమా ప్రస్థావించినందుకు ఇప్పుడే పశ్చాత్తాప పడుతున్నాను. రంగుల తెర, అద్భుతమైన గ్రాఫిక్సు, కొట్టీ కొట్టని బీట్లు, దాగీ దాగని వళ్ళు. హూఁ! సినిమా అంతా మతి లేని, హింసాఖాండ, నిజ జీవితంలో వీలు కూడా కాని విన్యాసాలు, తెలుగు రాని అమ్మాయిలూ, నటన అంతకన్నారాని నటీనటులు, పాటులు చెండాలం, కథ చెండాలం. ఇలా ఇంకా ఎంత కాలమైనా చెప్పుకు పోవచ్చు. ఎప్పుడూ ఒకేరకంగా విసిగేత్తినట్టు ముఖాఁన్ని పెట్టే కథానాయకుడు. చీమల మందలా ఒకడు చచ్చిన తరువాత ఇంకో విలను వస్తూనేవుంటాడు.
'నేరమూ-శిక్ష'నీ, ఈ సినిమాని ఒకే వాఖ్యంలో ప్రస్థావించడం కూడా పాపమే.

సంభాషణలు
మొన్న చూసిన ఒక సినిమాలో కైకాల, తన కొడుకులను మట్టి కఱిపించవద్దని నందమూరిని బ్రతిమాలడానికి వచ్చి,
"నీవు నా కొడుకువే బాబూ, తమ్ములని చంపొద్దు, ఆస్తి నీదే నువ్వే తీసుకో" అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
"నా మీద నీకు ఎటువంటి మమకారమూ లేదు, నీ ప్రియ కొడుకులని రక్షంచుకోడానికి కుంతీ రాయబారానికి వచ్చావా?" అంటాడు తారక. అలా కుంతీ రాయబార రూపకంగా వేడిగా సంభాషణ జరుగుతుంది.
అలా రాయబారం విఫలఁవైం తరువాత, పోతూ పోతూ కైకాల,
"ఏ శాస్త్రమూ పని జేయనప్పుడు, పెద్దలు కౌటిల్యుడి రాజ నీతి తియ్యమన్నారు, అందులో బంధాల గురించి, ప్రీతి గురించి, ఎక్కడా ప్రస్థావన లేదు. ఇక ఆ పుస్తకం తెరవాల్సిందే, ఆ తురువాత నువ్వు కన్న కొడుకువని కూడా లెక్క చెయ్యను . ఖబడ్దార్." అన్న సారంశం ఉన్న డైలాగు చెప్పి నిష్క్రమిస్తాడు.

ఇక ఈనాటి పరిస్థితి
"ఎవరు డైలాగ్ కొడితే, దిమ్మదిఱిగి, మైండు చెడుపోయి, వాంతి వస్తుందో వాడేరా ఈనాటి తెలుగు సినీ నాయకుడంటే" అన్నట్టుంది!
నిన్ననే 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అన్న సినిమా చూస్తున్నా, అందులో ప్రేమ అనే పదం గాని జీవితం అన్న పదం గానీ ఎక్కడా వాడలేదు. (ఆ సినిమాలో మిగిలిన అంశాలతో పోల్చుకుంటే ఇది ఒక మంచి అంశంగా పరిగణించవలసి వస్తుందన్నది వేరే విషయం). ఈనాటి రచయితలకి వచ్చిందల్లా ఓ కొజ్జా భాష! అందు వ్రాయగలిగినోడే ఘనుడు.


పరిశోధన (దర్శకత్వం)
సినిమా తీస్తే, దాన్ని ఏ కాలస్థలాల నేపధ్యంతో తీసారో వటిని బాగా పరిశోధించి కథలో, కథనంలో వాటిని బాగా ఇమడ్చాలి. కన్యాశుల్కం తియ్యడానికి అఱవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సొచ్చినా, మోసగాళ్ళకి మోసగాడుకి (కథలో, స్కిరిప్టులో) ఖండాతరం వెళ్ళాల్సివచ్చినా వెళ్లేవారు. అదే ఈవాళ ఏ వెంకటేశ్ సినిమా తీసుకున్నా, అందులో అదే వైజ్ యాస్ వ్యాఖ్యలు. ఎప్పుడూ హీరోదే ఆఖరి మాట. అన్ని సినిమాలలోనూ, అదే మాట్లాడే తీరు. బిఎ ఫెయిలైనా కోనసీమ కుఱ్ఱాడైనా, చాలా సమర్థుడైన కంప్యూటరు ఇంజనీరైనా, ఒకటే మాటచందం. అన్ని పరిశ్రమలలో జనాలు మసులు తీరు సినిపరిశ్రమలో లానే ఉంటుందని వారి సౌకర్యార్థం తప్పుగా అనేసుకోవడం.

అలానే రాయలసీమ నేపధ్యంగా కథ సాగుతున్నప్పుడు రౌడీలు రాయలసీమ యాసతో మాట్లాడతారు, కానీ కథానయకుడు మాత్రం 'ఉత్తమఁవైన' బెజవాడ తెలుగులో మాట్లాడతాడు. ఈ విషయంలో మన 'అఆ రెడ్డి', 'ఉఊ నాయిడు' సినిమాలకంటే, ఆరవం నుండి అనువాదించిన 'పోతురాజు' వంటి సినిమాలు చాలా మెఱుగు. సగం సినిమాలు హైదరాబాదులో జరిగినవిగా తీస్తారు. కానీ తెలంగాణ మాండలికం ఉండదు. కథానాయికలందరికీ డబ్బింగు చెప్పే కళాకారిణులు పరిశ్రమ మొత్తానికీ, ఐదాఱుగురుంటారు. వారిని కూడా ఎవరు ఎక్కువ నత్తి నత్తిగా మాట్లాడతారు, ఎవరు ఇప్పుడే అమెరికా నుండి దిగారు అన్న కొలమానులతో కొలచి ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఇక యమదొంగలో చిత్రగుప్తుడు బుక్కు బుక్కు అనడం విచారకరం.

కథానాయికలు
జమునా, విజయకుమారి, శారద, వాణిశ్రీ లాంటి వాళ్ళ ముందు, ఈనాటి కథానాయికలు (వారి పేరు చెప్పి బ్లాగు శీలం చెడగొట్టలేను) తలెత్తుకుని నిలువగలరా? వారిలో ఉండే వయ్యారం, నడక, నాట్యం, నటన, భాషాప్రావీణ్యం? "అప్పటి కథానాయికల నుండి ఆశించేది వేరు, ఇప్పటి కథానాయికలకు గ్లామరు చాలా ముఖ్యం, పైగా నాటకీయంగా ఉండే నటన కూడా సహజ నటనగా మారింది" అని మీరు వాదించినా. జయసుధ, విజయశాంతి లాంటివారు కూడా లేరుగా ఈనాడు. వాణిశ్రీలాంటిది పిచ్చిదానిగా చేసిందంటే, కృష్ణంరాజు వంటి వారు కూడా ప్రధాన పాత్రనుండి ద్వితీయ పాత్రకి వెళ్ళవలసిందే. ఈనాడు చిత్ర'మందిరం' నుండి బయటకు వచ్చిన వారిని 'దేవి' పేరు చెప్పమంటే చెప్పలేరు. తెలుగంటారా రానేరాదు. ఇక అప్పుతెచ్చుకున్న కథానాయికలలోనైనా భానుప్రియ, శోభన వంటి వారైనా ఎక్కడ?

ఈనాటి సినిమా హీరోయిన్ల ఎంపికా ప్రక్రియ నాకు అస్సలు అర్థంకాకుండా ఉంది. స్త్రీసమానత్వవాదానికి తెలుగు కథానాయికల పతనం వెన్నులో ఒ పోటు.

కథానాయకులు
వీరి పతనం కంటే వీరి వల్ల మిగిలిన అంశాలకు జరిగిన పతనఁవే ఎక్కువనాలి. రామారావు, నాగేశ్వరరావుకీ ఈనాడు సరిసాటి లేరన్న విషయం అటుంచితే. ౪౦లలో నాయకులు కథలో భాగంగా ఉండేవారు, ౭౦లకల్లా కథకన్నా పెద్దవారిగా చెలామణీ అవ్వడం దురదృష్టకరం.
నిజంగా దిగజారింది, 'కలసి వుంటే కలదు సుఖం'లో రామారావు, 'దేవదాసు'లో నాగేశ్వరరావు! ఇక కమలహసన్, రాజేంద్రప్రసాద్ వంటి వారు కనుమఱుగే!

సంగీతం
నిజం? దీని గురించి వ్రాయాలంటారా?
సంగీతఁవనేది ఒక ప్రత్యేక కళ. ఇది సినిమాలో భాగం కాదు. కాబట్టి 'తెలుగునాట సంగీతం' గురించి ఒక ప్రత్యేక టపా వెయ్యాలి.
ఒక్క నిఁవిషం! తెలుగునాట వెలసిన ఏకైక కళ కదా సినిమా? నా మతిమఱపుమండా! ఇక మనము సంగీతం వంటి వాటి గురించి మాట్లాడడం నిరర్థకం. ఆఃక్లాండులో నల్లవారి ఆకలి కేకల నుండి పుట్టిన హిప్‌హాప్‌ని మనదిగా వాడేసుకుంటే పోలే. అది సరిపోకుంటే, లెటీనో సాల్సాలు, అరబీ పాటలు ఉండనే ఉన్నాయిగా. అది కూడా కష్టమైతే తోటి తెలుగు వాడే మళయాళ సినిమాలో కొట్టిన పాట ఉండనేవుంది. సామెత చెప్పినట్టు వండుకున్నవాడికి ఒక్క కూరైతే అడుకున్న వాడికి అఱవైయ్యాఱు కూరలు.


ప్రేక్షకమహాశయులు
"అలా ఐతే ఈ సినిమాలు ఇంత పెద్ద హిట్లెందుకవుతున్నాయి? జనాలు వెఱ్ఱాళ్ళనా మీ ఉద్ధేశం?"
వెఱ్ఱాళ్ళే కానీ అది వారు తప్పు కాదు. ఉండండుండండి. ప్రజాస్వామయం కదా, అయితే అన్నీ ప్రజల తప్పులే! వారి వెఱ్ఱతో సహా! కానీ ఆ అంశంలోకి పెడదారిన వెళ్ళక నవీన సినిమా ఎందుకు అంత విజయం పొందిందో చెప్పుకుందాం.

నేటి భారతీయులు, అన్ని విధాలాల విసుగెత్తి వున్నారు. అనినీతీ, న్యాయంలేక పోవడం, ఎవడు రౌడీలను మేపగలిగితే వాడిదే రాజ్యం, చేతగానితనానికి మారుపేరుగా నిజాయితీ. దాని మీద, ఎప్పుడూ నీడలా వెంటాడే మధ్య తరగతి భవసాగరాలు. ఏఁవైనా సాధిద్దాఁవను కుంటే అడ్డంకులు! లంచం, రాజకీయాలు, బందుప్రీతి, కుంభకోణాలూ, మీకు తెలియనిదేముంది? ప్రతి సినిమా హీరో వీటిగురించేగా వా'పోయేది'. వీటన్నిటి తలదన్నేలా, ప్రొద్దుట లేచి, రాత్రి నిద్రపోయేవరకూ, కనిపించే లక్షలాది మందిలో ఒకరు, అంటే ఒక్కరు కూడా తనకు గౌరవం ఇవ్వరు. అంతే! తమెవ్వరికీ ఇవ్వని గౌరవం తమకి దక్కాలనే తాపత్రయం.

అదే సినిమాకెళ్తే, హీరోకి అడ్డు వచ్చిన రౌడీని నరికి పారేస్తున్నాడు, చిరంజీవిని ఎవరూ ఎప్పుడూ చీదరించుకోరు, కొట్టరు. రజనీకాంత్ వచ్చి నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చేస్తున్నాడు, "ఒహో అవినీతిని అరికట్టడం మన బాధ్యత కాదన్నమాట, బెదరని వాడు రాలేరాలేరాలేదు, కాబట్టే అది ఉంది". సినిమాలు మనోరంజనంతో పాటు మనం చెయ్యగలిగినదేఁవీ లేదనే 'మనోలంజనం' కూడా కల్పిస్తున్నాయి.

ఇక హీరో చేత తన్నులు తన్నించు కుంటున్న స్టంట్‌మెన్, సినిమా రౌడీలూ మనుషులుకారు, ప్రేక్షకుని నిజజీవితంలోని అడ్డంకులకు వెండి తెరపై రాతి ప్రతిబింబాలు. వాటిని హీరో చిత్తు చిత్తు చేస్తున్నాడు, మన ప్రేక్షకులు నిజజీవితంలో ఆశించినట్లే! అది సినిమా కాదు, ఒ ఫాన్టసీ, చాలా సుదూర ఫాన్టసీ. అది కళాభిమానం కాదు, మానసిక హస్తప్రయోగం (ఎమోషనల్ మాష్టర్బేషన్).

తరువాయి
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగా వస్తున్నాయా? (కాపీ రాజులు, సంఘానికీ సినీ దర్పణఁవేది, హైజాకైన కళ, హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా, వగైరా)
మనవిః అచ్చు తప్పులు మన్నించగలరు

Thursday, September 13, 2007

తెలుగు లందు నాది తెలుగు లెస్సు

ఉపోద్ఘాతము
మీరు ఎఁవిటి ఇతను, ఱ, అఁ, ఋ, ఌ, ఞ వంటి వాటిని తఱచూ వాడుతుంటాడు అని విచారించువారైతే, మీ ప్రశ్నలకు ఇదే ఋఌల చందంలో సమాధానం.

అశళు ఠఫా
ఱాణాఱె, థణ శ్కూళు ఱోఝుళ ఘుఱింఛి వ్ఱాశి, అబిణవ ణావిఁణీ సుబ్ఱమన్యం ణాయిఢి ఘా ఫేఱుఫొంధాఱణ్ణధి తెలుగు భ్ళాఘఱ్ళంధఱిఖీ థెళిశింధే. ఆళాణే ఛాళావఁంధి ఇథఱ భ్ళాఘఱ్ళు ఖూఢా థమ తెలుగు ఫ్ఱథాఫం ఛూవింఛి, ఎణ్ణో మెఫ్ఫుళూ ముఢుఫుళూ ఫొంధాఱణి ఖూఢా ణాఖూ వీఁఖూ ఖూఢా థెళుశు.

ణేణు అశువఁంఠి ఫణుళు సెయ్యళేఖ ఫోయిణా, ఛాళా అబివఌద్ధి ఛెంధా, ణా తెలుగు ఛాళా ఫుఱోఘమణం ఛెంధిఁవ్ధంణి ఖూఢా ణేణు ఘఱ్భంగా జెఫ్ఫుఖో ఘళుఘుథుణ్ణా.. ఖాణీ ఈభేల ణాఖు ఖూఢా ణా శ్ఖూళు ఱోఝుళు వళ్ళ ఓ ఠఫా ధొరిఖింధి.

ఖత ఎఁవఠంఠే..
ణేణు మ్యావూఱి థెఱఫిష్టు (అధేణంఢీ మాంథ్ఱిఖుఁఢు) ధఘ్ఘఱఖి వెళ్ళిణఫ్ఫుఢు, అథణు జెఫ్ఫాఢు,
"ణిఝంఘా ణీ తెలుగు ఛాళా భాఘుంధణి అఁధఱూ ఖోణియాఢాళంఠే, అధి శాధ్యఁవయ్యే విసయఁఘాధు. ధాణి భధుళు, ణువ్వు అళా ఫఖ్ఖ వాఱి మెఫ్ఫు ఖోశం ఫ్రయథ్ణిశ్థుణ్ణావంఠే, ధాణిఖి ఏధో, మాణశిఖ ఖారణఁ ఉంఢి ఉంఠుఁధి, అంధుఖే ణీఖా అబద్ఱథ" అణి ఖూశింఢు.

ఇంఖో ణాళుఘు, ఱొఝుళ థర్వాథ మల్లా ఖళశిణఫుఢు ఆ థెఱఫిష్ఠే అణ్ణాఢు,
"ణుబ్బు ఛిణ్ణఫ్ఫుఢు, అణ్ణి సధువుళళోణూ ఱానింఛిణా, తెలుగులో మాథ్ఱం థఱఘథి మద్ది ళోణే, మామూళు భిధ్యాఱ్తి ళాఘా వుఁంఢి ఫోయాబ్, ఆ ఖొఱథే, ణిణ్ణు ఇళా బెఁటాఢు థుంధి" అణి ఖూశిండు.

థాఙిఖి ఇఱుఘుఢేవఁణి యఢిఘిథే, ఫఖ్ఖనే బున్న మాబూఱి తెలుగు ఫంథుళు, ఛెఫ్ఫాఱు, సుధ్ధ తెలుగు మాఠ్ళాఢఁవణి.
" ఎబఱూ బాఢణి, అఖ్సఱాళు వాఢు", అభి ఎభణఘా "వథ్థుళ్ళున్న అఖ్సఱాళు, ఖ,ఘ,ఝ బంఠిబీ. వఁరియూ ఱ,ళ, ఙ, ఞ, ఌ,ౡ,ఋ, ౠ, అఁ, బంఠిబీ. ఎఖ్ఖఢ బాఢాళో అఖ్ఖఢ థఫ్ఫఖ భాఢు" అణి షెళవిఛ్ఛాఱు.

అంధుఖే ణా భ్ళాఘుఖి "రి,రీ,లి,లీ" అణిఫేఱు ఫెఠ్ఠఠఁవైంది. కన్యాశుల్కం భంఠి మంఛి ఫ్ఱాఛీణ ఘ్ఱంతాళు ఛధిభి, భాఠి ణుంఢి, అఁ వఁఠిభి ఎఖ్ఖఢ భాఢాళో థెళుశు ఖుణ్ణా..

ఆటవెలది (రెండో అర్థములో)
ౠఋ ౡఌ వంటి వేలనియన్నను
యాభదాఱు వున్న యా తెలుంగు
అక్షరాల యందు, అరుధక్షరాల్ వేరు
తెలుగు లందు నాది తెలుగు లెస్సు
రాయలవారికీ, వేమన గారికీ, అంబానాథ్ గారికీ , క్షమాపణలతో... యతి, ప్రాసలకు సదా విధేయతతో... ఈ టపా నిమిత్తం అనామికులైన గురువుల స్మరణతో...

Saturday, September 08, 2007

టిర్కీ త్రిమూర్తులూ

ఉపోద్ఘాతం
టిర్కి ఎవరా ?
మీరసు ఏ లోకంలో ఉంటారు ? ఇవళ రాత్రి టీవిలో ఆటలు చూడలేదా
చూసామే.
ఐతే టిర్కీలు తెలియక పోవడమేమిటి.
క్రికెట్ టీములో అలాంటివారెవరూ లేరే.
క్రికెట్టా? హాకీ ఉండగా అడ్డమైన చెత్త చూడొద్దన్నానా ?
అదీను ఆసియా కప్పు సెమీ ఫైనల్లలో, పాకిస్థాన్ తల దన్నిన జపాను తో భారతం పోరు పడుతుండగా.
ఐనా టిర్కీలు తెలియని వారితో నాకు మాటలేంటి ? మీరు తక్షణమేనా బ్లాగు విడిచి పొండి. మీ పేరుతో ఒ చదువరి నా బ్లాగుకే లేరనుకుంటాను, అలానే నా బ్లాగుకు మీ రెన్ని సార్లు వచ్చారో చెబితే, నా సందర్శకుల లెక్క నుండి అంత తీసివేస్తాను.
ఎఁవిటీ అలా ఐతే, నా సందర్శకుల సంఖ్య సున్నా అవుతుందా? అయితే అవుతుంది.
బాబ్బాబు ఇంకో మాట చెప్పు.
సరే ఐతే, రేపు ఆసియా కప్పు ఫైనలు వస్తుంది. భారతం దక్షిణ కొరియా తో తలపడనుంది. పశ్చాత్తాపంగా అది చూడండి ఐతే. ఇంకా వివరాలు కావాలా.

ఆసియా కప్పు
ఆసియా దేశాలు ఆడే హాకీ టూర్నమెంటు. పాల్గొన్న దేశాలు
పూలు ఎ - పాకిస్థాను, మలేషియా, జపాను, సింగాపురం, హాఙ్ కాఙ్
పూలు బి - భారతు, కొరియా, చైనా, థాయిలాండ్, శ్రీలంకా, బాంగ్లదేశం

అందులో మంచి టీములు - మనం, పాక్, కొరియా, మలేషియా,
ఫర్వాలేదు జట్లు - చైనా, జపాను, (రెండూ ఈ మధ్యనే పైకి వచ్చాయి), హాఙ్ కాఙ్ కొంత వరకూ పర్వాలేదు.
చెత్తవి - మిగతావి

లీగు ఆటలు
పూలు బీ లో భారత్ ఓటమి ఎరుగదు, కానీ చైనా కొరియాల మీద కష్టపడి నెగ్గుకొచ్చాం.
పూలు ఎ లో అందరూ గొప్ప జట్టుగా కొలిచి, విశ్వ హాకీ రాంకింగులో మిగతా ఆసియా జట్ల కంటే మంచి రాంకింగు ఉన్న పాకిస్థాన్ని జపాను అనుకోకుండా ఓడించడంతో, వారు సెమీస్ కి రాలేదు. భారత్ శ్రీలంకను ౨౦ లక్ష్యాలతో, థాయిని ౧౬ లక్ష్యాలతో చిత్తు చేసింది.

సెమీసు
భారత్ x జపాను (భారత్ నెగ్గింది)
మలేషియా x కొరియా (కొరియా నెగ్గింది)

ఫైనల్సు భారత్ x కొరియా రేపు ఆదివారం సాయంత్రం ౬:౩౦ (ఆరున్నరకు).

ఇక హాకీ గురించి
౧) గోలు దూరం నుంచి కొడితే చెల్లదు, ౨౦ గజాల దూరం లో ఉన్న D (అరవృత్తం) లో ఆటగానికి కఱ్ఱకి కనీసం తాకి లోని కెళ్తేనే చెల్లుతుంది.
౨) కాలుకి బంతి తగల కూడదు, తగిలిన అది అవతలి జట్టుకు ఇవ్వబడును (free hit)
౩) D లో రక్షణ ఆటగాడి కాలుకి తగిలిన, అవతలి టీంకి penalty corner ఇవ్వబడును, అవి హాకిలోనే అతి ఉత్కంఠ మైన క్షణాలుగా చెప్పవచ్చు.

మిగలిన ఆట మామూలుగానే ఎవరి లక్ష్యాం లోనికి వారు బంతిని పంపించడానికి కృషిచేస్తారు.

మన జట్టు
ఇంతకీ ఈ టిర్కీలెవరా
ప్రభోద్ టిర్కీ - జట్టు సారథి, మైధాన మధ్యలో ఆడతాడు.
ఇగ్నేశ్ టిర్కీ - ప్రభోద్ తమ్ముడు, ఆక్రమణ పంక్తి లో భాగం
దిలీప్ టిర్కీ - రక్షా పంక్తి లో ముఖ్యుడు, ప్రపంచంలోనే అతి మంచి హాకీ రక్షకులలో ఒకడు. జట్టుకు సారథ్యం కూడా వహించాడు. ఇతనిని ముద్దుగా 'గోడ' అంటారు.
(టిర్కీ ఒరిస్సాలోని కొండ జాతులలో ఇంటి పేరు, వీరు వీర హాకీ ఆడతారు. నా పాత రూమ్మేటు టొప్పో కూడా ఈ కోవకి చెందిన వాడే. చాలా గట్టి మనిషి, రాయి అని పిలుచేవారం మేము. హాకీ చాలా బాగా ఆడేవాడు. ఇక పంజాబు, కొడగులలో కూడా హాకి అంటే ప్రాణం )
ప్రభ్‌జోద్ సింహ్ - ఆక్రమణ పంక్తి మధ్యుడు. ఇతని దగ్గరకి బంతి వచ్చిందంటే, మీరు కుర్చీనుండి లేచి కూర్చోవాల్సిందే.
రఘునాథ్ - ఇతను ఎక్కవగా పెనాల్టి కార్నర్లను కొట్టే వ్యక్తి, ఇతను substitute అయిపోతే, దిలీప్ టిర్కీ కి పెనాల్టీ కార్నర్లు ఎక్కువా అప్పజెప్పుతారు.
ఇంకా ఇతర మంచి ఆటగాళ్ళు - శివేంధర్ సింహ్, తూషార్ ఖాండేకర్, రాజ్ పాల్ సింహ్, బల్జీత్ సింహ్ (గోలీ) వగైరా.

కొసమెఱుపు
మీరు ఇంకా సంకోచిస్తున్నారంటే, హాకీ గురించి వేదాలలో ఏఁవ్ రాసుందో వినండి.
ధీరులు హాకీ ఆడతారు
రసజ్ఞులు ఫుడ్‌బాలు ఆడతారు
హాకీ అతివేగ, అతిప్రమాదకర, అతి అలసట కలిగించే క్రీడలలో ప్రథమం. అలా అని ఇది నాన్-కాంటాక్టు ఆట. వెధవ వేషాలు చెల్లవు. ఇంకేముంది ఐతే, రేపు సాయంత్రం ఆరున్నరకి డిడి క్రీడల టీవీలో చక్కదే, ఒహ్ చక్కదే ఇండియా అనుకుంటూ ఆసియా కప్పు ఫైనల్సు చూడండి.

చక్కుదే అంటే గుర్తొచ్చింది, మన ఆడ వారి జట్టు ఎం చేస్తుందో హాఙ్ కాఙ్ లోని మహిళల హాకీ కప్పులో, ఈ పాటికి నగ్గేసుండాలి, క్రిత విజేతలు మరి. ఇప్పుడే అందిన తాజా వార్త మన అందగర్తెలు(అన్నట్టు సినిమాల్లో చూపించనంత అందంగా ఐతే నిజమైన భారతీయ హాకీ క్రీడాకారిణులు ఉండరు) సెమీస్ లో కొరియా చెతిలో ఓడారు. చక్కదే అంటూ సినిమాలు చూడడం కాదు అస్సల్ సినిమా యాడాడతుందో ఆడ సూడాల్న. మీరెప్పుడైనా ఆడవారి హాకీ చూసారా, ఎ జెర్మనీ ఆస్ట్రేలియా ఆటో చూడండి, నా లాంటోళ్ళిక ఇలాటి బ్రతిమాలుకునే టపాలు వ్రాయక్కరలేదు. ఎందుకంటే, మహిళల హాకీ ప్రపంచంలోనే అతివేగ, అతిప్రమాదకర, అతి చిన్న స్కర్టు వాడే క్రీడలలో ప్రథమం. ;-)

Thursday, September 06, 2007

విశాలాంధ్రలో చివరకు కొన్న పుస్తకాలు

మొన్న విశాలాంధ్రకి వెళ్ళి వచ్చా, హజ్ కి వెళ్ళోచ్చినంత పనైంది. అనుకున్న రెండు నెలలకి వెళ్ళగలిగా. కానీ ఆలస్యం అవడమే మంచిదైంది. అంతకు ముందుంన్న జాబితా కంటే మంచి జాబితా తో వెళ్ళ గలిగా. హైదరాబాదులో బస్సెక్కి వెళ్ళడమంటే ఆషామాషీ కాదని అందరికీ తెలిసిందే. బస్సు ఎక్కే ముందూ, ఎక్కినతరువాత, దిగిన తరువాత ఒక వంద సార్లు తిట్టుకున్నా నగరాన్ని. ప్రపంచంలోని అతి చెత్త నగరం బహుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సీరియస్‌లీ మరీ ఇంత అద్వాన రవాణా వ్యవస్థా ? ఏదేమైనా, వెళ్ళి రావడం గురించి వ్యంగ్యంగా దురుసుగా ఒ టపా వ్రాయొచ్చు, కానీ ఆ పుస్తకాలు కొన్న అనుభూతి బీరు తాగినంత కన్నా గొప్పగా అనిపించింది. కాబట్టి దాని మీదే ధ్యాస పెడదాం.

నేను కొన్ని పుస్తకాలు జాబితా
  • చివరకి మిగిలేది (బుచ్చి బాబు) ౯౦ (90)
  • గణపతి (చిలకమర్తి) ౬౦ (60)
  • కృష్ణపక్షము (కృష్ణ శాస్త్రి కవితలు) ౩౦
  • అసమర్ధుని జీవయాత్ర (త్రిపురనేని) ౪౦ (40)
  • కన్యాశుల్కం (గురజాడ) ౭౦ (70)
  • ఎకైక విప్లవం (జిడ్డు) ౧౨౦ (120)
  • మహాప్రస్ధానం (శ్రీశ్రీ) ౪౦
  • అమృతం కురిసిన రాత్రి (తిలక్) ౭౦
  • దర్గామిట్ట కతలు (ఖదీర్ బాబు) ౬౦
  • సలాం హైదరాబాదు (లోకేశ్వర్) ౯౯
  • మాలపల్లి (ఉన్నవ లక్షీనారాయణ) ౧౫౦ (150)
  • భారతంలో చిన్ని కథలు (ప్రయాగ రామకృష్ణ) ౧౫౦
  • అంపశయ్య (నవీన్) ౯౮ (98)
  • ఎంకిపాటలు (నండూరి సుబ్బారావు) ౨౫
మొత్తం వెల ౧౧౦౨ (తగ్గింపు ౧౦౨) = ౧000 .
అదన్న మాట మొత్తం వెయ్యి రుపాయలు, మామూలుగా అయితే, "ఇంకొంచెం తగ్గిస్తే మా స్నేహితులకు మీ కొట్టు పేరు చెబుతా" అని సోది కొట్టి ఇంకొంచెం బేరం ఆడే వాడిని (కాలీకట్‌లో ఆరీసీ అంటే పది శాతం తగ్గింపు ఇచ్చేవారు అన్ని చోట్లా). మా నానమ్మ దగ్గర నుండి వారసత్వం వచ్చిన ఏకైక గుణం - బేరాలాడడం. కానీ మొన్నటి దాకా ఆమెరకలో అడ్డమైన ఇంజనీరింగు పుస్తకాలు తలా ౧౫౦ డాలర్లకు కొని, ఇక్కడేమో పద్నాలుగు ఆణిముత్యాలకు వెయ్యే ఇచ్చా. ఇలా ఐతే తెలుగు సాహిత్యం ఎలా ముందుకు సాగుతుంది అని దిగులు పడ్డా. తగ్గింపు ఇవ్వకపోతే బాగుండును అనిపించింది. అభిమానం దుఃఖించినా, పేదరికం సంతోషించింది.

కొట్టలో కొన్న తీరు
సాహిత్యం గుంపులో చదవవలసిన పుస్తకాలు కొన్ని చెప్పమంటే, చాలా మంచి సూచనలు ఇచ్చారు, కానీ అందులో చాలా వరకూ కథల పుస్తకాలే ఉన్నాయి. ఆ తరువాత త్రివిక్రం గారి టపాలో మంచి నవలలు చూసి వాటిని కూడా నా లిస్టులో జేర్చి మరలా సాహిత్యం గుంపుకి పంపా, అందులో ఇచ్చిన సవరణలతో రెండవ కూర్పు తయారుచేసి దానిని ముద్రించి నాతో పట్టికెళ్ళా .

దుకాణానికి వెళ్ళిన తరువాత, బ్రౌజింగ్ మొదలెట్టా, ఎంత సేపున్నా ప్రయోజనం పెద్ద లేక పోయింది. ఒకతను నా చిట్టా చూసి, దాన్ని అందుకొని, చాలా మంచి పుస్తకాలు వ్రాసుకొచ్చారండి, అని ఒ పది సార్లు పొగిడి, ఒక దాని తరువాత ఒకదాన్ని కౌంటరు మీద పెట్టడం మొదలు పెట్టారు. అలా నా ముందు ఒ మూడు నాలుగు వెలు చేసే పుస్తకాలు పెట్టాడు. వాటిలోనుంచి, నాకు కావలసినవి ఎంచుకున్నా, క్రింద వివరించబడిన పద్ధతిలో.

కొనని పుస్తాకాలు
వెయ్యి పడగలు కొందామనుకున్నాకానీ మరీ ౪౦౦ అనేసరికీ వెనకాడింది నిరుద్యోగం. అలానే ఇంకా చాలా మంచి పుస్తాకాలు ప్రింటు బాలేదని కొనలేదు అందులో ఒకటి 'నవ కవితా సంకలనం'. అలానే భాగవతాన్ని కూడా నాలుగొందలనే సరికి, 'అన్నంముట్టించగానే ఆవకాయెందుకు' అని నిర్జీతం వాదించింది, వాదనలో గెలిచింది. కాని గట్టి బైండింగుతో చాలా బగున్నాయి భాగవతం రెండు పుస్తకాలు. వారి దగ్గర అముక్త మాల్యద లేక పోయే సరికి, కావ్యాలేవి కొనలేకపోయా.

నామిని కథలు కొందామనుకున్నాకానీ, ఒక పేజీ చూసా, రాయలసీమ మాండలికం, నాకేమో తెలుగు చదవడం అంత వేగంగా రాదు. రానారె వ్రాసినవే ఆయన దగ్గరుండి (జీటాక్‌లో) చదివిస్తే గానీ అర్థం కాలేదు. కాబట్టి వాటి బదులు దర్గామిట్ట ఎంచుకున్నా. అదీను ముస్లిం సాహిత్యం కూడా కొన్నట్టుంటుంది, ప్రింటుకూడా బాగుంది! అలానే మధురాంతకం కథలు, అత్తగారి కథలు కూడా కొనలేదు. సలాం హైదరాబాదులో కూడా ప్రింటు చాలా బాగుంది, అందుకే తీసుకున్నా. కొడవటిగంటి 'బెదిరిన మనుషులు', 'బ్రతుకు భయం' కొందామంటే రెండూ లేవు. 'చదువు' కొనాల్సిందేమో, ఎందుకో కొనలేదు.

అతను లిస్టులో ఉన్న 'అంపశయ్య' మరచిపోయాడు కానీ తరువాత ఊరికినే బ్రౌజు చేస్తుంటే తగిలింది. అలా తగిలిన మంచివి, 'ఎంకి పాటలు', 'కన్యాశుల్కం'. కొట్టతను 'భారతం లో చిన్ని కథలు' చాలా బాగుంటుందండి, ఇరవై సంవత్సరాల తరువాత వచ్చింది అన్నాడు. ప్రింటూ, బొమ్మలూ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కొనేశాను. 'బుడుగు', 'బాపు బొమ్మల' వంటి పుస్తకాలు కూడా కొన మన్నారు, కాని మళ్ళీ వస్తానండి ఇక్కడే ఉంటాను అని చాలా వరకూ పక్కకు తీసేసా. సారాంశం ఎంటంటే, నా లిష్టులోనివి కొన్ని వారి దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిలో ప్రింటు, బొమ్మలూ చూసి ఎంపిక చేశాను.

కొట్టలో మనుషులు
కొట్టులో నాకు మార్గదరకం ఇచ్చినతని తో మాటలలో పడ్డాను.
ఎఁవటండీ, అమెరికా తీసుకెళ్ళడానికా ఇవన్నీ ? లేదండీ.
ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? లేదండి. మొన్ననే అమెరికాలో చదువు పూర్తి చేసుకొనొచ్చా.
MS ఆ ? అవునండి.
ఎందులో ? ఎలక్టికల్ ఇంజనీరింగ్.
ఇక్కడేక్కడ చదివావు? కేరళ ఆరీసి. అమెరికాకి వెళ్ళే ముందు బెంగుళూరులో పని కూడా చేసా ఒ రెండు సంవత్సరాలు.
మా అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చింది. టీసిఎస్ లో. (బాబోయ్ ఎక్కడ చూసినా వాళ్ళే, గాడిదల్లాగా) అవునా అండి, నేనూ పని చేసా టీసిఎస్ లో. మంచి కంపెనీ అండి. కాని ఐదు నెలలే చేశాను.
యా ఎందుకు ? ఇంకో కంపెనీకి మారాను. మూడు రెట్లు ఎక్కవ జీతం ఇస్తున్నారని, కానీ టీసియస్ చాలా మంచి కంపెనీ అండి. అక్కడ చేస్తే బాగుంటుంది. (బాగుంటుంది మై యాస్, ఇప్పుడు ఈయన ఇంటి కెళ్ళి ఆయని కొడుకుని కంపెని మారమని శావ దొబ్బుతాడేమో, అచ్చ తెలుగు నాన్న గారి లాగా)
ఇంతకూ అమెరికా నుండి ఎందుకు వచ్చాశావు ? ఉద్యోగం దొరకలేదా ? అవునండీ ఉద్యోగం రాలేదు.
ఎదోటి వస్తుందనుకుంటగా? వచ్చినా నాకు నచ్చినవి రాలేదండి.
(అప్పుడప్పుడూ గొఱ్ఱెల మందనుండి వైదొలగే నాలాంటోళ్ళు కూడా ఉంటారని, లోకులకి తెలియజెప్పడం నా ప్రస్తుత ప్రవృత్తిగా ఎంచుకున్నాను, అందులో భాగమే ఈ అమెరికాలో ఉద్యోగం సంపాదించడం చేతకాలేదనే ప్రచారం, లేక పోతే నన్నీ సాఫ్టువేరు-డబ్బుల అరాచకానికి చిహ్నంగా మార్చేసింది సంఘం. "ఆ అన్నయ్య చూడు ఇంచక్కా చదువు కున్నాడు, బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు, అమెరికా లో చాలా మంచి యూనివర్సిటీలో చదువుతునానడు, ఇంకా బోలెడంత డబ్బు సంపాదిస్తాడు, నువ్వు కూడా చదువుకుంటే అలా అవుతావు". (బోలెడంత డబ్బు మై యాస్) దీని గురించి ఇంకా లోతుగా నా వచ్చే టపా 'గొఱ్ఱెల మంద, పుఱ్ఱెల వ్యాపారం' లో)

ఇప్పటికి చదివిన పుస్తకాలు
అసమర్థుని జీవ యాత్ర తో మొదలు పెట్టా, మొదట్లో చాలా వరకూ నా గురించే వ్రాస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. కాని సగం అయ్యింతరువాత ఆ భయం సందేహం తొలగి పోయాయి. చాలా బాగుంది పుస్తకం, ఆఖరున చాలా దుఃఖంగా, మాలాంటి అసమర్ధులకి చాలా నిరాశగా ముగించారు కథని. దాన్ని దిగమింగడానికి చాలా సేపు పట్టింది.

మధ్య మధ్యలో భారతంలో చిన్ని కథలు చదివా. చాలా బాగున్నాయి, మీరు కూడా వాటిని తప్పక చదవలి. చాలా మంచి నీతులు, మంచి కథలు, మంచి భాష వున్నాయందులో.

ఇక 'మహా ప్రస్థానం', 'అమృతం కురిసిన రాత్రి' అప్పుడప్పుడూ తిరగేస్తున్నాను. వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ గురించి అందరికీ తెలిసిందేగాని. తిలక్ కూడా చాలా బాగున్నాయి. అదే చేత్తో ఎంకి పాటలు కూడా చూస్తున్నా. వాటి గురించి నేను చెప్పాదేముంది. నాకస్సలర్థం అవనిదల్లా కృష్ణ శాస్త్రి!

నిన్ననే అంపశయ్య పూర్తయ్యింది. నా ఆకాశంలో ఉన్న ఎక్సుపెట్టేషన్లకు ఎం తీసి పోలేదు. నవల మధ్యలో చాలా భారీగా ఉన్నా, ముగింపు చాలా ఆశాభరితంగా ఉంది. కాబట్టి మంచిగా అనిపించింది. ఈవాళ కన్యాశుల్కం మొదలు పెడతాను.

అంపశయ్య కాలం లోనే మా నాన్న కూడా డిగ్రీ చదివారు, కాబట్టి ఆ రోజుల్లో సర్వవ్యాప్తమైన చలం కథల పుస్తకాలలో ఒకటి 'యవనవ్వనం' మా ఇంట్లో ఉంది. ఈ పుస్తకాలు కొనే ముందు దానిని చదివా. బాగున్నాయి కథలు. 'యవనవ్వనం' బాగా నచ్చింది. 'భార్య', 'సుశీల' బాగున్యాయి. 'నాయిడు పిల్ల' బానే ఉంది. 'మధుర మీనాక్షి' లో ఆ రోజుల్లో కామం అంటే ఎంటో తెలయకుండానే పిల్లల్ని కనే ఆడవారుండే వారని తెలుసుకున్నాను :). 'రెడ్డి రంగమ్మ' అంతగా నచ్చలేదనాలి. కాని పాత సాహిత్యం చదవడానికి ఈ పుస్తకం మంచి పునాది అయ్యింది.

నేను కొన్నవి మరీ మంచి పుస్తాకలూ, మరీ భారీ పుస్తకాలలా ఉన్నాయి. ఏ Jane Austen లాంటివో P.G. Wodehouse లాంటివో చిక్కితే బాగుండునని పిస్తుంది. 'చివరకు మిగిలేది' తలచుకుంటేనే భయం గా ఉంది. అదృష్టవశాత్తూ 'కన్యాశుల్కం', 'గణపతి' ఉండనేవున్నాయి.

Friday, August 24, 2007

నోటువెలది

ఎన్నాళ్ళ నుండో అనిపిస్తుంది
"ఆటవెలది చాలా తేలికే, మరి మనం అందులో ఒక పద్యం కూడా రాయలేదేంటి ఇప్పటి వరకూ?" అని.
దానికి ఒక కారణం, ఎక్కడో "ఆటవెలదిలోనూ తేటగీతిలోను ఒకటవ మరియు మూడవ పాదాలు ఒకేలా ఉంటాయి" అని చదవడం, కానీ అది తప్పని నాలుగు వేమన పద్యాలు ఒక వికీపీడియా చూడగా తెలిసింది.

ఏదేమైనా, ఈవాళ బస్సులో వస్తుంటే, సరైన inspiration లేక పద్యాం వ్రాయలేకపోతున్నాననుకుంటుండగా, కళ్ళ ముందు జిగేలు మని మెరిసింది ఒ పది రుపాయల నోటు, ఇంకే ముంది.
పదిలమైన నోటు పది రుపాయల నోటు
కోరుకున్న దెచ్చు కోకు హెచ్చు
బస్సువాని కివ్వు బైల్దేరు యిక నువ్వు
పట్టణంబు జూడు పల్లె జూడు
ఆటవెలది నిజంగా చాలా తెలికండి. ఎంత తేలికంటే కొద్దిగా సవాలు గా ఉంటుందని నేను యతినియమం తో బాటు ప్రతి పాదంలోనూ అంత్యనియమం కూడా పాటించా (నోటు-నోటు, దెచ్చు-హెచ్చు).

తెలుగులో ఎన్ని హ గణాలు ఉన్నాయంటే మీకు సుర్యగణాలకేం లోటు ఉండదు. అలానే సూర్యగణాలు కాని పద ప్రయోగాలలో ఇంద్రగణాలు చాలా ఉన్నాయి. ఇకనేం మీరు కూడా వ్రాయండో ఆట వెలది.

ఎంతైనా "దేశ బాషలందు దెలుగు లెస్స" అంది ఆటవెలదేగా. ఇవాళే దీన్ని బస్సులో చూసా... హుఁ... అర్థమయ్యింది! మీరు కూడా ఇది వ్రాసున్న బస్సెక్కి కూర్చుని ఆలోచించండి :)

Sunday, August 19, 2007

పైసా విలువ, ప్రాణం విలువ

నేను క్రిత నెల హైదరాబాదులో ఉన్నప్పుడు, ఒక ప్రయాణం చెయ్యాల్సివచ్చింది. నిజాంపేట రహదారి నుండి మాధాపూరం పోలిసు కార్యాలయానికి వెళ్ళాల్సివచ్చింది. ఆ ప్రయాణం మీకోసం విఫులంగా వివరింపబడినది దిగువున.

ఎందుకు, ఏమిటి, ఎలా

అది శనివారం సాయంత్రం, నేను తరువాతి రోజే నగరం విడిచి మాపల్లెకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మా సీనియర్ ఒకతను నన్ను రాత్రి భోజనానికి కలవమని చెప్పాడు. మామూలుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలసినా 'ముందు చిన్న ఉద్యోగంలో చేరి తరువాత పెద్ద దాంట్లోకి మారితే బాగుంటుంద'ని రిస్కు హెడ్జింగ్ చేసే మహదుపాయం ఒకటి పారేస్తున్నారు ఆర్యులు. అట్లాంటా నుండి ఆంధ్రా వరకూ ఇదే ఉపాయం. బ్లాగర్ల నుండి అమ్మలక్కల వరకూ ఇదే సలహా. నేనూ చేసేదదే అని వారికి అర్థం అవ్వదు. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒ ౧౫౦ (150) వేల డాలరుల ఉద్యోగం ఒకటి చూసుకొని ఆ తరువాత పెద్ద అవతారం దాల్చుదామన్నదే నా ఉద్ధేశం కూడానూ. అందుకే ఉద్యోగం ఉన్నోళ్ళ దగ్గర ఉద్యోగ సలహాలు తీసుకోకూడదు.

ఏది ఏమైనా నా సీనియరు కూడా అదే ఉపదేశిస్తాడేమోనని భయపడుతూ బయలుదేరా. అతను ఫోను చేసి నన్ను పోలీసు స్టేషనుకు రమ్మన్నాడు. సమయం కూడా ఇచ్చాడు. వచ్చే పద్దతి కూడా వివరించాడు. మా ఇంటి ముందు ఆటో ఎక్కితే అతను మాధాపురం పోలీసు స్టేషను దగ్గరకు తీసుకుపోతాడంటా.
"ఆటోనా అంటే ఎంటి ?" అని నోరు జారా. "నాకైతే బస్సుల,సర్వీసు ఆటోలు మాత్రమే తెలుసే" అన్నాను. అతను "కాబోయే గోడ వీధి ఉద్యోగివి, అంత పేదరికంగా ఆలోచిస్తావా?" అని ఆడిపోసుకున్నాడు. "పేదరికం పాపం కాదు బాబూ, శాపం" అని నేను వాపోయినా అతని ఐఐఎం బుర్రకి అర్థంకాలేదు. అందుకనే డబ్బున్నోళ్ళ దగ్గర ప్రయాణ సలహాలు తీసుకోకూడదు.

సర్వీసు ఆటో
నేను కూకట్‌పల్లి ముఖ్యరహదారి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సర్వీస్ ఆటోకోసం వెతక సాగా, చాలా ఉన్నాయి, అన్నిటి మోటర్లు తిరుగుతున్నాయి. కాని తెలివిగా ఏది ముందు బయలుదేరుతున్నదో చూసుకొని ఎక్కాలి, నేను ఆ పనే చేసా. డ్రైవర్ సీటు పక్కన ఒక డబ్బా ఉంది, మీరు అమాయకులైతే అది ప్రథమ చికిత్స డబ్బా అనుకుంటారు, కానీ కాదు, అది extra seating! నా కన్ను దాని మీదే పడ్డాది, దాని మీదకెక్కి కూర్చున్నా. ఆ డబ్బా మీద కూర్చుంటే మీకు ప్రయాణంతో బాటు ప్రమాదం ఉచితం. అక్కడ పట్టుకోవడానికి ఎఁవీ లేవు! నాకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళ గుండె గుబేలు మనేది, కానీ నేను భయపడలేదు. కాలుని గట్టిగా ముందుకేసి నొక్కి, పిఱ్ఱని గట్టిగా వెనక్కేసి నొక్కాను. న్యూటన్ లా వల్లో ఘర్షన వల్లో నేను ఆటోలోనే ఉన్నా, శరవేగంతో అది అతిశరముచేసుకుంటూ ముందుకు వెళ్ళింది!

హృదయభాను
అలా ముందుకి ఓ ౨౦౦ మీటర్లు వెళ్ళగానే ట్రాఫిక్ జాం. మన ఆంధ్రలు గొడ్డుల్లాగా పనిచేసి జీవితాన్ని ఆశ్వాదించరని ఎవరైనా అంటే, వారికి నచ్చజెప్పండి, "చూడు మా రాజధానిలో శనివారం రాత్రి రద్దీ, అందరూ వారాంతంలో మస్తీ కొట్టడానికి నగరంమీద పడ్డారు, నేనిలాంటి వింత విలాశదేశాలయిన అమెరికా, కెనడాలలో కూడా చూడలే"దని.

అలా రద్దీలో ఆటో ఆగినప్పుడు అప్పటిదాకా నా ప్రాణం మీద ఉన్నధ్యాసంతా రోడ్డుపక్కన పడ్డది. రహదారికి మీటరు దూరంలో గుడిసెలున్నాయి. భారతావనిలో రోడ్డకు అటూఇటూ రెండు మీటర్లు వాహనాలు వెళతాయన్న విషయం జగమెరిగిన సత్యం. అంటే వారిల్లు రోడ్డుమీదే ఉన్నట్టు. ఇంటి ముందు ఆడవాళ్ళు, ఇళ్ళ యజమానురాళ్ళు కలసి ముచ్చటించుకుంటున్నారు. ఊహించుకోండి, ట్రాఫిక్కు జాం, రోడ్డుకు అవతలా ఇవతలా మనవాళ్ళు రెండు మీటర్లవరకూ వహనాలని పోనిస్తూనేవుంటారు.
అటువంటి చోట, లారీ చక్రాలకి మీటరు దూరంలో రాళ్ళ సమూహం మీద గుడిసెలు, వాటి ముందే సాయంకాలం ముచ్చట్లు. ఏవూరి నుంచి వచ్చారో పాపం, ఎ పల్లెటూరిలో ముచ్చటించే అలవాటుని ఇలా నగరానికి తెచ్చారో ! ఎక్కడ అప్పుతీరక బ్రతుకు తెరువు కోసం ఇలా నగరానికి మూటముడి సర్దుకొని, పిల్లల్ని చంకనెత్తుకొని ఇలా బయలుదేరారో! ఈ పొగకి వీరి ఊపిరితిత్తులు ఎంత కాలం పనిచేస్తాయి? వీరి ఆయిష్షు ఎంత తగ్గిపోతుందో!
"ఓ కమాన్ నాట్ నౌ!" అనుకొని నేను అప్పుడే ఆ శనివారం రాత్రి, ఆగోలలో ప్రశాంతంగా ఉదయిస్తున్న నా హృదయభానుని నెత్తి మీద సుత్తికో ఒ నాలుగుసార్లు కొట్టి, పాచిమూఖానే వాణ్ణి అస్తమింపజేసాను.

"జెయన్‌టీయు వరకూ ఇలానే ఉంది, మీరు నడిచి వెళ్ళిపోతే తొందరగా చేరుకుంటారేమో" అని డ్రైవరు బాబు సలహా, సరే అతని మూడు రుపాయలూ అతనికిచ్చి నేను బయలుదేరదామనుకున్నా. అతని దగ్గర యాభైకి చిల్లర లేక, ఏమీ ఇవ్వకుండానే బయలుదేరాను. జెయన్‌టీయు దగ్గర రోడ్డు దాటాల్సి వచ్చింది. ఆ గండం గట్టెక్కాక, మహాతాంత్రిక నగరానికి (హైటెక్ సిటీ) సర్వీసు ఆటో వెతకడం మొదలు పెట్టా. అక్కడ అవి దొరుకుతాయని, మా మహాతాంత్రిక నగరంలో పనిచేసే అల్పతాంత్రిక బావ చెప్పాడు. కాని అలాంటివేమీ కనబడలేదు. నేను నా పేదరికానికి అన్యాయం చెయ్యలేక, మామూలు ఆటో తీసుకోలేదు.

షేరింగ్ ఆటో
అక్కడ ఐదుగురు జనాభా ఎక్కికూర్చున్న ఒక మామూలు ఆటో చూసా, వావ్ అనుకున్నా! సర్వీసు ఆటోలు కోసం చూస్తున్నా, ఎం కనబడలేదు. ఆ ఐదుజనాల ఆటో నాదగ్గరకు వచ్చి "సార్ ఎక్కడికి" అన్నాడు, "హైటెక్" అన్నాను. "ఎక్కండి" అన్నాడు. "ఎక్కడ" అన్నాను. "ఇదిగో ఈ పక్కన" అని తన పక్కన కూర్చోమన్నాడు. నేను గతిలేక ఎక్కాను. దాన్ని షేరింగ్ ఆటో అంటారు. నాకు ఎందుకో మా బావ సర్వీస్ అటో అన్నట్టు బాగా గుర్తు! అందుకే సర్వీసు ఆటోలకీ షేరింగ్ ఆటోలకీ తేడా తెలియని బావలని సలహాలు అడగకూడదు.
నేను ఎక్కాను, అంటే నా ఒక పిఱ్ఱ ఆటోలో ఉంది, ఒక కాలు వేళ్ళు లోపల ఉన్నాయి, ఒక చేతి వేళ్ళు పైన ఎదో రాడ్డుని గట్టిగా పట్టుకున్నాయి. డబ్బై ఐదు కేజీల ప్రాణం ఆ గుప్పెట్లో ఉంది అచ్చంగా. ఆటో మళ్ళీ దూసుకుపోతుంది. అలా అర ప్రాణాలు గుప్పెటికి అందించి, అర దీపం గాలికొదిలి ప్రయాణం సాగుతుండగా, రోడ్డు మధ్యన రెండడుగులు ఎత్తున్న డివైడరు పై ఒ నలుగురు స్త్రీపురుషులు వెల్లకిలా పడుకొని వున్నారు. వారిని ఒ ఫోటోగ్రాఫరు ఫొటో తీస్తున్నాడు. అలానే ఓ ఇద్దురు పోలీసులు కూడా వున్నారు. ఆకాశం లో ఎగురుతున్న అనుభూతి వస్తున్ననాకు దాని మీదకు పెద్ద ధ్యాస పోలేదు.

అలా చాలా సేపు ప్రయాణించగా నగరం వదిలి, భుధ గ్రహాన్ని తలపించే ఒ ప్రాంతం గుండా వెళ్ళగా, చివరికి మహాతాంత్రిక నగరం రానేవచ్చింది. అక్కడ ఇంకో షేరింగ్ ఆటో ఎక్కి మాధాపురం పోలిసు కార్యాలయానికి వెళ్ళా. అది ISO 2000 certified పోలిసు కార్యాలయం అంట. అంటే ఎంటో మరి? నిందుతులకు బదులు బాధితులను ఖైదు చేస్తారా ఎంటి?

వులవలు
నా సీనియర్ రానే వచ్చాడు, మేము మంచి భోజనశాలకు వెళ్ళి ఉలవచారు తిన్నాము. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. పెద్దలు, తోటివాళ్ళు, చిన్నలు గురించి మాట్లాడుకున్నాం. ఆశలు, అవరోధాలు లెక్కేసుకున్నాం. డబ్బు, సంతృప్తి, సేవ గురించి చర్చించుకున్నాం. జియ్యారి, జీమేట్, క్యాట్ లలో లోటుపాట్లు తెలుసుకున్నాం. రాజమండ్రి, బెంగుళూరు, కల్లికోట (కాలికట్) గుర్తుచేసుకున్నాం. బిల్ మాత్రం అతను కట్టాడు.

వెనక్కి వస్తున్నప్పుడు రాత్రి ఆటోలేమి దొరకక మేము పోలీసు కార్యాలయం వరకూ ఒక షేరింగ్ ఆటోలో ముందు డ్రైవరుకు అటూ ఇటూ కూర్చుని బయలుదేరాం. అతని ఐఐయమత్వం దానికి అడ్డుచెప్పలేదు. ఎదో మేమే గొప్పనుకున్నట్టు, మిగతా ఎవరికి అర్థంకాని మహాతాంత్రిక ఆంగ్లంలో మాట్లాడుకున్నాం.
"ఇది ఫోటో తీసుకుపో, నువ్వు గోడవీధి (వాల్ స్ట్రీట్) లో పెద్ద వ్యక్తి అయినప్పుడు ఇది గుర్తుచేసుకోవచ్చు" అన్నాడు. నవ్వుకున్నాం, ఈ సారి నా తలకూడా ఆటోలో ఉన్నందుకు నేను సంతోషించాను.

విలువలు
వెనక్కి ఇంచుమించుగా వెళ్ళిన రీతిలోనే వచ్చా, షేరింగ్ ఆటో, షేరింగ్ ఆటో, బస్సు, కాలి నడక. ఈ సారి సర్వీసు ఆటో ఎక్కలేదని గమనించాలి. మొత్తం ట్రిప్పుకు ముప్పై రూపాయలు కూడా అవ్వలేదు! అది మీరు అసాధ్యమనుకున్నారు, కాని ఉద్యోగం మాని చూడండి, చాలా అసాధ్యాలు సాధ్యాలవుతాయి.

దారిలో ఇంతకు ముందు డివైడరు పై పడుకున్న వ్యక్తులు ఉన్న స్థలం దగ్గరకు వచ్చాం. డ్రైవరు చెప్పసాగాడు.
"సర్వీసు ఆటో వస్తుంది, దానిని వెనకనుండి మామూలు కారు గట్టిగా గుద్దింది, నాలుగైదు పల్టీలు కొట్టింది ఆటో. అందులో ఉన్నవారందరూ చచ్చిపోయారు."
నేను హృదయ భాను ఎమంటాడో వినడానికి చెవులు సిధ్ధం చేసుకున్నాను. ఎం వినిపించలేదు. నాకు నేనే అనుకున్నా,
"పేదప్రాణాలు ఎక్కువే దేశంలో, అందుకే వాటికెక్కడా విలువలేదు. ప్రాణానికి విలువ ఇచ్చేది ఎవరు? ఎవరి ప్రాణానికి వారేగా ఇచ్చేది! పేదరికం పైసాకి ఇచ్చే విలువ ప్రాణానికి ఇవ్వదు! మరి మధ్య తరగతో? ఆటోలొస్తుంటాయ్ పోతుంటాయ్, ప్రాణాలు వస్తుంటాయ్ పోతుంటాయ్."

Friday, August 17, 2007

హృదయభాను: చిరు పరిచయం

ఉపోద్ఘాతం (సంబంధంలేని సుత్తి)
నేను చాలా కాలం నుండి బ్లాగలేదని అభిమానసంఘాలు చాలా గోల పెడుతున్నాయి. ఆ విషయం తెలియఁగానే, అభిమాన సంఘాలున్నాయని తెలిసి చాల సంతోషించాను, కానీ వారి అభిమానం ఎక్కడనుండి వస్తుందన్నది నాకర్థమయి, సంతోషం సల్లారింది. జీవితంలో డెస్పయ్యి నా బ్లాగు చదివి నా పరిస్థితి కంటే వారి పరిస్థితి చాలా బాగుందనుకొని సంతోషపడే వారి కూడలే ఈ అభిమానసంఘాలు.
నేను దేశాటనలో ఉండడం వల్ల అంతర్జాలాని అత్యవసర పనులకు తప్ప రాలేకపోయాను. భాగ్యనగరం నుండి మా ఇంటికి వచ్చాను, మాది పల్లటూరు కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ రాదు. ఇంకో వారం రోజుల తరువాత ఉత్తరాఖండం వెళ్ళి వచ్చా. ఇంటికొచ్చాక తెలిసింది, మీరు ఎంత కొండల్లోకి వెళ్ళినా, మిమ్మల్ని టీవీ, అంతర్జాలం రూపంలో మిమ్మల్ని నూతన జీవన విధానం వెంటాడుతూనే ఉంటుందని. ప్రపంచకంపు నుండి అతి దూరంగా ఎప్పటికీ పారిపోలేరని! ఐతే ఇప్పుడు కారు హారను కూడా రాని మా ఇంటికి ఇంటర్నెట్ వస్తుందని తెలుసు కొని, అభిమానులకోసం బ్లాగుతున్నా.

ఎవరీ హృదయభాను?
నాకూ ఆధునిక జీవన విధానానికి అస్సలు పడదని ఈ పాటికే మీకు అర్థమయ్యిండాలి. అందులో నాకు నచ్చని విషయాలు కొన్ని చెప్పవలసి వస్తే: రెసిడెంషియల్ పాఠశాలలు, హారన్ మోగించే కార్లు, భద్రత కరువైయ్యే సర్వీసు ఆటోలు, పోగ బట్టిపోయిన కాలనీలు, వగైరా వగైరా.

సిటీలో చిన్న పిల్లల్ని చూస్తే .......
"ఎందుకు? వీళ్ళు కష్టపడి ఈ పొగలో, ఈ భద్రత లేని ఆటోలలో ఎక్కి, లెక్కలు మాత్రమే నేర్పి, మనుషులను యంత్రాలుగా మార్చే బళ్ళకు వెళ్తున్నారే!
ఇంత కష్టపడీ వీళ్ళు పెద్దయి సాఫ్టువేరు ఇంజనీర్లయి, ప్రాణం, మనసు లేని ఓ మూర్ఖ డబ్బా ముందు కూర్చుని జీవితాన్ని వృధాగా గడపడానికేనా?
లేదు వీరికి దీనికంటే మంచి బాల్యం అవసరం, అటువంటి బాల్యం పై వారికి హక్కు ఎంతైనా ఉంది. నేను వీరికోసం పాటు బడతాను.
Materialism (తెలుగులో ఎమంటారో) ని జయించిన నాగరితను సాధించిన మహాన్మహిత దేశం లో పుట్టాను. మానవ జీవితం లో అందాలను నింపి, మనిషి మనస్సును ఆనందంతో పొంగి పొర్లేడట్టు చేసే చైతన్యం సాధించిన దేశమిది.
నా దేశం కోసం, దాని భవిత కోసం, దాని పెద్దలకోసం నేను పాటుపడతాను"
అని ఒక పద్ద లెక్చరు వినపడుతుంది. ఇంతలో మీకేమో, ఛాతీలో వేడిగా అనిపిస్తుంది, ఇంకొంత సేపు ఆ భాషణ వింటే ఛాతీ పేలేదేమో అని పిస్తుంది. ఇంతకీ ధర్మసందేశాలని ప్రబోధిస్తున్నది ఎవారా అని అటూ ఇటూ చూస్తే, అటువంటి వారెవూ కనిపించరు, చుట్టూవున్నవారంతా దైనందిత జీవితంతో రాజీపడడానికి ఉపాయాలాలోచిస్తున్నవారేగాని, ఉపదేశాలు చేసేవారు కారే.

అవును అతనే హృదయ భాను!
మీ గుండెలోనే గూడు కట్టుకొని, దుష్టరాజకీయనాయకులనీ, భ్రష్టప్లాస్టిక్కునీ చూసినప్పుడల్లా మీకు కోపం తెప్పించి, మనశ్శాంతి లేకుండా చేసి, మీకు మీరే ప్రబోధించేలా చేసే, ఆ అంతఃతేజస్సే ఈ హృదయభాను.

హృదయభాను వ్యాఖ్యానాలు
హృదయభాను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, అతని వ్యాఖ్యానాలు సర్వత్ర సర్వదా వ్యాపించి ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు
"భాషని బ్రతికించుకోవడమేమిటి నీబొంద?" రానారె వారి హృదయభాను.
"అవునా .. నిజమేనా .." కొత్త పాళి వారి హృదయభాను.
"టెల్గూ అంత వీజీయా…!" శ్రీరాం వారి హృదయభాను.
"ఎదో ఉండబట్టలేక... రాస్తున్నాను" సౌమ్య వారి హృదయభాను.
నా హృదయభాను ఇతర వ్యాఖ్యానాలు.

మీ హృదయభాను ఎమంటున్నాడో(న్నదో) తప్పక తెలుపండి !
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం