భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, November 18, 2009

'మాడ'ష్టీ - నిజమా? కలా?

మాడష్టీ అనే మాడు పదం నన్ను చాలా టీజు చేసింది అనడం ఏ మాత్రం హైపరుబోల్ కాదు.

అసులు ఏంటి ఈ మాడష్టీ అనేది? ఎలా వుంటుంది? సంతలో అమ్ముతారా? ష్టాకు మార్కెట్టులో అమ్ముతారా? కొనవచ్చా కొనలేమా? నీలా వుందా నాలా వుందా? నీలో వుందా నాలో వుందా? నిజమా? కలా?తలచుకుంటే మాడ పేలిపోతుండి కృష్ణా!

అసలు అందం అంటే ఏఁవిటి? అద'లది' నిజమా కలా? నీలో వుందా నాలో వుందా?
'తెల్ల'వాళ్ళు తేల్చి చెప్పారు, బ్యూటీ వుండి బిహోల్డరు కళ్ళలోనని.
'మన'వాళ్ళు కూడా తేల్చి చెప్పేవుంటారు, కానీ నాకు సంస్కృత శ్లోకాలు పెద్దగా గుర్తుండవు, పెద్దగా గుర్తులేవూ కాబట్టి, ఇప్పుడేమీ ఉదహరించలేను కానీ.. నాకైతే మనవాళ్ళు ‘లోకోః భిన్నాభిప్రాయః’ అని ఉద్బోధించివుంటారని అనిపిస్తుంది.


* * *

గరికపాటి నరసింహారావు గారు చెప్పడం ప్రకారమైతే ప్రపంచం నీలోవుంది, నువ్వు దాన్ని ఎలా చూస్తే అలా వుందని వ్యాసుడు, ఓషో, రవిశంకర్ గురుజీ అన్నారఁట. ఆయనైతే దానికి సంస్కృత శ్లోకాలు కూడా చెబుతారు.

ఓషో అంటే గుర్తుకువచ్చింది. ఓషో అంటే గుర్తుకు వచ్చేది సామాన్య ప్రజానీకానికి విచ్ఛలవిడి శృంగార వైభోగాలఁట. మొన్ననే తెలిసివచ్చింది. ఎవరినో భగవాన్ రజనీశ్ తెలుసా అంటే, అతనా నగ్నాశ్రమాన్ని పెట్టాడంటగా అన్నారు. వెల్.. అవన్నీ నాకు తెలియదు గానీ, ఓషో కొన్ని మంచి పాయింటులు లేవనెత్తాడని నా నమ్మకం - ఆయన గుఱించి తెలిసిన కూస్తా కాస్తాలో. మాంచి పాయింటులు లేవనెత్తే ఎవరికైనా మంచి కాలం కలసిరావడం తప్పనిసరి కాదని చాలా మంది అభిప్రాయం.

అభిప్రాయమంటే గుర్తుకువచ్చింది.
ఓషో మీద మీకో అభిప్రాయం వుంటే, అది ఓషో గుఱించి కంటే, మీ గుఱించే ఎక్కువ చెబుతుందఁట.
అంటే ఒకరికి ఓషోలో మహా గొప్ప తత్త్వవేత్త కనబడితే, మఱి కొందఱికి ఆయన మంచి పాయింటులు లేవనెత్తాడని అనిపిస్తే, ఇంకొందఱికి ఆయన బూతుని మతం చేసి సొమ్ము చేసుకున్న ఠక్కరి అనిపించవచ్చు, ఇంకొందరికి దేశ బహిష్కరణ చేయవలసివచ్చేటంతటి తీవ్రవాది అనిపించవచ్చు (అమెరికా ప్రభుత్వం లాగ).

ఇంత మందికి ఇన్ని విభిన్న అభిప్రాయాలున్న వారిమీద అభిప్రాయం ఎవరి గుఱించి ఎక్కువ సమాచారం ఇస్తుందన్నది ఇప్పటికే తెలియవస్తుందనుకుంట.

శివోఽహం

ఓషో లాంటోడే శివుఁడు. ఓషో ప్రకారం ఆయనే శివుఁడు. (ఇక్కడ కూడా ఎవరి అభిప్రాయాలు వారివి).

శివుఁడి మీద కూడా ఎవరి అభిప్రాయాలు వారివి. లోకంలో చూడబోతే అన్నిటి మీదా భిన్నాభిప్రాయాలు వున్నట్టు కనబడుతుంది. భిన్నాభిప్రాయాలు వుండడం మీద తప్ప. మార్పు దక్క అన్నీ మారతాయిఁట. దానీ తస్సాగొయ్య. అలాగే భిన్నాభిప్రాయం మీద దక్క అన్నిటిఁ మీదా లోకులకు భిన్నాభిప్రాయాలుఁట.

శివుణ్ణినేనే అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. నేనేశివుణ్ణి అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. ఈ భిన్నాభిప్రాయల ప్రపంచంలో, చెడు అభిప్రాయాల బాధ్యత ఎవరు వహించాలి? అభిప్రాయం మోసేవాడిదా, దానికి ఆధారమైన వాడిదా, లేదా ప్రభుత్వానిదా?

* * *

గొప్పవారందరికీ ఇదే చిక్కువుంటుంది. ఉదా- శివుఁడు, ఓషో, రాజశేఖర రెడ్డి, కత్తి మహేశ్ కుమార్.

శివుఁడు గుఱించి మనకైతే పర్వాలేదు మంచి అభిప్రాయం వుంది గాని. పాశ్చాత్య దేశాల్లో ఆయని గ్రాండ్ కాంసెప్టుని వారు అర్థంచేసుకోలేకపోతున్నారు. అతనిని నకారాత్మక భావాలతో అసోసియేట్ చేస్తున్నారు.

ఓషో గుఱించి చెప్పనక్కఱలేదు.

రాజశేఖర రెడ్డి అంటారా, పోయినోళ్ళు అందరూ మంచివాళ్లు అని మనం గుర్తు పెట్టుకుందాం, లేకపోతే భిన్నాభిప్రాయాల వరద రావచ్చు. ఈయన పోయినప్పుడు ఈనాడు వాడిలా నేనూ ఎంతో కలతచెందాను గానీ, (నేను వార్తలకై నమ్ముకున్న ఏకైక స్రవంతి అది! ) అంతకు ముందు నాకు ఈయన పద్ధతులు పెద్దగా నచ్చేవి కావు, ఖజానా కాళీ చేసే తత్త్వం అని నా నమ్మకం. కానీ నిన్ననే ఒకతను రాజానగరం నుండి మావూరొచ్చి, “రాజశేఖర రెడ్డి వుంటే ఈ పాటికి చేలు కలకలలాడతావుండేవండి, ఇలా వుండేయేటండి అసలు” అన్నాడు. లోకోః భిన్నాభిప్రాయః అనుకొని సరిపెట్టుకున్నాను నేను.

* * *

అలానే ఇప్పుడు కత్తిగారి సంగతికి వద్దాము.

ఈయననే ఎందకు ఎంచుకున్నానంటే, అందరికీ తెలిసిన పేరు, పేరు వాడుకున్నా తప్పుగా భావించని విశాలహృదయుడు. ఇతర ప్రముఖ బ్లాగర్లు వివాధాలలో చిక్కుకున్నా, వాటిని గుఱించి సరిగా తెలియక ఈయనని ఎంచుకోవడం జరిగింది (ఈనాడు ఆ కథనాలను ప్రచురించినగాని, వాటిని నేను చదవుట జరుగలేదు).

ఈయనని గుఱించి చాలా మంది బ్లాగర్లను అడిగాను. వారిలో చాలా మంది, పెద్ద అన్నీ ఆయనకే తెలిసినట్టు వ్రాస్తాడు, అందుకే నాకు నచ్చుతుంది/నచ్చదు అంటారు. అదే తత్త్వం కొందఱికి నచ్చడం కొందరికి నచ్చకపోవడం జరుగుతుందే! ఈ విషయం నాకెప్పుడూ అర్థంకాదు. అంటే ఈయనకు మాడెష్టీ లేనట్టా? అసలు ఏంటి ఈ మాడష్టీ?

నేను ఒక అభిప్రాయం వ్రాసాననుకోండి. ఉదా- "హిట్లరు చేసింది ఏమంత పెద్ద తప్పుకాదు, అతను ప్రేరేపించబడ్డాడు, ఒక దేశ ప్రజ అతనికి వత్తాసు పలికింది"... దానికి నేను ఈరెంటిలో ఏదైనా జతచేయవచ్చుఁ
(చాయిస్ ఎ) దీనిని మీరు అంగీకరించకపోతే మీరు మూర్ఖులు
(చాయిస్ బి) ఇది నా అభిప్రాయం మాత్రమే.

ఇప్పుడు చాయిస్ ఎ ఉంచితే అతనికి మాడష్టీ లేనట్టు, చాయిస్ బి వుంచితే అతను మాడెష్టోడూ అని అర్థమా? ఇక్కడి అసలు విషయం హిట్లరుని మంచి వాడు అనడం (నా సహవాసి ఒకడు నిజంగా హిట్లరు గుఱించి అన్నమాటలవి) అలా అన్నవాడు మాడెష్టోడు అయితేనేం కాకపోతేనేం?

* * *

నేను ఒక టపా వ్రాసాను. ఆ మాటకు వస్తే, ఎవరైనా ఏదైనా టపా వ్రాసారు, దాని క్రిందఁ, “ఇది నా అభిప్రాయం మాత్రమే”, అని పెడితే వాడు మాడెష్టోడు లేదా కన్విక్షణులేనోడూ అని అనాలా?ఎవరైనా వ్రాసేవి వారి అభిప్రాయాలేగా, నేను మీ అభిప్రాయాలూ, మీరు నా అభిప్రాయాలూ వ్రాయముగా?

పోనీ అభిప్రాయాలతోఁబాటూ నేను ఉదాహరణలూ, పలువురి పెద్దల అభిప్రాయాలు కూడా ఊటంకించాననుకోండి. అవి కూడా 'నా' దృష్టిలో మంచి అభిప్రాయాలు, 'నా' దృష్టిలో మంచి ఉదాహరణలే అవుతాయి గానీ, మీ దృష్టిలో కాకపోవచ్చునుగా. ఇది నా అభిప్రాయం మాత్రమే అన్న ఉత్త పుణ్యానికి అతని మీద సదాభిప్రాయం ఏర్పరచుకోవచ్చా. ఆ మాత్రం దానికి నేను నా బ్లాగు శీర్షికని నా అభిప్రాయం మాత్రమే అని మార్చి ఏదైనా వ్రాయవచ్చాఁ అని.

* * *

నాణానికి ఇంకో ప్రక్క చూద్దాం. నా స్వానుభావంలో ఏం జరిగిందంటే, నన్ను వివిధ పర్యాయాలు చాలా మాడెష్టోడు అబ్బే అస్సలు చాలా ప్రౌడెష్టోడు అనీ అన్నరు. రెండు సార్లూ నేను చాలా ఖంగుతిన్నాను. ఏదీ నా నెత్తి మీదఁ వ్రాసుందా, ప్రొద్దుట అద్దం చూసుకోవడం మరచానే అనుకునేవాడిని.

అసలు చెప్పాలంటే నేను చాలా గొప్పోణ్ణి. (ఇది పూర్తి నిజం కాదు, ఎందుకంటే నేను అసలుకి చాలా చాలా గొప్పోణ్ణి అంటారు అందరూ).
ఇప్పుడు పై మాటన్నాక నేను మాడెష్టోడినా కాదా? చాలా చాలా గొప్పవాడినైన నేను, ఉత్త గొప్పోణ్ణి అన్నందుకు మాడెష్టోడి నౌతాను, లేదు నా గొప్పని నేను చెప్పుకోవడం అమాడెష్టత్వం అవుతుందా. అంతెందుకు అమెరికాలో జాబింటర్వూకి వెళ్ళి నేనూ మీరూ మన భారతీయ సాంప్రదాయ మాడెష్టత్వం చూపితే వాడు మనకి మహాద్వారం చూపిస్తాడు.

* * *

ఇప్పుడు మాడెష్టిత్వంతో వచ్చిన ఇంకో చిక్కు. మాడెష్టత్వం మంచి లక్షణం అయినప్పుడు నేను మాడెష్టు అని చెప్పుకోవడం అమాడెష్టిత్వం అవుతుందా? అనడం ప్రక్కన పెట్టండి, ప్రదర్శిస్తే?

"నేను గొప్పవాడిని, కానీ నేను మాడెష్టువాడిని కాను". సరేఁ, బాగుంది, మాడెష్టు కాదని మాడెష్టుగా చెప్పుకున్నాడు బాగుంది వీడి పద్ధతి.

* * *

మొత్తానికి మిమ్మల్ని మాడెష్టు అని కొందరు. గర్విష్టు అని ఇతరులూ నంటే, అది వారిలోనే వుందని పిస్తుంది. మిమ్మల్ని మాడెష్టు అనడం వారి మాడెష్టీ, మిమ్మల్ని గర్విష్టు అనడం వారి గర్విష్టీ!

అంతెందుకు మీరు గొప్ప అన్నభావం వారిలో లేనప్పుడు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారని వారికి ఎలా అనిపిస్తుంది? నేను , అంటే అహం, అంటే శివుఁడు, అంటే బ్రహ్మ, గొప్ప వాడినని మీకు తెలుసు కానీ మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, అందుకే మీకు కోపం వస్తుంది.

* * *

ఉదా – గీతలో కృష్ణుడు (కొందరి అభిప్రాయంలో భగవంతుడు), "నేను" అనడానికీ "భగవంతుడు" అనడానికీ పెద్ద తేడా చూపించడు, ఛందస్సులో ఏం సరిపోతే అది వాడుతుంటాడు అనిపిస్తుంది. ఇది చూసి నన్నో గూదోడు (మా తమ్ముడౌతాడు వరసకు కాబట్టి అభిప్రాయాలు జాగ్రత్త) "భగవద్గీతలో కృష్ణుడు డబ్బాకొట్టుకున్నట్టుంటుంది" అని అన్నాడు.
వెల్.. దాని పేరే అది కదా మరి భగవత్ గీత (జస్త్వసంధి షష్టీతత్పురుష సమాసం). చెప్పేవాడు భగవంతుడు కాబట్టి, కృష్ణుని ‘డబ్బా’నే అవుతుంది?

కృష్ణుడు అలా నేను అంటే భగవంతుడు అనకపోతే ఇక భగవద్గీతకు విలువేంటి?
కృష్ణుడు బోధించేది మనలోని బ్రహ్మతత్త్వాన్ని వెదికితీయమని.
ఆయనే "అబ్బే లేదండి నాదేఁవుంది, ఎదో రథం నుడుపుకునే అనస్కిల్డు లేబరుని" అని మాడెష్టీ చూపితే, ఇక బ్రహ్మత్వానికి ఆధారం ఏది?
కాలః కలయతామ్’అహం’ అనక పోతే అది అద్వైతం ఎలా అవుతుంది ?

కాబట్టి నేను శివుణ్ణి మహేశ్వరుణ్ణి నేను ఎంత డబ్బా కొట్టుకున్నా అది తక్కువే. మీరూ అలానే భావించండి.
"అతడంతే అంతా అతడికే తెలిసినట్టు చెబుతాడు" అని కృష్ణుణ్ణి కూడా విమర్శించేవుంటారు పురజనులు. తత్త్వం తెలియని వారి వ్యాఖ్యల గుఱించి జంకవద్దు! మీలో శివత్వాన్ని చూడనప్పడు ప్రక్కవాడిలో ఎలా చూడగలరు?

* * *

ఇవి ఈ ముదనష్టపు మాడెష్టీ తెచ్చిన చిక్కులు. ఒకటా రెండా!

Monday, November 16, 2009

గూదరికం

నేను చూడ్డానికి నా వయస్సు కంటే చాలా చిన్నగా అనిపిస్తానఁట. అంటే చిన్నగా చిన్నగా కాదు, (Not small small కి తెలుఁగు అనువాదం) వయస్సులో చిన్నగా, మన అసలు ఒడ్డూ పొడుగూ కాస్తే ఎక్కువే.

నాలుగేళ్ళ క్రితం అమెరికాలో పీజీ (వాళ్ళ బాషలో వుత్త జీ) చేస్తున్నప్పుడు అందరూ అడిగేవారు నువ్వు ఎన్నో యేఁడు అని (అంటే యూజీలో ఎన్నోయేఁడని వాళ్ళ ఉద్ధేశం). ఒక నాడు యమరీ విశ్వవిద్యాలయంలో ఏదో ఆటపాటలకు వెళ్ళితే, అక్కడ నా నాట్య చాతుర్యం చూసిన ఒక కొత్త దేశీ విద్యార్థి, ముందు "నువ్వు మొదటి యేఁడా" అని అడిగాడు. అప్పటికే నాలుగేళ్ళు అయిపోయి, రెండేళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన నాకు లోలో కాస్త ఆనందం వేసినా, పైకి ఆశ్చర్యం నటిస్తూ, ఛీ కాదు అన్నాను. అవును నువ్వు స్వింగు నేర్చుకున్నవాడిలా కనబడుతున్నావు కాబట్టి రెండో యేఁడు అయివుంటావు అన్నాడు. వాడు అప్పడే అమెరికా వచ్చిన మొదటి యేఁడు విద్యార్థి. నేనౌనన్నానో కాదన్నానో గుర్తులేదు కానీ, మనల్ని జనాలు గూదవాడిగా పరిగణిస్తున్నారని నాకు తెలిసింది. ఇది అనుభవం చాలా సార్లు జరిగింది. ప్రత్యేకించి జంటనృత్యశాలల్లో.

అప్పటిలో నా సహవాసి కూడా అనేవాఁడు, మాఁవా నువ్వు ఇఱవైనాలుగేళ్ళ వాడిలా వుండవు, గూదవాడిలానే వుంటావు, కానీ.. (ఈ కానీ చాలా ముఖ్యమైన కానీ) .. నువ్వు ఫిలాసఫీ మొదలు పెట్టినప్పుడు మాత్రం చాలా చాలా పెద్ద వాడిలా మాట్లాడతావు అని. అప్పుడు కూడా నాకు కాస్త సంతోషం వేసింది కానీ, అది త్వరలోనే బాధగా మారింది. ఒక ప్రక్కనేమో గూడవాడిలా ఆటాపాటా చూసుకోవాలని వుండేది. ఇంకోప్రక్క ప్రంపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే తపన. తెలుసుకున్న కొద్దీ పెరిగే బాధ. ఏసు ప్రభువు బైబిలిలో చెప్పినట్టుగా , ఎంత జ్ఞానం పెంచుకున్నవాడికి అంత దుఃఖమఁట. ఇది జరిగి మూఁడేళ్ళయ్యింది.

కాల చక్రం తిఱగడంతో ఆట వెనక్కి వెళ్ళి బాధ ముందుకొచ్చింది. చాలా చాలా తీవ్రంగా. నా రచనలు కూడా ఇలానే మారాయి. అప్పటిలో తోటరాముడు తరువాత అంతటివాడు అన్నారు బ్లాగ్లోకులు. ఇప్పుడు కత్తి మహేశు తరువాత అంతటి వాడు అంటున్నారు! నా మటుకు నాకు అది ఒక రకంగా మంచి పరిణామమే అనిపించినా, కుమ్మరి పొయ్యలో కాలిన ఉక్కులా ఈ మెటమార్ఫసిస్సు చాలా నొప్పి అనిపించింది.

మొన్న విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాను. పది రోజుల్లో పది మంది నన్ను విద్యార్థి అనుకున్నారు.
వెళ్ళీ వెళ్ళగానే, చేఱడానికి వచ్చాననగానే, ఎంటెక్కా బీటెక్కా అని అడిగారు. బీటెక్కు అందామనుకున్నాను కానీ, లేదు లెండి పాకల్టీ అన్నాను. ప్రక్క డిపార్టుమెంటుకు వెళ్ళినప్పుడల్లా, "ఊఁహూఁ మాష్టారుగారి చుట్టానివా? ఎంటెక్కా బీటెక్కా" అని అడిగేవారు. రెండూ చెప్తాను అనే వాడిని. "ఓహో. రెండూ ఎలాగా" అని అడిగేవారు. రెండిటికీ పాఠాలు చెప్పే పాకల్టీ అన్నాను. వారు ఆశ్చర్యపడేవారు. కొన్ని సార్లు చర్చలు కూడా జరిగేవి. ఇతను బ్యాగు వేసుకోవడం వల్ల అనే తీర్మానించారు కొందరు. ఈ కొత్త లెక్చరర్లతో నింతే అనేవారు ఇంకొందరు.

దారుణమైన పరాభవాలు ఎక్కడంటే. మన సూడో-ఫ్యూడలిష్టు దేశంలో.
గ్రంథాలయం దగ్గర. "హలో ఎక్కడికి" అనడిగాడు, "ఇక్కడ కంప్యూటర్లు వున్నాయా? జర్నల్లు ఎక్కడ వున్నాయి?" అని సమాచారం అడుగుతుంటే, చెప్పి, "ఎంటెక్కా బీటెక్కా" అని అడిగాడు. నేను పాకల్టీ అన్నాను. తోక తొక్కిన తాచులా లేచి నిలబడ్డాడు గ్రంథాలయఁపు అటెండరు. అవునా అండీ మీరా అండీ ఎ డీప్రార్టుమెంటండీ పలానా సబ్జెక్టుకు ఏం పుస్తకమైతే బాగుంటుందండి. అని నానా వినయతా ప్రదర్శించి తప్పును సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తుంటే, ఫ్యూడలిష్టు అవశేషభావాలు చేస్తున్న తాండవాన్ని చూసి అనందించాను నేను.

ఇక క్యాంటీనులోనైతే, మొదటి రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు.
రెండవ రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు. లాభం లేదని నేను కోపం నటించాను.
మూడవ రోజు.. హలో సార్ రండి. బాగున్నారా. ఎం తీసుకుంటారు?

కొందరైతే నన్ను ర్యాగింగు చేయడానికి కూడా చూశారు. ఏటీయంలో లోపలికి రాకూడదని గుర్తుచేసినందుకు ఇంకొకఁడు గొడవ కూడా పెట్టుకున్నాడు.

ఇక కన్నడ దేశంలో ఓదిత్తిద్దారా, ఓదిత్తిద్దారా, ఏను ఓదిత్తాయిద్దారె? అని తెలుఁగు దేశంలో చదువుతున్నరా చదువుతున్నారా ఏం చదువుతున్నారు? అని అడిగేవారు. కొన్ని సార్లు ఎంటెక్కు అనే వాణి, ఎందుకొచ్చిందిలే అని. లేదంటే, ఎం చేస్తున్నావు. పురుషుఁడు కాళీగా వుండకూడదు అని క్లాసు పీకుతారు. తత్త్వం తెలియని దద్దమ్మలు.


మొన్న హైదరాబాదులో,
భక్తి టీవీ వారింటికి వెళ్ళాను, నరసింహారావుగారి ఆముక్తమాల్యద దొరుకుతుందేమోనని, వెళ్ళాను. కాసేపు కూర్చోబెట్టాక ఒకావిడ వచ్చింది. ఇంచు మించు నా వయస్సేవుంటుంది. తెలుఁగులో యం.యే చేసి భక్తి టీవీలో పనిచేస్తున్నట్టుంది. అదృష్టవంతురాలు, యమ్మేకింకా ఆశ మిగిలివుంది అనుకున్నాను.
ఆముక్తమాల్యద 50 డీవీడీలు - 4వేలు
పాండరంగమాహాత్మ్యము 40 డీవీడీలు - 3 వేలు
కాళహస్తీశ్వర మాహాత్మ్యము 20 డీవీడీలు - రెండు వేలు
అని ఏవో రేట్లు చెప్పింది.
నా కోసమే అంటే కొంటరా అని అడుగుతుంది,అందమైన అమ్మయి అందునా యమ్మేచేసినావిడ ముందు పరువు నష్టం ఎందుకని చెప్పి, నా మిత్రులు అమెరికాలో వుంటారు వాళ్ళకి భక్తి టీవీరాదుగా వారి కోసం అడిగి తెలుసుకుంటున్నాను అని చెప్పాను. లోలోపల ఇంతిలా ఐతే వాళ్ళు సైతం కొనలేరేమోననిపించింది. నూటపది డీవీడీలకు 200డాలర్లు అంటే పర్వాలేదేమో.
ఇంకేమున్నాయి మీ దగ్గర అని అడిగాను, (మన స్థాయిలో ఏవైనా వుంటాయేమోనని) ఆవిడ, భక్తి టీవీలో కృష్ణుడి పాటలు వస్తాయి అవి ఒక డీవీడి ఐదు వందలు అన్నది. కృష్ణుడి మీదా? ఎప్పుడు వస్తాయి? అని అడిగాను.
మీరు భక్తి టీవీ చూస్తారా? అంది.
చూస్తాను.
అంటే మీరు చూస్తారా భక్తి టీవి.?
చూడకే రోజూ చూస్తాం.
అంటే 'మీరు' చూస్తారా రోజూ?
ఓహ్ అర్థమయ్యింది , యమ్టీవీ చూడవలసిన వయస్సులో భక్త టీవీ ఏంటని, భక్తి టీవి లో పనిచేసేవారికే అనిపిస్తే, మన సంస్కృతి గట్టెక్కినట్టే అనుకున్నా.

ఇది బయటి ప్రపంచం.
బ్లాగ్లోకంలో.
నేను నవతరంగంలో వ్రాసిన వ్యాఖ్యకు ప్రతిగా ఒకతను. ఈ పెద్దవాళ్ళకు నేటి యువత భావాలు అర్థంకాదు. అనవసరంగా వారి మీద ఆడిపోసుకుంటారు అన్నాడో పెద్దమనిషి. పేరులో ఫ్యాషనబుల్ గా కుమార్ పెట్టుకున్న అసలు పెద్దవాళ్ళ కంటే నా పేరులో రావు వుండడం నన్ను పెద్దవాణ్ణి చేసిందనుకుంట.

భక్తి టీవీ అనుభవం తరువాతి రోజు ఇంకో చోటికి వెళ్లాను, అక్కడొక బ్లాగరుని కలవడానికి. బ్లాగరుతోబాటు ఆయన యేజెంటు కూడా వుంటారు అక్కడ. ఈవిడా బ్లాగరే, ప్రస్తుతానికి మూసేసినట్టున్నారు కానీ నేను, తెరుస్తారని మాట తీసుకొనివచ్చాను. ఈవిడ కూడా రాకేశ్వర రావు అంటే చాలా పెద్ద వారయ్యుంటారనుకున్నానండీ. అంది. అంతే నండీ పేరు చూసి పెద్దాయన అనుకుంటారు అన్నాను. లేదండి, మీరు వ్రాసేదానిని బట్టి నేను అలా అనుకున్నాను అంది.

హారి దేఁవుఁడా ఇదేం చింపుడారా బాబూ. ఒక ప్రక్క శ్రీశ్రీ బాధ ఇంకో ప్రక్క Joie de vivre. జరాసంధుడిలా వుంది పరిస్థితి.

ఈ బ్లాగు చదవడానికి కన్నడ నుండి ప్రెంచి వఱకూ పలు భాషలు రావలసిరావడానికి చింతిస్తున్నాము. కానీ కమ్ముల శేఖరాని డాలర్ డ్రీమ్స్ లా మీకు వర్తిట్ అని అనిపిస్తుందని.

Thursday, November 12, 2009

మేరీ మాతా వందనం

తెలుఁగు వారి ఆత్మాభిమానాన్ని (లేదా దాని లేమిని), వారి నిజాయితీని(లేదా దాని లేమిని) బయటపెట్టిన ఓ మేరీ మాతా వందనం.

అసలెవరీ మేరీ మాత?
స్కూల్ టీచరా? క్షమించాలి బడిపంతులా?
లెక్కలు చెబుతుందా? ఇంకేమైనా చెబుతుందా?
క్రైస్తవురాలా? మాలా? మాదిగా? మఱింకేమైనానా?
తెలుఁగింటామా? తెలుఁగు ద్వేషా?
ఆంగ్లింటామా? ఆంగ్లమసలు వచ్చా?
క్రూరురాలా? క్రమశిక్షణాపరురాలా?
క్రమశిక్షణాపరాయణురాలా?
అమాయకురాలా? దోషా?
బలిసిన బడిపంతులా? లేక, బతకలేక బడిపంతులా?
లేదా ప్రలోభమే మూలమైన ఈ బృహద్యంత్రంలో ఒక మఱ మాత్రమేనా?
తాము చేసే తప్పుకు తమను తాము నిందించుకోలేక, జాతి జాతి మొత్తమే వెదుక్కున ఒక బలిపశువా?
ఇలాంటి మేరీలను బ్రతకనియ్యాలా లేదా బలివ్వాలా?

* * *

అసలు ఈవిడ కొత్తగా చేసినదేఁవిటి? ఏఁవిటి ఈవిడ చేసిన తప్పు?
ఆంగ్లమాధ్యం బడిలో ఆంగ్లం మాట్లాడాలని చెప్పడమా?
మాతృభాషని అవమానించడమా?
క్రూరంగా ప్రవర్తించి వేయరాని శిక్ష పిల్లలకు వేయడమా?
లేదా పిల్లల తల్లిదండ్రుల ఆశయాలను ప్రాణం కంటే ఎక్కువగా పరిగణించడమా?

మెడలో పలకలు అనాదిగా ఈ నాట ఈ ప్రజ తగిలిస్తూవస్తున్నదే, తొలుత పశువుల మెడలలో. గత ఇఱవయ్యేండ్లగా పిల్లల మెడలలో. పిల్లల ఆత్మలకు శారీరికంగా మానసికంగా గొలుసులు అనాదిగా వేసిన కుటుంబ వ్యవస్థ సృష్టించిన బడిలో ఉద్యోగం చేయడమా ఈమె తప్పు? దానికి సంత జోసపు పేరుండడమా?

తెలుఁగులో మాట్లాడినందుకు దండించడమా ఈమె తప్పు?
తెలుఁగు బళ్ళు కాదనుకొని, ఆంగ్ల మాధ్యమం బళ్ళలో వేసి, అందులో పిల్లలను చేర్చి అందులో వారు నేర్చిన పరభాషా ప్రావీణ్యతని చూసి మురిసిపోయే తల్లిదండ్రులున్న రాష్ట్రాన ఏఁవిటి ఈవిడ తప్పు?
“ఉరేయ్ అసలు వాళ్ళ స్కూలులో తెలుఁగు మాట్లాడనీయ్యరులా, ఒక స్టిక్కువుంటుంది, అది ఎవరు తెలుఁగులో మాట్లాడితే వాడి చేతిలోకి వెళుతుందన్నమట.. అడిగో మావాడు.. ఓయ్ బేబీ యువ్వు కమ్ము హియరు.. ఓయ్ యువ్వోల్నీ అయామ్ టెల్లింగ్ నో...”

* * *

అవును ఈవిడ తప్పుచేసింది.
కార్తీక సోమవారం పౌర్ణమి వచ్చి మహాపవిత్రతను తెచ్చిపెట్టినట్టు.
ఈమె మెడలో పలకలను తగిలించి, దానికి కారణంగా తెలుఁగు మాట్లాడడం చూపించడం మహాపాపత్వం తెచ్చిపెట్టింది. అందునా ఉదయానే కలుషిత ప్రపంచంయొక్క మలిన వాసనలను పీల్చడానికి ఎంతో ఆత్రుతగా పత్రికలు తెఱిచే ప్రజలకై, ఆ మలినాన్ని సేకరించి సంపాదకీయమొనర్చి వారికందించి పొట్టగడుపుకునే ధన్యజీవుల కంట పడడము ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ఇంతకంటే పెద్ద తప్పు ఈమె సంత జోసపు పాఠశాలలో పనిచేయడం. దాని బదులు ఎమ్మెల్లే పెద్దయ్య రెడ్డినాయుడు గారి బావమఱిది నడిపే మై టెక్నో టాలెంట్ శ్రీ సిల్వర్ జూనియర్ ఛాంపియన్ యనర్జీ స్కూల్ లో పనిచేయకపోవడం ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ముప్పై వార్తా స్రవంతులను ఆదరించి వాటి రొచ్చు నెత్తిన గుప్పించుకునే రాష్ట్రంలో ఇంకా వీరిని కంపించేంతట పని చేసావంటే నువ్వు సామాన్యురాలివికావు.

* * *

ఈ ప్రలోభ జాతికి తమ తప్పును ఇంత అమాయకంగా చూపించేయడం ఈమె చేసిన తప్పు!

ఇంటర్ మీడీయెట్ హాస్టళ్ళలో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు, వీరి వీర్యం నిద్రపోయింది. అప్పుడు రెడ్డినాయుని డబ్బుకీ వాని బావ మబ్యపెట్టుడికీ లొంగిన పత్రికలవాడు నిద్రపోయాడు.
అంతేనా..
ఏఁవీ ఎఱఁగనట్టు మళ్ళీ అదే జూనియర్ ఐఐటి అకాడమీ విత్ యంసెట్ అండ్ ఎఐఇఇఇ కోచింగు అకాడమీలకు తమ పిల్లపశువులను తోలారు పురజనులు.

అయ్యో మొన్నే అదే హాస్టలులో ఒక అబ్బాయి అద్దంలోనుండి దూకి చచ్చిపోయాడుగా..
“అబ్బే మా అబ్బాయి బ్రతికేవున్నాడండీ.’
ఇంటిలో దొరకని అవాజ్యప్రేమకై కుఱ్ఱాళ్ళు అమ్మాయిల వెంట పడి వేదిస్తున్నారు కదండి. కాస్త వారి సక్సెస్ పేరిట వారిపై పెట్టే వత్తిడి తగ్గించవచ్చుకదండీ.
“అబ్బే మా అబ్బాయి మేము చెప్పిన సంబంధమే చేసుకున్నాడండీ, మా కాలనీలో ఎవరమ్మాయినో ఎవడో బాగా వేధించాడు కానీ, మాకు అమ్మాయిలు లేరులెండి బ్రతికిపోయాము”
ఆ రెసిడెంషియల్ పాఠశాలలో చదివిన మావాళ్ళు చాలామంది ఇప్పటికీ తీవ్ర మానసిక వత్తిళ్ళకూ ఇబ్బందులకూ లోనౌతున్నారండి. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు అబ్బట్లేదండీ.
“అబ్బే అక్కడే చదివిన మా అన్నయ్యగారి తోడల్లుడిగారబ్బాయి ఇప్పుడు అమెరికాలో సిస్కో కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడే.
అయినా అలాంటి వాటికి బయపడి , అబ్బాయిని బంగారు గుడ్లు పెట్టే కోడిగా మార్చడాన్ని మానుకుంటామా యేంటి. “
అంటే మీరు బంగారం కోసం కోడినే చంపుతున్నట్టుంటేను.
“వీడెక్కడ దొరికాడండీ, నాయనా నువ్వు ఈడి మాటలు వినకు, వీడు పూర్తిగా చదివేసుకుని ఇలా మట్లాడుతున్నాడు”

* * *

దేఁవుఁడు తమకు ఏటియమ్ముల బదులు రక్తమాంసాల ముద్దను ఇచ్చాడేయని బాధపడిన వీరు, వెంటనే అతని తప్పు సరిదిద్దడానికి ఏర్పరచుకున్న ప్రతిదేఁవుఁడే ఈ విద్యావ్యవస్థ. పిల్లలు లోపలికెళ్ళి బయటకు వచ్చేది కీలు గుఱ్ఱాలు. కనీసం సదుపాయాలు అందించలేని ఈ వాణిజ్య ప్రభువులు , తమ బావమరుదుల స్కూళ్ళ కోసం ప్రజల బళ్ళను గొడ్ల సావిళ్ళ కంటే హీనంగా తయారు చేశారే. ప్రభువుల అండతో యంత్రం పరుగులు తీసిందే.

మనిషన్నవాడెవడూ తమ తమ బిడ్డలను ఇంత ఘోరంగా శిక్షించుకోలేడు. అవునవును. కాబట్టే బడి వుంది.
అక్కడో మూర్ఖుడు విద్యాశిఖామణి, వాడి దృష్టిలో ఉదయం నుండి రాత్రి వఱకూ పిల్లల్ని రుద్దనిదే, వాడి టెల్గులో మాట్లాడితే శిక్షించనిదే వాడికి నిద్రపట్టదు. ఆత్మవంచనకు భయపడి స్వయానా తమ తమ పిల్లల్ని ఇలా దండించుకోలేక, ఆ పనిని ఎంతో డబ్బు కట్టబట్టి, ఆత్మ లేని ఒకడికి అప్పగిస్తారు వీరు.
“ఉరేయ్ మావాడు ఇంటికాడుంటే అస్సలు మాట వింటలేదురా, వీణ్ణి హాస్టలులో వేసేయాలి.”

* * *

తల్లీ మేరీ మాతా,
వీరి గుండెల్లోని విషాన్ని వీరికే ఇలా తొందరపాటులో ఎత్తిచూపడం ఎంత వెఱ్ఱిదనం.

వీరి భాషలో వాలుకి పెయింటు వేస్తారు.
వీరి భాషలో పేడెత్తి ఒళ్లో పెట్టుకుంటారు.
వన్నూ టూఊ త్రీయీ వీరి అంకెలు.
టూ డేస్ కోసారి షాప్ కెళతారు.
వీళ్ళ బేబీస్ థరడు మంతులో ఆడతారు,
ఎయిత్తు మంతులో పాకుతారు,
వన్నియఱ్లో నడుస్తారు.

వీరు గుడ్డుని అప్రిషియోట్ చేస్తారు.
వీరు అప్పుడప్పుడూ వెరయిటీగా చూస్తారు, ప్రవర్తిస్తూంటారు.

వీరు ఒకే దెబ్బతో అటు ఆంగ్లమధర్కి ఇటు తెలుఁగమ్మతల్లికీ నెత్తురు కక్కిస్తారు.

* * *
అయినా నువ్వు చేసిన తప్పు ఏఁవిటి నాకు ఇంకా అర్థం కాలేదు.

I NEVER SPEAK IN TELUGU. అని వారి చేత వ్రాయించి మెళ్ళకు కట్టావు. వీరికి దొరల భాష ఆంగ్లము సరిగా రాదు క్షమించమ్మా. వీరి భాషలో simple present tense అనేది ఎక్కడో నలిగి చచ్చిపోయింది.

దీని అర్థము. నాకు తెలుఁగులో మాట్లాడే అలవాటు లేదు. లేదా నేను తెలుగు గతమున, వార్తమానాన, భవిష్యత్తున మాట్లాడలేదు, మాట్లాడబోను. అని వారికి తెలియదు.

The Sun never rises in the west అని వీరికి చెప్పినా దాని అర్థము, “సూర్యుడు ఇంకెప్పుడూ పశ్చిమాన ఉదయించడు” అని కాదని వీరికి తెలియదు పాపం.

* * *
వీరు like this only. వీరు different different varieties ని try చేస్తూంటారు.

అయినా మేరీ మాతా నువ్వేమీ భయపడకమ్మా నీ భవిష్యత్తుకీ ఏఁ ఢోకా లేదు. ఇప్పుడు కూడా ఎవరో నలుగురు వారి బ్లాగుల్లో నీ మీద దుమ్మెత్తి పోసి, హిట్లు లెక్కేసుకోవడం తప్ప ప్రజానీకం చేసేదేంలేదు.
ఫలానా సంత జోసపు బడిలో తెలుఁగులో స్పీక్ చేసినందుకు ఇంత కఠినంగా శిక్షిస్తారని తెలిసిన ప్రజలు తండోపతండాలుగా మీ బడికి తమ పిల్లల్ని తోలకపోతే వట్టు. నా మాట విని నువ్వే సొంతగా ఒక బడి పెడితే ఎంతో ఆదరణ లభిస్తుంది. ఆత్మలేని అసురులు రాజ్యమేలే కాలాన నీవే తల్లి మహారాణివి. పూర్వం నీ పేరు పెట్టుకొన్నయోకావిడ ఎంతో దయఁజూపించిందఁట. ఇక నీ శ్రమ తప్పిందిగా!

అయినా నేను దేని గుఱించి మాట్లాడుతున్నాను. వార్తా స్రవంతుల వరద రొచ్చులో కొట్టుకుపోయిన వీరి బుఱ్ఱలకి ఇంకా నువ్వెవరో గుర్తుంటేనేగా...

Tuesday, November 03, 2009

Non-duality

A few tunes down the waltz
she will be him.
A few miles down the stream
flow will be calm.

A few degrees up the scale
ice will be water,
A few more up the same
liquid will be air.

Like rivers in the ocean
Like songs in the heart
The same joy manifests in
forms various transient

And...
A few tides down the time
land will be sea.
A few lives down the soul
you will be me.

Sunday, October 11, 2009

నాకూ సముద్రానికీ మధ్యలోఁ


నేను సముద్రపుటంచు మీదఁ కూర్చున్నాను
నాకూ నా సముద్రానికీ మధ్యలో ఏఁవీ లేదు
అదిగో వచ్చేస్తోంది ఒక అల
ఈ అల నా కాళ్ళను తాకుతుంది చూడు

ఇదిగో వచ్చేసింది దగ్గరకంటూ
అఱ్ఱే అడుగు దూరంలో ఆగి వెనక్కిపోయిందే.
పోనీ వచ్చే అల తకుతుంది చూడు
అబ్బే ఇదీ అంగుళం దూరంలోనే ఆగిపోయింది.

ఎందుకో మఱి ఈ సంశయం? పఱికించి చూస్తే,
నాకూ సముద్రానికీ మధ్యన నా బట్టలున్నాయి
అంతేనా?

నేను వేసుకున్న సూటూ బూటూ టయ్యి
నా కార్యాలయంపు పనులున్నాయి
నా యింటి వాళ్ళ ఆకళ్ళు వారి అవసరాలు
నా పరువూ మర్యాదా నా పెద్దరికం
ఇంకా ఇలా ఎన్నేన్నో వున్నాయి

ఏంతో కాలంగా
నేను సముద్రపుటంచునే కూర్చుని వున్నాను
నాకూ ఈ సముద్రానికీ మధ్యన చాలానే వున్నాయి
ఒంటరిగా కూర్చున్న నన్ను పలుకరించ రాబోయి
ఎన్నోసార్లు ఈ సముద్రం వెనక్కు జా౨రుకుంది!

నాకూ సముద్రానికీ మధ్యన
నేఁ దాటలేని నా జీవితఁపు అగాధమూ
అది దాటలేని నా అస్వతంత్రపు కోటా
వున్నాయి.


Sunday, September 06, 2009

మూడంచెల్లో లయగ్రాహి

క్రిత టపాలో లయగ్రాహి పద్య ఛందస్సు పరిచయం చేయడం జరిగింది. అందులో చెప్పినట్లు భ గణాలు తేలికదొరుకుతాయిగాని, భల అనేది కొద్దిగా కష్టమే. ఒక సారి పొద్దు కవిసమ్మెళనానికి ఒకరిద్దఱు సర్వ భగణ కందాలు కూడా వ్రాసారు (అలాంటి వారికి మానిని, వనమయూరి వంటివి బాగా పనికివస్తాయి). భగణాన్ని భల చేయడం అంత కష్టం కాదేమో, విభక్తులను సరిగా వాడుకుంటే చాలు. కి, కు, ని, ల, గ వంటివి చేరిస్తే సరిపోతుంది. ఉదా - పద్యము, పద్యముల.

సమస్య కాస్త రసవత్తరంగా వుండాలంటే, గట్టిదైన ప్రాసాక్షరం ఎంచుకోవడం బాగుంటుంది. మనము జ్ఞ ఎంచుకుందాం. ఇకిప్పుడు మీఱు చేయాల్సిందల్లా..

౧) ఒక excel sheet తీసుకొని అందులో గళ్ళు గీసుకోండి, ప్రాసాక్షరంగా ఎంచుకున్న 'జ్ఞ'ని ప్రాస పడవలసిన చోటట్లా నింపేయండి. ఆ ప్రాసపడవలసిన డబ్బాల రంగు కూడా మార్చు కోవచ్చు (ఇక్కడ లేతనీలం). ఆపై గురువు పడాల్సిన చోట్లల్లా డబ్బా రంగు మార్చండి. (ఇక్కడ పసుపు).



౨) తరువాత బ్రౌణ్యం తెఱచి జ్ఞ కోసం వెదకగా వచ్చిన వాడదగ్గ పదాలన్నీ క్రింద చిట్టాగా వ్రాసుకోండి. జ్ఞా జ్ఞే అని దీర్ఘం వున్న జ్ఞలు పనికిరావుసుమా, కాబట్టి జ్ఞానం, జిజ్ఞాస వంటివి వదిలివేయండి. ప్రజ్ఞ, ఆజ్ఞ, అనుజ్ఞ, అవజ్ఞ, అజ్ఞ, రసజ్ఞ, మొదలైనవి.

౩) ఇంకా నానాయాతనా పడి పెట్టెని నింపండిలా..


లయగ్రాహి
"ప్రజ్ఞునకు వచ్చును, రసజ్ఞమగు పద్యమది - ఆజ్ఞ పలుకంగనె! మఱజ్ఞునకు రాదే
యజ్ఞములచే"ననుట, అజ్ఞతగుఁ! బ్రహ్మభవ - రాజ్ఞియగు భారతికి విజ్ఞపము చేయన్
ప్రజ్ఞుడవు నీవయి, మనోజ్ఞమగు పద్యమన-నుజ్ఞముగ వచ్చును! కృతజ్ఞతతొ విద్యా
రాజ్ఞికి సుపద్యఁపు ప్రతిజ్ఞఁగొని సాధనను యజ్ఞమును బూని కవితజ్ఞుడవు గావోయ్.

(విన్నపమునకు తత్భవము విజ్ఞపము వాడడం జరిగింది, ఆజ్ఞ = అనుజ్ఞ x అననుజ్ఞ).

కూల్ కదా.

Saturday, September 05, 2009

లల్లలల లల్లలల లయగ్రాహి

భ జ స న భ జ స న భ య ఛందస్సు గల వృత్తము/ఉద్ధురమాల లయగ్రాహి. భజసనభజసనభయ అంటే తెలియటలేదు గానీ, దీని ఛందస్సు చాలా తేలిక. UIII అని ఏడు సార్లు వచ్చి, చివఱిగా UU అని వస్తుంది. అంటే..

గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :-
లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా

ఒక గురువు నాలుగు లఘువులు వస్తూండాలి. ఇక ఇందులో యతి వుండదు. ప్రాసయతి మాత్రం వుంటుంది - పై క్రమములో i వున్న చోట, అంటే పాదానికి నాలుగు సార్లు ! సీసంలోలా కాకుండా ఇందులో ఆ నాలుగు సార్లూ ఒకే ప్రాస రావాలి. నాలుగు పాదాల్లోనూ ఒకే ప్రాస వుండాలి! కాబట్టి మీరు ప్రాసగా ఎంచుకున్న పదబంధానికి మీ దగ్గర కనీసం పదహారు ఉచిత ప్రయోగాలు వుండకపోతే, పద్యము వ్రాసే పనిని ఆ వాగమశాసనుడికి వదిలివేసుకోవాలి.


మహాభారతం ఆది పర్వములో నన్నయ్యభట్టు వసంత వర్ణనకి లయగ్రాహి వృత్తాని దివ్యంగా వాడారు అని నేనడం, సీమకోతి హనుమంతునికి సిపారసు ఇవ్వడంలాగుంటుంది. క్రిత వారం గరికిపాటి నరసింహారావుగారు, భక్తి దూరదర్శన స్రవంతిలో వసంత వర్ణనకి సంబంధించిన ఈ రెండు లయగ్రాహి పద్యాలను చాలా చక్కగా వినిపించి, అంత కన్నా చక్కగా వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, "నన్నయ్య వ్రాసిన ఈ పద్యాలు వినడానికి, వాటిని నేను మీకు వివరించడానికి మీరెంతో అదృష్టవంతులు". మీరెలాగూ వినలేకపోయారు, కనీసం చదువుకొని ఆనందించండి.

లయగ్రాహి

గణములు:- భజసన భజసన భయ
గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :- లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా
సోపానరేఖాచిత్రం :-

లయగ్రాహి.
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా

లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్


లయగ్రాహి
చందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ

కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్

తెలుఁగులో మీకు భ గణాలు చాలా చాలా తేలిక గా దొరుకుతాయి, కాబట్టి సీసపద్యాలు ఇతర గీత పద్యాలు చాలా తేలికగా వ్రాయవచ్చుఁ గానీ "భల" పదేపదే రావడం మాత్రం కష్టమే. పైపెచ్చు పదహారు సార్లు వాడవలసిన అదే ప్రాసాక్షరం.

త.క. ఈ పద్యాలను మా పెద్దమ్మ దగ్గరవున్న ఆదిపర్వం పుస్తకంలోనుండి ఎక్కించాను. ఆమె ౭౦లలో కొన్నప్పుడు దాని విలువ నాలుగు రూపాయిలు. నిన్న రాజమండ్రిలో వెదికితే, మా రాజమండ్రివాడు అని చెప్పుకునే నన్నయ్య గారి మహాభారతం లభించలేదు!!!

ఇంకా త.క...
పై టపా వ్రాసిన పిదపఁ అచ్చువేసేమునుపు నేను బెజ౨వాడ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నన్నయ్య గారి ఆదిపర్వం దొరకలేదు. ఇక విశాలాంధ్ర, ఎమెస్కో, నవోదయ, ప్రజాశక్తి , వీజియస్ వంటి వాటిలో నన్నయ్యగారి ఆదిపర్వం, లేదా కవిత్రయం భారతం దొరకక పోవడం దురదృష్టకరం. వారు నన్ను తెలుగు అకాడమీనో తెలుగు విశ్వవిద్యాలయాన్నో ఆశ్రయించమన్నారు.

ఎవరో అమెరికన్ అమ్మాయి సలహా మేరకు ఎమెస్కోలో కళాపూర్ణోదయం కొన్నాను. నేను చదివాను రాకేశ్వరా నువ్వు చదవలేదా తెలుఁగువాఁడివై యుండి అని అడిగేసరికి, అన్నగారి మాటలువిన్నవాడిలా ఆత్మగౌరవం తన్నుకొచ్చి పుస్తకం కొన్నాను. అసలైతే వాటిని రెండు భాగాలుగా ప్రచురించారు, ఎందుకో ఆ దేఁవుఁడికే తెలియాలి, ఒక్కొక్కటీ యాభై రూపాయలు. త్వరలో దాన్ని వంద చేసేస్తున్నాం మీరు అదృష్టవంతులు ఇదే ఆఖరి కాపీ అన్నారు ఎమెస్కో వారు. చూడబోతే అది ప్రక్కనే సభ్యులకు పది శాతం తగ్గింపు ఇచ్చే విశాలాంధ్రలో వుంది, తగ్గింపు ఇవ్వని ప్రజాశక్తి వారి దగ్గర కూడా వుంది.

ఇంతకీ పుస్తకం తిరగేస్తే ఒక్క ముక్క అర్థం కాలేదు. "చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము ..." అని ఎత్తుకున్నాడు పింగళి సూరన్న. ఇలాంటి పద్యాలు చదివి అర్థంచేసుకున్న ఆ తెల్లపిల్లమీద ఒక్క తడవ గౌరవం పదింతలయ్యింది. ఆ విషయం ప్రక్కన పెడితే పై పద్య నడక ఈ మధ్యనే ఎక్కడో విన్నట్టుందే అనిపించింది. లాలలల లాలలల లాలలల లాలలల .. లలలలల లాలలల లలలలల లాలలల హమ్మ్.


లయవిభాతి


చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము
- గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం

బొలు పెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
- నెలకొనిన సౌరభముఁ జలువ పసయుం గో

మలతయును గల్గి జగముల మిగులఁ బెంపెసఁగు
- మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం

బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు
- వెలయఁ గల యూ సుకవి పులుకులకు నెంచన్


ఛందస్సు :- నసన నసన నసన నసగ
గణములు:- IiIII UIII IiIII UIII IiIII UIII IiIII UU
నడక :-
లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లల్లా


హోము వర్కు
రేపటి తరగతికల్లా అందరూ తలా ఒక లయగ్రాహి వ్రాసుకురండి. రేపటి తరగతిలో ఆధునిక పరికరాలతో లయగ్రాహిని తేలికగా ఎలా వ్రాయాలో చూద్దాం.

అడియోసమీగోసు.

లంకెలు - కావ్యాలంకారచూడామణి

తరువాయి - మూడంచెల్లో లయగ్రాహి

Wednesday, August 26, 2009

సాయం సమయాన స్నేహితులతోఁ సెx (రానారె టపాకు వ్యాఖ్య)

ఈ టపా రానారె వేసిన "సాయం సమయం సెక్సు" అనే టపాకు వ్యాఖ్య. ముందు అది చదివితేనే గాని మీకీ సెక్సు విషయం అర్థంకాదు. నాకది చదివిన పిదపఁ గూడా అర్థం కాలేదన్నది వేఱే విషయం.

నేనెవరడిగినా వేంటనే సాయం చేస్తూంటాను, కానీ ప్రక్కవారిని అడగడానికి చచ్చేంత మొహవాటం. ఎందుకులే పాపం వారి పని పోగొట్టడం అని నేను భావిస్తూంటాను. కానీ తరువాత ఫలానా వ్యక్తి సాయం చేస్తానన్నాడే నేను వద్దన్నానే, ఇప్పుడు చచ్చేంత చావొచ్చిందే అనుకుంటాను. ఇది చాలా తప్పుడు పద్ధతి.

చందమామ కథ (A)
నా ఇంజనీరింగు రోజుల్లో నా గది పై కప్పు పెచ్చులూడి అవి అచ్చులచ్చులుగా రాలడం మొదలయ్యింది. నా ప్రక్కగదిలోనే రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి (పేరు స్వల్పంగా మార్చబడినది)) వుండేవాడు. వాడి సాయం కోఱకుండా నేనే ఒకటొకటీ గోధుమరంగు కాగితాలు పెద్దపెద్దవి గది పైగోడకు అంటించడం మొదలు పెట్టాను. మెడకాయ వున్న ఎవడికైనా ఇది ఎంత మెడలో బాధో అర్థమవుతుంది. ఆ మెడకాయ పైన తలకాయ వున్న పలువురికైతే ఇది ఎంత బుఱ్ఱ తక్కువ పనో కూడా అర్థమవుతుంది.

కొంత సేపటకి ఆ రెడ్డిగాడు ఆ ప్రక్క పోతూ నా అవస్థ చూసి, నేను అడగకుండానే వచ్చి నాకు సాయం చేయడం మొదలు పెట్టాడు. మావాడు చాలా మంచి వాడు అడగకుండానే సాయం చేస్తాడు. కానీ వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రం మనమేదో వాడి పాలేళ్ళమన్నట్టు తోడుకొనిపోతాడు. మొత్తానికి నిమిషాలలో నా గది పైకప్పు పూర్తిగా కాగితాలతో అతికించబడ్డది.

నా గదిలో పెచ్చులు రాలుతున్నాయంటే, నా సరాసరి ప్రక్కగదిలో పెచ్చులు రాలే అవకాశాలు, కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం ౯౪.౩౨ శాతం. అలా కొన్ని రోజుల గడిచాక, వాడి గది పైకప్పుకే గాక, ఐదు గోడలకూ సరిపడా కాగితాలు తెచ్చాడు మావాడు. గోడలు కూడా పెచ్చులూడేవి పరశురామక్షేత్ర వర్షానికి! మేమిద్దరం కలసి ఐదు గోడలకీ చకచకా కాగితాలు అంటించి తీర్చిదిద్దాము.

ఆ తరువాత నేను నా మిగిలిన నాలుగు గోడలకీ కాగితాలు తెచ్చాను. అప్పుడు మేమిద్దరం ఇంకో ఐదు నిమిషాల్లో వాటిని అంటించాము. ఇక పట్టభద్రులమయిన తరువాత మేమిద్దరం ఒక కంపెనీ కూడా పెట్టాము, దాని పేరే గూగుల్. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలలోనే ఒకటి. కాబట్టి ఎప్పుడూ కలసికట్టుగా సమిష్టిగా పనిచేయాలి. అని మీరు ముందుగానే తదుపఱి కథని వూహించివుంటారు. అలా జరిగితే అదొక మాంచి చందమామ కథ అయ్యేది. "మిత్రులు ఒకరికొకరి సాయం వీలయినంత తీసుకోవాలి .. సెక్సు లాగ"అన్న విశిష్ట నీతి వుండేదాకథలో.

కానీ నిజజీవితంలో అలా జరగదూ జరగలేదూ, ఎందుకంటే అంతకు మునుపే నేను ఎన్నో అవస్థలు పడి నా మిగిలిన నాలుగు గోడలకీ కాగితాలు ఒంటరిగా అంటించేసుకోవడం అయిపోయింది. అప్పుడు మావాడు ఆ ప్రక్కగా రాలేదు పోలేదు, కాబట్టి వాడు చూడలేదు.

చివఱకు నా గది కంటే ఎంతో అందంగా వున్న ఆ రెడ్డిగాడి గది చూసినప్పుడు నాకు తటస్థించింది కథలోని నీతి "ఈ నాయిడ్రెడ్ల నెప్పుడూ నమ్మకూడదు" మనకి ఒక సాయం చేసి వాళ్ళు మనచేత ఐదు గోడలకు కాగితాలు అంటించుకుంటారని". కాబట్టి మనము కూడా మన మిత్రులనుండి వీలైనంత సెక్స్.. యఱ్.. సాయం తీసుకోవాలని అర్థమయ్యింది.

అది కథ.

త.క -
చెప్పానా శీర్షిక మీకు అర్థంకాదని. పైపెచ్చు ఈ శీర్షిక వల్ల చందమామ వారు నా ఈ కథని నిరాకరిస్తారని భయంగా వుంది.
కాబట్టి నా గాద పిల్లల వఱకూ చేఱక, ఈ నాయిడ్రెడ్ల చేతుల్లో ఇలానే ఇంకెంతో మంది మోసపోతూవుండాల్సిందే (నేను చెప్పేది టపా శీర్షికల విషయాల్లో కాదు). అన్నట్టు మా మిత్రుడి అసలు పేరు మార్కు రెడ్డి, ఇది యదార్ధ గాద.

Sunday, June 21, 2009

మన సంస్కృతి

మనలో చాలా మంది అబ్బో తెలుగు చచ్చిపోతుంది. బాబోయ్ తెలుగు చచ్చిపోతుంది. లబో దిబో లబో దిబో అంటూంటారు. అలాంటి వారికి నాకో ప్రశ్న మీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో ఎందుకు వేశారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయేది పూర్తిగా వేఱే అంశం గుఱించి. అది చెప్పిన తఱువాత మీరు వేంటనే మీ పిల్లల బడికి వెళ్ళి వాళ్ళ ప్రినిసిపాలునితో "మా కిడ్సు ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ లో చదవడం మాకు లైకింగా లేదు. ఇప్పుడే డిస్‌కణ్టిఞూ చేసి, ఒక గుడ్ టెల్గు మీడియమ్ స్కూలులో చేరుస్తున్నాము" అని అంటారు, మాది పూచి.

ఇక మన 'మన సంస్కృతి' గుఱించి
నేనీ మధ్యన పూర్తి స్థాయి తెలుఁగు గ్రామజీవనావిధానవిశ్లేషకునిగా మారాను. అందులో నాకు దొరికిన ఒక మచ్చుతునక మన అనే మన భాషకు ప్రత్యేకమైన మాట. మీ మా లతో బాటుఁ మన అనేది మన భాషకు ప్రత్యేకం. మనలా (బ్లాగర్లలా) ఆంగ్ల భాష నేర్చి తెలుఁగు నుడికారం మీద పట్టు కోల్పోయిన వారు కాకుండా, గ్రామాల్లో అచ్చంగా తెలుఁగు మాత్రమే ఎఱిఁగిన వారు వుంటారుగా, వాళ్ళ మాట తీఱులో చాలా చమత్కారాలుంటాయి, అందులో మన అనేది ముఖ్యమైనది.

ఉదా ౧
మా చిన్నాన్న పొలం వెళ్ళాను ఒక సారి, పంచుకున్నాక అదే మొదటి సారు అనుకోవచ్చు. ఆయన "ఈ పొలం మనకు వచ్చిందిరా" అన్నడు. దానర్ధం ఆయనిదనా, మా నాన్నదనా? ఆయనిదనే ఎందుకంటే, వేంటనే "ఆ కంచవతలిది మీ నాన్న కొచ్చింది" అనన్నాడు కాబట్టి.

ఆస్తి హక్కులు అనేది విశ్వమానవ చరిత్రలోనే అతి ముఖ్యమైన కట్టుబాట్లలో ఒకటి అని ఎంబియే చదివిన మీ మిత్రుడు అనవచ్చు. అప్పుడే అర్ధమవుతుంది మనము ఎంబియే చదవకూడదని, చదివినా మన పిల్లల్లి చేతఁ జదివించకూడదని, చదివిన వారి జట్టు కట్టకూడదని. మనలో కొందఱు ఇప్పటికే ఆ తప్పు చేసివుంటారు, వారికి నా సహానుభూతి. ఆస్తి హక్కులు అనేది మనము గతిలేక గొడవలు తగ్గించుకోవడానికి ఏర్పఱచుకున్నవి. అనాదర్శ ప్రపంచంలో అదోక ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. కాబట్టి ఆదర్శాన్ని కోఱుకునే ఏ మనిషైనా ఆ అంశాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడు. అందుకే మనకుంది మన అనే పదం.

ఉదా ౨
మా అన్నయ్య (పెదమామ్మ మనఁవఁడు) నాతో అన్నాడు "ఎప్పుడైనా రారా మన పొలం, ఆ పోతారం రోడ్డు వుందిగా అక్కడే, బాబాయి పొలం దాటిన తరువాత". ఆయని పొలం ఆయనిదే, మాది మాదే, కానీ ఇలాంటి సందర్భాలలోఁ, మా అనే పదం పైన చెప్పుకున్న కారణాల వలన, అంత సంస్కారవంతమైన పదము కాదు.

కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాల్సివుంటుంది.
మనకు ఎన్ని సాల్తీలు వున్నాయేంటి?
ఎనభై, గిత్తలు ఇంకో ఇఱవై వుంటాయి. జొన్న చే౨ను ప్రక్కన కొబ్బిరి తోట వుందిగా అందులో జాడేసి వీటిని కూడా అక్కడే కట్టేస్తాం.
ఊఁహూఁ.. కొబ్బిరి తోట అంటే, మా నాన్న కొబ్బిరి తోట ఉంది దాని ప్రక్కనేన.
అవును మీ నాన్నగారి చేను ప్రక్కనే.

అలా మా, మీ అనే పదాలు వీలైనంత తక్కు వాడి మాట్లాడాలి. ఒక వేళ ఎవరైనా మీ అని వాడినా, మనము మాత్రం మన అనే వాడాలి.

ఉదా ౩
చిన్నాన్న బిడ్డడు "అన్నయ్య కారు నేర్పవా"
మనం "సరే వెళదాం పద"
వాడు "ఉండు నాన్నకు చెప్పేసి వస్తాను"
మనం "పర్లేదు రా మన కారులో వెళ్తున్నాంగా నాన్నని అడగక్కరలేదు. నాన్న కారులో వెళ్తే చెప్పాలిగాని మనకారులో వెళ్తే చెప్పనక్కరలేదు"

అదన్నమట మనకు ప్రత్యేకమైన మన సంస్కృతి. ఇది ఒక పళాన అలవాటు అయ్యేది కాదు. దీనికి ఒక రకమైన ఆలోచనా తీరు అవసరం. డబ్బులు, ఆస్తిపాస్తుల్లో ఏముంది మన జనాలు మనకు ముఖ్యంగాని అనే ధోరణిలోఁ వుండాలి. బాగా అలవాటు చేసుకుంటే అవతలివారికి మన గుఱించి, చదువుకంటే సంస్కరముందని తెలిపే మంచి అలవాటు యిది.

మా సంస్కృతి
మా అమ్మ, మా నాన్న అంటాము మనము తల్లిదండ్రులకు ఒకే బిడ్డ అయినా సరే. అదే వేఱే భాషల్లోనయితే, నా అమ్మ, నా నాన్న అంటారు. ఇది అందఱికీ తెలిసిన విషయమే. ఇక్కడ మఱీఁ మన అమ్మ మన నాన్న అని పరాయివాళ్ళతో అనలేము కాబట్టి, కనీసం మా అనాలి.

దేనినైనా నలుగురితోఁ పంచుకోమని చెప్పే మన సంస్కృతికి అద్దం పట్టే మన భాష మనకు ముద్దు.

రేపు నేను ఒక టపా వేయబోతున్నాను

నా గణినిలోని రాకేశ్వర సంచయం చూస్తూండగా, అందులో ఒక పదో ఇఱవయ్యో అముద్రిత టపాలు చిట్టీయట్ట (నోటుప్యాడు) పత్రులు కనిపించాయి.

శ్రీశ్రీ అముద్రితాలు, చలం అముద్రితాలు అంటే బాగుంటుంది, ఆ మాటకు వస్తే ఓంకార్ అముద్రితాలు అన్నా బాగానేవుంటుంది కానీ రాకేష్ అముద్రితాలు అంటే అస్సలు బాగోదు, దానికి మొదటి కారణం రాకేశ్ అనేది సరైన వాడుక అవడం. రెండవది నా పేరును వాళ్ళు సరిగా వేస్తారో లేదో నమ్మకం లేకపోవడం.

అందుకే నేనే నా అముద్రితాలను త్వరగా అచ్చువేసి, నా పుస్తకం వ్రాయడం ప్రారంభించుదామని నిశ్చయించుకున్నాను. పుస్తకం అంటే అచ్చంగా పుస్తకం కాదు. బ్లాగు టపాల పరంపర (విశృంఖలము) అనమట. కాబట్టి రేపే నా అముద్రితాల నుండి ఒక టపా వేద్దామని నిశ్చయించుకున్నాను. దాని పేరు ""మన" సంస్కృతి".

ఏం భయపడవద్దు. ఇది వేశ్యల గుఱించి కాదు, దూరదర్శని కార్యక్రమాల గుఱించి కాదు, మన చలనచిత్రాల గుఱించి అంత కంటే కాదు. అయినా నేను వేసే టపా పేరు ""మన" సంస్కతి "లేమి"" కాదు. మన సంస్కృతి కలిమి గుఱించినదది.

అన్నట్టు వేశ్యల విషయమై, మొన్న ఎవరితోనో మాట్లాడుతుంటే అంటున్నారు "నేను మీ పెద్ద అభిమానినండి, అంటే మీరు ఏం జెప్పినా ఖఱాఖండిగా చెబుతారు, బ్లాగులో వ్రాసే దాని గుఱించి కాదు, మామూలుగా, అంటే బ్లాగులో ఏదో వ్రాస్తూంటారు, వాటి గుఱించి కాదు, మామూలుగా.." అని. బ్లాగు ద్వారా తప్ప వేఱే పరిచయమే లేదు మాకు. నాకు అప్పుడే అర్ధమయ్యింది ఈయనకు వడనవనితల మీద బొత్తగా కరుణ లేదని. బుద్ధునికి అన్నింటి మీదనా కరుణ వుండేదఁట - అదుగో మళ్ళీ బుద్ధుడికీ వాళ్ళకీ లంకె వేస్తున్నావంటారు ఎందుకొచ్చింది లెండి అసలే బ్లాగ్లోకం వెనకటిలా లేదు. మన అభిమానుల్లో అలాంటి రాములు, మంచి బాలురు, కౌశల్యాదులు ఎక్కువే వున్నారని, వారి కోసం మనల్ని మనం కొంత సంభాళించుకోవాలనీ నిర్ణయించుకోవడం జరిగింది.

సామాజిక వర్గములు, సామాజిక వర్గముల అంతఃసంబంధములు, లైంగిక సామాజిక వర్గములు, లైంగిక సామాజిక వర్గముల అంతఃసంబంధములు, మన దేశంలోని కొన్ని సామాజిక వర్గాలకు తీఱని లైంగిక తృష్ణ, మన దేశంలో కొన్ని ప్రచార మాధ్యములుఁ జూపు లైంగిక మృగతృష్ణ, వాటి సంబంధించిన వివిధ ఇతర అంశాల గుఱించి బ్లాగడం మానేసి; అందుకు బదులుగా వాటిని నా గణినిలో(గణికతోఁ సంబంధంలేదు - అంటే ఇద్దరూ గణిస్తారు ఆ సామీప్యం వుంది కానీ మిగిలిన ఏ సామీప్యమూ లేదు - ఈ యాదృచ్ఛిక సామీప్యతకు ప్రకాశకులు పెక్కు చింతిస్తున్నారు) వాటిని నా గణినిలో పత్రులుగా భద్రపఱచి, వాటిని ఆ మంచి బాలుర తదనంతరం రాకేష్ అముద్రితాలుగా అచ్చువేయించుదామనుకుంటున్నాను.

కొసమెఱుపు
అచ్చువేయించుదామనుకుంటున్నాను = accuvēyiñcudāmanukuṇṭunnānu (ఇఱవై ఏడక్షరాలు)
మనది పలు-అగ్లుటినేటివ్ భాష (poly-agglutinative language)
ఆంగ్లంలో అగ్గ్‌లుటినేటివ్ కి బదులు అగ్లుటినేటివ్ అంటారు. వారిది తలతిక్క భాష (non-geminative language).
ఈ టపాలోని లంకెలు లంకెబిందెలు, రేపటికి బాగా చదివి అర్ధం చేసుకోండి.


అన్నట్టు ట్విట్టరు పేజీ మొదలు పెడదామనుకుంటున్నాను, దనీ మీద మీ కేమైనా సలహాలు వున్నాయా?
ఇన్ని చోట్ల సోది వేస్తున్నావుగా, మళ్ళీ అది కూడానా అంటారా?

Wednesday, May 27, 2009

త్రిశంకు స్వర్గం

ఈ పూటకి నేను మీ పాలిటి విశ్వామిత్రుడను, మీరు నా పాలిటి త్రిశంకు. మీరు మీ భౌతిక శరీరంలో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు. నేనంటాను, "అది కుదరదు నాయనా దానిబదులు ఏ బారుకో పోతే నీ కష్టాలను కొంత సేపు మఱచిపోతావు, రేప్రొద్దుట లేచాకా షరా మామూలే, కాబట్టి అది కూడా పెద్ద లాభం లేదు. అయినా ఇంకా వేఱే మార్గం ఏం లేదు" అంటాను. అయినా మీరు స్వర్గానికి తీసుకెళ్ళవలసిందేనని పంతం పడతారు. నేనిక త్రిశంకు కథ చెప్పి తీరాల్సివస్తుంది.

వెనకటికి మీ పూర్వీకుడు త్రిశంకు కూడా ఇలానే మారాం చేస్తే విశ్వామిత్రుడు (వశిష్టుని మీద వైరుధ్యం కొద్దీ) ఈయననకు స్వర్గానికి తోడ్కొని పోతూండగా, ఇంద్రుడు అలా కుదరదని మారాం చేసేసరికి, విశ్వామిత్రుడు ఇంకో కొత్త స్వర్గాన్ని సృష్టించి, అక్కడో కొత్త ఇంద్రుణ్ణి తయారు చేయబోతే ఇంద్రుడు మళ్ళీ మారాం చేస్తాడు. దేవతల దర్నాలను తట్టుకోలేక మొత్తానికి త్రిశంకు అలా స్వర్గానికీ వెళ్ళలేక, భూమి మీదనా వుండలేక, మధ్యలో వ్రేలాడుతూవుంటాడు. ఆయనకోసం విశ్వామిత్రుడు అక్కడే ఒక స్వర్గాన్ని తయారు చేశాడట. (కథ ఇక్కడ మఱియు ఇక్కడ).

అప్పుడు మీరు. అఱ్ఱె ఇది అచ్చు అమెరికా వెళ్ళిన మా పెదబాబుకొడుకు సత్తిగాడి కథ. వాడు కూడా ఇలానే మధ్యలే వ్రేలాడుతున్నాడు, అక్కడ బ్రతకలేక ఇక్కడికి రాలేక అని అంటారు. నేను అబ్బేకాదు మీ పూర్వీకునికి నిజంగా జరిగిందయ్యా రామనాథా అంటాను. అప్పుడు మీరు అయితే ఏది చూపీ ఆ త్రిశంకు స్వర్గాన్ని అంటారు.

మీ అదృష్టం పండింది.
ఇది జ్యేష్ఠమాసం. సూర్యుడు వృషభంలోనున్నాడు (Taurus). కాబట్టి పొద్దు క్రుంకే సరికి, పశ్చిమాన మిథునం (Gemini), దాని నెత్తిన కర్కాటకం (Cancer), దాని నెత్తిన సింహం (Leo) - ఆ సింహం హింగాలు దగ్గర ..అనానిమిషులు భయపడవద్దు.. శని, సింహం వెనుక కన్యా (Virgo) వుంటాయి, ఆ కన్యకు పిఱుదైన చిత్రా (Spica) నక్షత్రానికి ప్రక్కన దాని సవతి హస్తా (Corvus) వుంటుంది. పొద్దు పూర్తిగా పోయాక ఒక గంట సేపు ఆగితే మీకివన్నీ స్పష్టంగా కనబడే అవకాశం దేవుఁడు కల్పించాడు. కానీ మీరు త్రిశంకువులా పెద్ద స్వర్గానికని బయలుదేరి పెద్ద నగరాలలో చిక్కుకున్నారు కాబట్టి ఆ అవకాశం హైదరాబాదు పుట్టుపాతు మీది బీడి ముక్కలా కాల వ్రాయబడ్డిది.

ఆ అవకాశాన్ని వాడుకుంటున్న కొంత మందికీ హస్తా నక్షత్రయుగళము క్రిందన, అనగా దక్షిణాన చూస్తే (బాగా దక్షిణాన, అంటే ఇంక దక్షిణ దిక్కునకు కొద్దిగా పైన) అక్కడ మీకు కిరస్తవ శిలువ లాగా ఒక నాలుగు నక్షత్రాలు కనబడవచ్చుఁ. మీ వూరి దగ్గర కొబ్బరి చెట్లు వుంటే దక్షిణాన, మీరు మేడో నీళ్ళ స్తంభమో ఎక్కాల్సివుంటుంది. అలా దక్షిణాన హస్తానక్షత్రానికి అచ్చం క్రిందగా కనిపించే ఆ శిలువే త్రిశంకు.


ఇక్కడ ఉత్తరం పైకి దక్షిణం క్రిందకి తూర్పు ఎడమ వైపు. (దక్షిణాముఖంగా నిలబడి ఆకాశానికేసి చూస్తే ఎలా వుంటుందో అలా ఈ బొమ్మ వుంటుంది. అంతే గానీ కుడియడమవలేదు!)సింహరాశి పంచభుజం కనుగోవడం తేలిక. మఱియు చిత్ర, స్వాతి, ఉత్తర రల త్రికోణం కనుగొనడం తేలిక. అలానే దాని క్రింద హస్త చేతి ఆకారాన చతుఃభుజం. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి)

హస్త నుండి బాగా దక్షిణాన చూసినచో త్రిశంకు కనబడవచ్చు. త్రిశంకు కంటే ఆల్పాబేటా సాంచురై తేజోమయమైనవి. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి) (Microsoft World Wide Telescope వారి సౌజన్యంతోఁ)

ఈ త్రిశంకు మఱియు సాంచురై దక్షిణార్ధగోళంలో వున్న వారికి ప్రతి రాత్రీ కనిపించినా, మన ఉత్తరార్ధగోళంలో వున్నవారికి మాత్రం ఇంచు మించుగా పిబ్రవరి నుండి మే వరకూ కనిపించవచ్చు అందులోనూ మీరు భూమధ్యరేఖకు దగ్గరగా వుంటేనే. మీ వూరిలో లైట్లు తక్కువుంటేనే, మీ వూరిలో కరెంటు పోతేనే, మీ వూరికి దక్షిణాన పెద్ద నగరాలు లేకపోతేనే, మీ కంటి చూపు బాగావుంటేనే, అప్పుడు మబ్బు వేయకుంటేనే. అదీను రోజుకు ఇంచు మించు రెండు గంటలు మాత్రమే. ప్రత్తుతానికా రెండు గంటలూ ఎనిమిది గంటల దగ్గర.

నేను ఎప్పటి నుండో దీన్ని చూద్దామని పాగా వేసుక్కూచున్నాను, కానీ చివరకు నిన్న దర్శనమిచ్చింది. ఏప్రేలులోనైతే రాత్రి పదింటికి కనబడుతుందట. నిన్నరాత్రి, హస్తా నక్షత్రం క్రింద శిలువ నెత్తెము, ఎడమకొన కనిపించే సరికి అఱ్ఱె ఇది త్రిశంకు స్వర్గంలా వుందే అని చెప్పి, శిలువ కాలు కుడికొన వెదికితే ఎక్కడ ఏదోవుందనే అనిపించింది. వేంటనే కంప్యుటరు లో చూస్తే అదే! ఇంకే ముంది, వేంటనే కెమరా తెచ్చి అష్టకష్టాలూ పడి, దీనిని తీయడం జరిగింది.
(F3.5, Exposure 30secs.. అవును ముప్పై క్షణాలు!!!). స్టాండు కూడా లేకపోయేసరికి కష్టమయ్యింది. ఇక వచ్చిన బొమ్మ కూడా పెక్కు నల్లగా వుంది. దానిని Histogram Equivalize చేయవలసివచ్చింది Gimpఉనఁ. మీకు అచ్చం ఇలాగా ఇంత స్పష్టంగానూ కనబడుతుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. అన్నట్టు ఆగ్నేయాన ఆ అగ్ని మా వూరి దగ్గర పోలవరం ప్రాజెక్టు తాలూకు కాలువల త్రవ్వకాల పనుల విధ్యుద్కాంతి. ఐనా కనబడడం మన అదృష్టం.

కొబ్బరి చెట్ల మధ్యన శిలువకు ఎడమ ప్రక్కనున్నవి ఆల్పా, బీటా సాంచురై. ఆల్పా సాంచురై సూర్యునికి అతి సమీపానున్న నక్షత్రమని మీకు చిన్నప్పటి గురుతు రావచ్చు. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి)

ఇక ఇది శిలువ ఆకారంలో వుండడం వలన, బ్రేజిల్ ఆస్ట్రేలియా వంటి దక్షిణార్ధ దేశాలలో ఇదంటే మక్కువ, వారు దీనిని వారి జాతీయఝండాపై సైతం పెట్టుకున్నారు. అంతటితో ఆగక, సదన్ క్రాస్ చర్చి అని, అక్కడో కొత్త ఈశ్వరుణ్ణి సైతం సృష్టించారు. ఆస్ట్రేలియపు ఆదివాశి జాతులలో వేఱు వేఱు కథలు సైతం వెలసినవి మన త్రిశంకు కథలా.

మొత్తానికదీ నచ్చత్రం.. దాని బట్టి కత.. దాని బట్టి జాతీయం.
మీరు ఇప్పుడే బయటకు వెళ్ళి త్రిశంకు స్వర్గ దర్శనం చేసుకురండి. ఉత్తరార్ధగోళంలో వుండే మనకు దీని దర్శనం కలుగడం నిజంగా అదృష్టం.
ఈ బ్లాగు చదివే సగటు ౨౦౦ మందిలో,
ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం క్రింద వండే వారు ౧౦౦.
అందులో పల్లెల్లో వుండే వారి సంఖ్య ౧౦
అందులో మంచి కంటి చూపు కలిగిన వారు
అందులో బయటకు వెళ్ళి గమనించు చూచేవారు ౦.౧
అందులో గాలివానా వంటివి లేకపోయిన వారి సంఖ్య ౦.౦౧

ఏదేమైనా వేయడం నా బ్లాగుధర్మం (దేనిమీదనంటేదానిమీదఁ ఏలానంటేనలాఁ మా సిద్ధాంతం)

లంకెలు
దక్షిన శిలువ (ఆంగ్లాన), త్రిశంకు కథ, కథ (ఆంగ్లాన), నక్షత్రాణి, Gimp, Microsoft Worldwide Telescope

ఉంటాను మఱి
నా కోసం నా సతులు మఘ, పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్రా, హస్త, విశాఖానురాధాదులు ఏడి రాకేశ్వరుఁడు, రాడే, కుండీ ప్రక్కన మనకై జలకాలడడే.. అని ఎదురు చూసి, చివరకు నేను వచ్చి స్నానం చేస్తుంటే.....
నన్ను చూసి కిలకిల నవ్వి ఇలా అంటారు
చూడు వీడు, అందమైన వాడు, ఆనందం మనిషైన వాడు,
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎఱ్ఱని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు.. రాకేశ్వరుడు

Friday, May 22, 2009

గాడిద స్వామ్యం

అనగా అనగా ఓ గాడిద
దానికున్న ఆస్తల్లా కాస్త బూడిద

ఐతేనేం, పట్టింది దాని కదృష్టం
ఎన్ని దేవుళ్ళని మోసిందో దాని పృష్టం!

ఉత్సవాల్లో దేవతా విగ్రహాలని మోసింది
ఊరిజనం కైమోడ్పులు తనకేనని భ్రమసింది.

ఇంతమంది భక్తులు తనకుండగా
ఎన్నికలకి నిలబడకపోవటం దండగ

అని తలపోసి నామినేషన్‌ పడేసింది;
ఐతే, ఇక్కడ ఈసప్‌ కథ అడ్డంగా తిరిగేసింది.

గార్దభాన్ని మక్కలిరగ తన్నక పోగా
జనమంతా గాడిదలయారు చిత్రంగా.

గాడిదకి ఓటు వేసి గెలిపించుకున్నారు.
గాడిదస్వామ్యం తమదని నిరూపించుకున్నారు.

- ఇస్మాయిల్ యొక్క "రాత్రి వచ్చిన రహస్యపు వాన" నుండి (ఈమాట వారి సౌజన్యంతోఁ)

Thursday, May 14, 2009

చెవిటి వాని ముందు శంఖం

చెవిటివాని ముందు శంఖం వూదితే, దాన్ని కొఱకడానికి నీ తాతలు దిగిరావాలన్నాట్ట! బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు. అనామిషులూ ముక్కూ మొఖం లేని నెలతక్కువ బడుద్దాయిలు ఎక్కువయ్యారు. ఏ పుంతలోనుండి ఏ చెంబు పట్టుకొని ఎవడు వచ్చి విసర్జించి పోతాడో తెలియకుండా వుంది. అందుకే క్రిందటి టపా తీసేయడమైనది.

త.క- మీ అసౌకర్యార్ధం, భావి తరాలా సమాచారార్ధం ఇక్కడ దాన్ని జత చేస్తున్నాను. దయచేసి చదవద్దు. ఇది భావితరాలకు మాత్రమే.

------------
లంజాకొడుకు అద్వైతం
మీకు టపా శీర్షిక పరుషంగా అనిపించి కోపం వచ్చి, కూడలిజల్లాడాదులధిపతులకు నా బ్లాగును లంకించడం మానేయాలని అభ్యర్ధిస్తే, మీరు బుద్ధుడు కదన్నమట. ఆయనీపాటికే నా బ్లాగుకు రావాలి, వచ్చాడేమోనని ఇలా శీర్షిక పెట్టాను. కానీ పాడు విధి వక్రించింది ఆయన రాలేదు. ఈ విధి ఎప్పుడు వక్రిస్తుందేగానీ ఒక్కసారైనా అవక్రిస్తుందేమో చూద్దాం అనుకుంటే, అబ్బే లాభం లేదు, విధి విధి ఎప్పుడూ వక్రించేవుంటుంది.

మీరు ఏ గౌతమబుద్ధుడో, ఆదిశంకరాచార్యుడో అయితే మీకు కోపం వచ్చేది కాదు. ఎందుకంటే వారికి అద్వైతం ఎఱుక. మనకి ఎఱుక కాదు. అద్వైతం అంటే అందరికీ తెలిసు. ఏముంది, అన్నీ ఒకే పదార్ధం నుండి పుట్టాయి, మళ్ళీ అన్ని ఒకే పదార్ధంలోనికి వెళిపోతాయి. ఈ మాత్రం విషయం మీ బామ్మగారినడిగితే చెబుతుంది, "ఏముందిరా, మట్టిలోంచి పుట్టాం మట్టిలోకే పోతాం". మీ బామ్మగారు ఆమె మాట మీద నిలబడి ఇప్పటికే మట్టిలో కలసిపోయుంటే , ఎనిమిదో తరగతి చదివే మీ మనఁవరాలినడగండి చెబుతుంది, "తాత్‌గరూ, మన సన్ను మూడో జనరేషన్ స్టార్ అంట. అంటే ఇంతకు ముందు ఒక స్టార్ క్రియేట్ అయ్యి, అది డిస్ట్రాయ్ అయ్యి, మళ్ళీ క్రియేట్ అయ్యి... అలా త్రీ టైమ్స్ జరిగి ఇప్పుడు సాలార్ సిస్టమ్ అయితే మనం దాని మీద లివ్ చేస్తున్నామఁట". మీరు లోలోపల మీ మనఁవరాలి ఆంగ్ల చదువులకు ముఱిసిపోతూనే, బయటకు కోపం అభినయిస్తూ, "నువ్వేమయినా చూసొచ్చావా మూఁడు సార్లు జరగడం" అని అడుగుతారు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఒక లక్ష కోట్ల ఏండ్ల క్రితం మీ ప్రస్తుత శరీరంలోని పరమాణువులన్నీ ఏదో ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతూవుండేవని మీరు ఒప్పుకోక తప్పదు.

కాబట్టి, ఒక విషయం తెలియడం తేలికే, అది తెలిసినట్టు ప్రవర్తించడం వేఱే పని. మనందరికీ అద్వైతం తెలిసినా, అది నిత్యం ఎఱింగి అలా నడుచుకోవడం వేఱే. ఉదా- మీకు తెలుసుఁ ప్లాస్టిక్కు ఐదు లక్షల ఏండ్లు భూమ్మీదనలానే శనిలా పడుంటుందని, కానీ పెళ్ళిల్లో రైళ్ళలో వాటిల్లోంచే నీళ్ళు తాగుతాం. కాబట్టి మనకు అద్వైతం తెలిసినా మనల్ని ఎవరైనా లంజాకొడకా అంటే మనకు కోపమే వస్తుంది.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను క్రిత టపాలో ఒక కందం పద్యం వ్రాసాను. నా మొదటి సర్వలఘుకందం. దాంట్లో ఒక బూతు పదం అవసరమైంది. నేను బూతుపదాల్లో నమ్మను. కొందరు "దేవుడు లేడు, ఉంటే ఏడి చూపించి" అన్నట్టు, నేను "బూతుపదం లేదు, వుంటే ఏది చూపించు" అని అడుగే బాపతు. కానీ దేవుణ్ణి చూపమనేవారు కూడా తిరుపతి వెళ్ళివచ్చినట్టు, నేను కూడా క్రిత టపాలో గణికకొడుకులు అనే మాటవాడాల్సివచ్చింది.
కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొఁ
గులుకుచుఁ గదిలె డల గణిక కొడుకులఁ గనుమా
లంజాకొడకా అని ఎందుకు వాడలేదని మీరడగవచ్చు. దానికి రెండు కారణాలు. నేను వ్రాసింది సర్వలఘు కందం. కాబట్టి జా,లం వంటివి వాడకూడదు. అదే తెనాలి రామలింగడు వ్రాసిన గంజాయి తాగి పద్యం లోనయితే ముచ్చటగా వాడుకోవచ్చు.
కం. గంజాయి త్రావి తురకల
సంజాతము చేసికల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
రెండవ కారణం, నేను వ్రాసిన పద్యంలో క,గ,ల,లు అనుప్రాస. గణికకొడుకులు లో క,గ,లలు ఐదు వచ్చాయి. కూల్ కదా.

మొత్తానికి అలా "అల గణికకొడుకులని రాజకీయనాయకులతో పోల్చి చెప్పినందుకు" వారికి క్షమాపణ చెప్పుకోవడం కుదరలేదు క్రిత టపాలోఁ. అందుకే ఇంకో టపా వ్రాయాల్సివచ్చింది. అసలు లంజాకొడుకులు అవడంలో వారి తప్పేముంది? మీ నాన్నగారు ఫలానా కారు సేల్సుమానో, అడ్వర్టైజింగు మేనేజరో, రాజకీయనాయకుడో, బాక్సైటు గనుల గుత్తేదారో, ఇతరత్రా ద్రోహచింతనాత్మక వ్యాపరస్థులో అవడంలో మీ తప్పేముంది. మీరు వారిని కన్నారా, పెంచారా, కేవలం మీ విధి తన అలవాట్లు మానుకోలేక వక్రించడం వల్ల మీరు వారి కడుపున పుట్టారు. లంజతండ్రి అనేది తిట్టుగాని లంజకొడుకు తిట్టుఎలా అవుతుంది?

అయినా మీరు వేశ్యాంగనకు జన్మించారే అనుకుందాం, వారి వృత్తిలో తప్పేముంది. వారు ఎవరినైనా మోసం చేశారా? లేదు. కాయకష్టం పడి సంపాదించారు. కాయకష్టం పడకుండా బోలెడంత సంపాదించే సాఫ్టువేరోళ్ళ కన్నా వీరు ఏమాత్రం హీనులు కారు. శరీరావసరాలకు వాళ్ళని వాడుకొని, సంఘంలో నొక మూలకు తోసిన మీ పేరు బూతు. సంఘం అనే మాట బూతు. అయినా నేను ఇందాక చెప్పినట్టు బూతుల్లో నమ్మను, "ఏదీ ఈ సంఘం ఎక్కడుంది? చూపీ నాకు". నాలుగు గాడిదల వయస్సు వచ్చినా మీరు పెళ్ళి చేయని మీ అబ్బాయి ఆరాటం ఏట్లోకట్ల కిందా మీదా పడి మాన్పించే స్త్రీయోత్తములు, నీరాటవనాటములు పోరాటపడ్డప్పుడు భద్రకుంజరపు ఆరాటము ఘోరాటవిలోన మాన్పిన పురుషోత్తముని సమానులు కారా? ఏరి మాట్లాడరే ఎవరూను? నోరు పడిపోయిందా?

గుఱజాడ కన్యాశుల్కం (Girls for Sale) చదివి కూడా, మధురవాణిగా సావిత్రిని చూసికూడా వారిని చిన్నచూపు చూసే మీరు
+ చేసేది మనోలంజరికం. ఇది కూడా బూతు కాదు, తప్పుడు పనీకాదూ, అయినా మీ దయాత్మక సమాచారం కోసం చెబుతున్నాను. <+ ఇక్కడ మీరు అంటే కొన్ని సామాజిక వర్గాలని హీనంగా చూసేవారు మాత్రమే>

మీమల్ని ఎవరైనా పలానా తలారి సుబ్బయ్య కొడుకు అని పరిచయం చేయబోతే, మీరు అబ్బే కాదండి, ఫోన్లు, మైకు సెట్లు వంటి వున్న ఈ రోజుల్లో ఇక తలారితనం ఎవరు చేస్తున్నారండి, మా అయ్యకూడా కూలి పనిలోకే వెళ్తున్నాడు, అని వివరిస్తారా లేదా. అలాగే ఎవరైనా మనల్ని లంజాకొడకా అంటే, మనం కూడా అబ్బే కాదండి, టీవీ, సినిమాలు, ఐటెం సాంగులు, ఇంటర్నెట్టు వంటి వున్న ఈ రోజుల్లో ఇక లంజరికం ఎవరు చేస్తున్నారండి, మా అమ్మకూడా కూలి పనిలోకే వెళ్తుందండి. అని వివరించుకోవాలి. అలా కాకపోతే, ఏ రిప్రడక్టివ్ థెరపిస్టు అనో, నాన్ లీనియర్ ఎడిటర్ అనో, స్పేస్ షటిల్ ప్రోగ్రామర్ అనో వివరించుకోవాలి.

అలా మొత్తానికి బుద్ధుణ్ణి మనం వేశ్యాసుతుఁడని స్తుతించినా ఆయనకు తేడావుండదు (చాలా రాజకీయనాయకులుకు చేతినిండా పని చిక్కుతుందనుకోండి). ఎందుకంటే అద్వైత స్వరూపుణ్ణి ఏమని పిలిచినా ఒకటేగా. చేపగా పుట్టినోడు, పందిగా పుట్టినోడు, తాబేలుగా పుట్టినోడు, రాజుగా పుట్టినోడు, గొల్లవానిగా పుట్టినోడు, బ్రాహ్మణపిల్లవాడిగా పుట్టినోడు, అలానే వడ్రంగిగా ఖండాంతరంలో పుట్టిన వాడు. పిల్లిగా వేరేదో దేశంలో పుట్టిన వాడు. అలగే ఇతర పశు పక్ష జంతాదులుగా పుట్టిన వాడు. స్త్రీగా పుట్టినది. వేశ్యగానే పుట్టినది. అసలు పుట్టనేపుట్టనిది. అట్టిదానిని ఏమని పిలిస్తేనేం. అట్టిది వేశ్యకడుపున పుడితేనేం?

అసలు బూతు అనేది వినేవాడి చెవిలోనుంది. ఉదా- మీరు ఎవరినో ఒకరిని సరదాకి "రండి రాజశేఖర రెడ్డిగారు" అని మర్యాద చేస్తే; అతను కాంగ్రేస్ కార్యకర్త అయితే సంబరపడిపోతాడు. తెలుఁగుదేశం కార్యకర్త అయితే, మిమ్మల్ని మళ్ళీ ఏ లంజాకొడుకనో అంటాడు. అతని దృష్టిలోనది బూతు కాబట్టి.

అర్థమయ్యిందనుకుంట వేదాంతం. అయితే మనకు ఇప్పుడో చిక్కువచ్చిపడింది. నా పద్యంలో అల గణికకొడుకుల గనుమా అని అంటే రాజకీయనాకులను మెచ్చుకున్నట్టుంటుంది గాని తిట్టినట్టు వుండదు. అయితే ఇప్పుడేం చేద్దాం. యు నో వాట్... తఱించి చూస్తే మనమెవ్వరం బుద్ధులం గాము. ఆచార్యులమూ కాము. కాబట్టి పద్యాన్ని అలానే వదిలేస్తే సరిపోతుంది.

<ఇక్కడింకా వుంది సోది .. కానీ నేను భద్రపఱచుకున్న దానిలో ఇంతవఱకే యుంది. క్షమించగలరు>

జై యల్లమ్మ తల్లి.

Thursday, April 23, 2009

వోటరు నెంబరు ౫౦౦ - రానారె

రాకేశ్వర నాయిడు రెడ్డి...
ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.


అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు అనేది చెప్పాలి. మీకు తెలుసో తెలియదోగాని గత రెండు నెలల పాటుగాఁ టీవీల ద్వారా, పత్రికల ద్వారా జనాలకు చిత్రవధ పెట్టారు పలు పక్షాలవారు.

నేను పుట్టినరోజున ఇలానే సార్వత్ర ఎన్నికలు సర్వత్రా జరిగాయి. అది ౧౯౮౩. నేను పుట్టి, ఎంటీవోణ్ణి గెలిపించాను. తెలుఁగు ఆత్మగౌరవం సంబడం చేసుకుంది. తెలుఁగులో లుగులకు మధ్యలోనున్న అఱసున్నా పునర్జీవితఁపు కలలు కంది. అఱసున్నాలోని అసులకు మధ్యనున్న ఱ కూడా కొత్త కలలు కంది. ప్రజాస్వామ్యంలోని సగటు కలలవలెఁ సదరు కలలు నెఱవేఱలేదనుకోండి అది వేఱేవిషయం. (అఱసున్నాలోఁ ఱవాడాలో రవాడాలో నాకు స్పష్టంగా తెలియదు. ఏదో అత్యుత్సాహాన్ని మన్నించగలరు.)

ఇంతకీ చెప్పవచ్చేదేంటంటే, మేము ఎప్పుడూ తెలుఁగు దేశానికే వేస్తాం. వేంటనే చంద్రబాబు నాయిడు మా పార్టీని లక్ష్మీపార్వతి నుండి రక్షించినప్పుడు మీరు ఎవరికివేశారు అని సందేహపడవచ్చు. అప్పుడు బాలయ్యబాబులాగా మేము కూడా సైకిల్ గుర్తుకే వోటేశాం. ఇలా తరతరాలుగా, అతిశయోక్తులు ఎందుకులెండి, ఇలా ఒక తరంగా సైకిలు గుర్తుకు ఓటు బ్యాంకై వెలసినాము మేము నాయిడ్రెడ్లం. కాని క్రితం సారి మాలో కొందరు - అంటే మా ఉమ్మడి కుటుంబంలో కొందరు - ఉమ్మడి కుటుంబం అనగా వూరిలో కొందరు ఉచిత విద్యుత్తు కోసం కాంగ్రేసోడికి వోటేశారు. అసలే మా రైతులకు ధనదాహం ఎక్కువ, మా దాహాన్ని దీర్చే పోగాకు తోటకి జలదాహం ఎక్కువ, అ జలానికి విద్యద్దాహం ఎక్కువ, విద్యుత్తునకు ధనదాహం ఎక్కువ, మొత్తానకి లెక్క సరిపోయి గుండు సున్నా అయ్యిందిగా. కానీ ఉచిత విద్యుత్తు అనేది తప్పుడు పద్ధతి, ఒక రకమైన అన్యాయం, దీని వల్ల కర్చులు బాహ్యమౌతాయని ఎఱిఁగిన మా అయ్యలాంటి వాళ్లు, అలా ఎఱుఁగని తెలుఁగు దేశం కార్యకర్త అయిన మా అమ్మలాంటి వాళ్ళు, ఎఱిఁగీ ఎఱఁగకున్న బెంగుళూరిలో ఉద్యోగంలో మునిగివుండి తెలుగుదేశం ఎలాగూ నగ్గుతుందిలే అనుకున్న నాలాంటి వాళ్ళు తప్ప మిగిలిన చాలా మందిలో కొంత మంది సైకిలుకి హ్యాండిచ్చారు. హ్యాండుకి బ్రహ్మరథం పట్టారు. (బ్రహ్మరథం పట్టడం అంటేఁ జంపి స్వర్గానికి పంపడం అని అసలర్థం వుందని మీరు ఎఱుఁగుదురా?) అలా హస్తానికి కుర్చీ వేసిన మావూరి జనాన్ని ఈనాడు చదివేవాళ్ళు క్షమిస్తారనీ, సాక్షి చదివే వారు కీర్తిస్తారనీ భావిస్తున్నాను. వెల్ మొత్తానికి జరగాల్సినది జరిగింది, ఆ బాబు శేఖర నాయిడ్రెడ్ల ప్రారబ్ధ కర్మలకు జరిగిన ఆ సంగ్రామంలో, మా వరి కొబ్బర్ల నాయిడ్రెడ్లు విద్యుల్లంచం తీసుకొని ఇచ్చిన తీర్పు అందరికీ ఎఱుఁకే.

ఐదేండ్ల తరువాత....
ధర్మం కలికాలంలో ఒక పాదం మీద నడుస్తుందంట. ఎనకెప్పుడో నాలుగు పాదాల మీద నడిచేదఁట. అలా నలుగు కాళ్ళుండే ధర్మగర్దభం ఈనాటికి పరమకుంటిదయ్యింది, మిగిలియున్న యా ఒంటికాలి మీద కూడా మన ముఖ్య మంత్రి గారు కత్తెత్తారని గత ఐదేండ్లుగా పత్రికలవారు మొత్తుకుంటూనేవున్నారు. వారి ప్రతాపానికి నీరసఁబడ్డ నాలాంటి పాత అభిమానులకు ఆక్రోశం పుట్టింది. మార్పు కోరాం. అలా మాలాగ ఆలోచించిన చిరంజీవి, చంద్రశేఖర రావు, జైప్రకాశ్ నారాయణ్ వంటి వారు నాట్సో-కొత్త పార్టీలకు కొత్త ఊపు తెచ్చారు. ఇలా ఎన్నికల పెళ్లి భోజనంలో విస్తరి నిండా వడ్డించి ఏదో ఒక్కటి మాత్రమే తినాలని విన్న పెళ్ళిపెద్దలాగా మేము కూడా బిక్కమొహం వేశాం. కానీ సమయానికి మా బాబు యువగర్జన అని గర్జించాడు. అలా మాకు విస్తరిలో పసుప్పచ్చగా వుండే రెండు చక్రాల జిలేబీనే తినాలి అని గుర్తుకొచ్చింది.

కొంత సేపు గర్జన గుఱించి చెప్పుకుందాం. మొన్నొక రోజు నేనూనొక బ్లాఙ్మిత్రుడూను గోదావరి పర్యాటనకై బైకేసుకుని వెళుతున్నాం. ఇద్దరం మహామేధావులం కాబట్టి. నాలుగు గర్దభాల వయస్సొచ్చినా, సజ్జోగోజ్జోగాలు లేక ఇలా బైకుల మీద తిఱిగి గర్వపడేవారిని మేధావులే అనాలిగా. అలా మేం మేధావులం బైకు మీద వెళుతూ, కనిపించిన లోకాన్ని అవహేళన చేస్తూ ఆనందిస్తుంటే, ఒక చోటఁ మాల గర్జననో, కావుంటి గర్జన నో ఎదో గర్జన చూసాం. మందకృష్ణ బొమ్మ వుందనుకుంట, రాజమండ్రిలో మాదిగ గర్జన అయుంటుంది. మొత్తానికి గర్జన అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం, ఏ కులపుటోరిదైతేనే గర్జన. (అన్నట్టు సామాజిక వర్గం, దళిత, వైశ్య, ఇలాంటి సాంస్కరిత సంస్కృత పదాలు వాడలేదని మీకు అభ్యంతరం కలుగవచ్చు, మేము ఏదో పాతకాలపుటోరం, అంత ఓపిక లేక సాంస్కరిత సాంస్కృతిక పత్రికలకు పంపుకోలేక ఇలా బ్లాగుల్లో వ్రాసుకుంటున్నాం. క్షతహృదయులు క్షమించగలరు.)
మొత్తానికి గర్జన గురించి గద మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా యువ గర్జన, మాదిగ గర్జన వంటి గర్జనల పేర్లు చూసి ఒకటో రకం మేధావినైన నేను "హహ, మన జాతికింత మానసిక అభద్రతాభావం దేనికో, ప్రతిదానికీ తమనుతాము ఎప్పుడూ సింహాలతో పులులతోనూ పోల్చుకుంటూ వుంటారు. ప్రక్కవాళ్ళిని చంపుకుతినే కౄర మృగాలతో పోలిక ఏంటో, ప్రతీవాడు రాజుతో పోలికే. అలాగే ఐపియల్లో కూడా సగం జట్ల పేర్లో రాయల్సనో కింగ్సనో లయన్సనో వుంటుంది" అని అపహాస్యం చేసాను.
మేలు రకం మేధావి అయిన మన బ్లాఙ్మిత్రుడు (బ్లాగ్ + మిత్రుడు = బ్లాఙ్‌మిత్రుడు అనునాసిక సంధి) ఇంకా మేలురకంగా ఇలా "మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది గాని, వీడు గర్జిస్తాడఁట. హహహ" అని అపహాస్యం చేసాడు. మొత్తానికలా బ్లాగుల ద్వారా మీరెంత విడ్డూరమైన మనిషైనా, అంతకు మించిన విడ్డూరమైన మనిషి దొరుకుతాఁడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తెలుఁగువారంటే, అతనికంటే ఇంగా ఘనుడు బట్టురాజు బాల అనిపిస్తుంది బ్లాగ్లోకం.

మొత్తానికలా ఎవరికి ఓటేయాలా అని ఆలోచిస్తున్న నాకు, గాలిపటం మీదకు తుఫానులా ఈ పథకాలు వచ్చిపడ్డాయి. నగదు బదిలీ అనీ, ఉచిత టీవీ అనీ, పసుపుకుంకుమలనీ, తొలిసూళ్ళని (గొడ్లకేనండోయ్), వడగండ్ల వర్షంలా వచ్చిపడ్డాయీ పాతకాత్మకములైన పథకాల. అప్పటికే ప్రపంచంలో లోభం ప్రసరిస్తుందని విలపిస్తున్న నాకు, కర్చులను బాహ్యింపజేసే వ్యవస్థ మీద వున్న కోపం వలన, ఉచితంగా వస్తువులు కావలని ఆశించిన వారి మీదఁ జుగుప్స, వాటిని ఇస్తామన్న వారి మీద విజుగుప్స హెచ్చించాయి. అప్పటి వఱకూ ఒక పద్ధతిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు పోతావున్న చంద్రబాబు ఇలా పథకాలతో పతనమైపోవడం నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అలానే అప్పటి వఱకూ ఒక పద్ధతిలో పాత్రికేయం చేసుకుంటూ ముందుకు పోతావున్న ఈనాడు పత్రిక కూడా మఱీ ఇంత దారుణంగా కాంగ్రెసు మీద కసి కట్టడం, రోజూ చెడు వార్త మీద చెడువార్త అందించి వృత్తిధర్మాన్ని విస్మయించిన వారి మీద కాస్త జుగుప్స కలిగింది. ఇలా ఒకరి ప్రచారం చూసి ఇంకొకరి మీద జుగుప్స కలిగింది. అయినా తతో న విజుగుప్సతే అని స్మరించుకుంటూ ఆశా కిరణాలకై చూశాను. అలాంటి నాకు ఈల గోల వినిపించింది. జయప్రకాశు పథకాల మీద డబ్బు పంపిణీల మీదఁ జేస్తున్న వ్యాఖ్యలు నచ్చి, ఈ నా వోటు లోకసత్తాకేనని అనుకున్నాను. నిన్నటి వఱకూ.

కానీ మావారందఱూ తెదేపాకే నని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎంతగా నంటే, మా మాజీ ఎమ్మల్లే మా కార్లు చూస్తే, ఆయని కారు మెల్లగా నడిపిస్తూ, మాకు కనబడేలా దణ్ణం పెడతాడు. మా కార్లంటే మా రెండు మూడు వూళ్ళలో రెడ్డినాయిళ్ళెవరికైనా సరేఁ. ఎంతైన ఊపిరితిత్తులకు పొగఁబట్టించి సంపాయించిన రైతు వర్గం కదా, అసలే అనాదిగా ఎస్సి నియోజకవర్గం, ఆయనేమో మాలాయన, కాబట్టి డబ్బు పంచినా ప్రచారం చేసిన మాలాంటోళ్ళేనని తెలుసుఁ. అలానే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పేరిట నిల్చున్న ఆయని కుమార్తె కూడా మా చెల్లాయి పెళ్లిరోజు ప్రొద్దుట మా పెళ్ళింటికి వచ్చి, మరీ అందరినీ ఓటు అభ్యర్ధించింది. మేము పిలవలేదనుకోండి ప్రత్యేకించి, కానీ వచ్చింది ఎలాగైనా. ఊరు చిన్నూరై లోపలికున్నా దిట్టలని చెప్పి, గ్రహాల భారానికి కాంతి కణాలు వంగినట్లు వీరూ డబ్బు భారానికి వంగుతారు. మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అభ్యర్థిని బాగా చదువుకున్న ఆవిడ, వృత్తిరీత్య ఉపాధ్యాయిని, డాక్టరు పెండ్లాము. వోటుకు అర్హురాలు. కానీ కౌరవ పక్షానున్న భీష్ముడిలా, ఈవిడకూ ఓటు వేయదలచుకోలేదు నేను. నిన్నటి వఱకూ.

అలాగే మా లోకసభ అభ్యర్థి మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి వాడు అనిపించేది నాకెప్పుడూ. కాబట్టి ఓటేద్దామనుకున్నాను. అప్పుడెప్పుడో తెలుపునలుపు చిత్రం జ్యోతిలో ఈయన జయసుధతో పాటు సైకిలు మీద వెళుతూ పాడుకున్న పాట చూసి, నేను సైకిలు గుర్తుకు ఆ ఓటు కేటాయించుదామనుకున్నాను.

నిన్నేం జరిగిందంటే...
మా లోకసత్తా అభ్యర్థి గుఱించి వాకబు చేసాను. వట్టి వెధవ అని తేలింది. ఎమ్మర్వోగా పనిచేసి, సరిగా వేయీ ఐదొందలకు కావలసిన పత్రం ఇచ్చేవాడు, ధర్మానికి న్యాయానికి సంబంధంలేకుండానని తేలింది. ఈ విషయం నాకు చెప్పింది ఒక తెలుగుదేశం కార్యకర్త అనుకోండి, కాని బుల్లిబాబు మాట నమ్మాలిగా. నమ్మాను.

ఇవాళ రోజూకంటే నాలుగు గంటలు ముందుగానే లేచాను. నిక్కరు వేసుకొని, సైకిలు మీద ఎక్కి మరీ వెళ్ళాను పోలింగి స్టేషనీకి, అరగంట లైనులో నించుంటే, వూరోళ్ళందరూ వచ్చి కొంత పిచ్చాపాటీ చెప్పుకుంటూ, ఆడవాళ్ళూ ముసలివాళ్ళూ వస్తే వాళ్ళని లోనికి రానిస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తానికి రెండు సైకిళ్ళకి ఓటేశాను. సరదా తీరలేదు. ప్రక్కనే మా నానమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడను తీసుకువచ్చి, లైను మొత్తం తప్పించి, సంతకం చేయించి, ఇంకు పూయించి, డబ్బా వరకూ తీసుకువెళ్ళి వోటువేయించాను. మీకో విషయం తెలుసా, ముసలి వాళ్ళు వుంటే వారికి సరిగా కనబడకపోయినా, కనపడదన్న వంకనయినా, మీరు వారిని బూతు దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ నొక్కు అని చూపించవచ్చని.

ఎనకయితే ఇన్ని పార్టీలు లెనప్పుడు ఒక్కొక్కళ్ళూ నాలుగయిదు వోట్లేశేవారు. ఇంకు అంటించగానే తలకు రాసేసుకోవాలి, అలా అది కొబ్బిరి నూనెలో కలసిపోతుంది. ఆ తరువాత హైదరాబాదో పరదేశమో వలసఁబోయిన మీ అన్నదమ్ముల పేర్ల మీదఁ, అక్కజెళ్ళల్ల పేర్ల మీదనో ఓటు గుద్దేయవచ్చు. కానీ ఈరోజుల్లో నాయిడ్రెడ్ల ఐక్యత తగ్గింది. కొందరు పెజారాజ్యం వంటి పార్టీల్లో కెళ్ళి అలా చేయనీయట్లేదు. పైగా ఫోటోలు చూపించమంటున్నారు.

అదన్న మాట నా ఎన్నికల అనుభూతి, అసలయితే మా పక్క నియోజక వర్గంలో మా మావయ్యే ఎన్నికల్లో నిలబడ్డాడు. లెక్క ప్రకారం ఆయని ప్రచారానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఇతర ముఖ్యమైన పనులు వుండీ, చంద్రబాబు చంద్రుణ్ణి తెంపియిస్తానని చేస్తున్న హామీలు నచ్చక మొత్తానికి అంత ఉత్సాహం లేక వెళ్ళలేదు. హామీలు నచ్చకపోవడం ఎలా వున్నా ముందు ఇంటర్నెట్ పని వుండింది. ఆ మాత్రం దానికి మా బుల్లి బాబే అన్నాడు వాడు అన్న హామీలన్నీ పూర్తి చేస్తే ఎవడూ పనిలోకి రాడు, రైతు *&$# చిరిగిపోతుంది, కాబట్టి చెయ్యడెః అని. అది మన రాజకీయాల పరిస్థితి. మన పార్టీకి మనం వోటేసుకోవాలి అన్నది వేదవాక్కు.

వెల్, మొత్తానికలా ఓటైతే వేసి వచ్చాం. పనసగింజల కూరా, గెడ్డ పెరుగూ తిన్నాం. నా ఒక్క వోటు వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏదైనా ఒకింతైనా మారుతుందా అంటే, యూగాట్టాబీ కిడ్డింగ్ మీ. పోనీ మా వూళ్ళో ౩౦౦ వోట్లు, అందులో ౧౦౦ ప్రవాసులు, వాటివల్లా పెద్దేం మారదు. కానీ అందరం ఓటేస్తే, ఎవరో ఒకరి ఓటు కీలకం అవుతుందిగా. ఆస్తలవీస్త (అలాగే లగెత్తుతా అని అర్థం)

కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్

బలుకుచు గెలుపుల కలలలొఁ

గులుకుచుఁ గదిలె డల శునక/గణిక కొడుకులఁ గనుమా


* పై పద్యంలో తమని రాజకీయనాయకులతో పోల్చామని భంగపడ్డ శునకములను/గణికలను క్షమించమని సవినయంగా మనవిచేసుకుంటున్నాను. ఏదో పద్యవరసకు అన్నాను గానీ, ఆ దానవమూర్తుల ముందు జంతు/మనావ మాత్రులమైన మనమేపాటి.

Friday, March 27, 2009

సింహరాశి అనానిమిషులు - 'సింహవిరోధి' సపోర్టు గుంపు

నేను ఏదో పుస్తకాల కొట్టు కెళ్లి ఏవో పుస్తకాలు కొంటే వాడు పోనీలే పాపం అని నాకు ఒక పంచాంగం బహుకరించాడు. అది తిఱగవేస్తూ ఈ ఏఁడు ఏ రాశి వారికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత అవమానం ఎంత అని చూస్తూండగా. నా రాశి అయిన సింహరాశికి వచ్చే సరికి వ్యయానికి(౫) రెండితల ఆదాయం(౧౧), అవమానానికి(౩) రెండితల రాజపూజ్యం(౬) చూసి తెగ సంబర పడిపోయాను. అలాగే మేష రాశివారి ఫలితాలు జూసి చాలా జాలివేసింది. ఆదాయం రెండయితే వ్యయం ఎనిమిదఁట, రాజపూజ్యం ఒకటైతే అవమానం ఏడఁట! అయ్యోపాపం అనుకుని వారి ఫలితాలు చదవగా "ఈ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలము" అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓహో ఈ అంఖెల్లో ఏం లేదన్నమట! అయితే ఒక సారి సంహిరాశిలోకి వెళ్ళి మన ఫలితాలు ఎలా వున్నాయో సువివరంగా తెలుసుకుందా అని చదవడం మొదలు పెట్టాను.


ఈ రాశి వారికి గురుడు 30-7-09 వరకు షష్టస్థానమైన మకరమునందు తదుపరి సప్తమస్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగాను, 30-7-09 నుండి 19-12-09 వరకు వక్రనడకతో షష్టమరాశియైన మకరరాశిలోను తదనంతరము సప్తమస్థానమైన సహింహరాశిలోనూ పిమ్మట ద్వితీయ రాశియైన కన్యరాశి యందు రజితమూర్తిగాను సంచారము. రాహువు 19-11-09 వరకు షష్టమస్థానమైన మకరరాశి యందు తదనంతరము పంచమస్థానమైన ధనస్సునందు లోహమూర్తి గాను, కేతువు 19-11-09 వరకు వ్యయస్థానమైన కర్కాటకరాశియందు, అనంతరం లాభస్థానమైన మిథునరాశి యందు లోహమూర్తి గాను సంచారము.

ఈ రాశివారికి ఏలినాటిశని ప్రభావము ప్రబలముగా వుంటుడ వలన, గురుని యెక్క బలము సామాన్యముగా యుండుట వలన ఈ సంవత్సరము ఇబ్బందికరముగా యుండును.
ఆర్థికముగా వెనుకబడుట, అనారోగ్యము, మానసికంగా బలహీనత, కోర్టువ్యవహారములలో చిక్కుకొనుట, ప్రమాదము ఏర్పడుట, నిస్త్రాణనిరాశలు, మిత్రులు శత్రువులగుట, స్థిరాస్తుల విక్రయము, ఋణములు చేయుట జరగే అవకాశములు గలవు.

వ్యపార రంగమలోని యీ రాశివారికి జాయింటు వ్యాపారము వలన నష్టపోవుట జరిగే అవకాశము గలదు. ఆర్థక లావాదేవీలతో సమస్యలు ఏర్పడును.
రాష్ట్ర కేంద్ర ప్రయివేటు రంగములలోని ఉద్యోగస్తులకు వత్తిడి ఎక్కవగుట, కొన్ని పరిస్థితులలో సస్పెండు అయ్యే అవకాశములున్నవి. కావున అతిజాక్రత్తగా మసలు కొనుట మంచిది.
విద్యార్థులకు మొదటి ఛాన్సులో కంటే రెండవ ఛాన్సులో చక్కని ఫలితం లభిస్తుంది.
రైతులకు పంటల దగుబడి తక్కువగా వచ్చును. తద్వారా ఆర్థిక పరమైన నష్టము కలుగును.
కాంట్రాక్టుదారులకు టెండర్లు కలసివచ్చనప్పటికీ, ప్రభుత్వపరమైన ఒత్తిడుల వలన కష్టనష్టముల పాలగుట జరుగును. ఫైనాన్సు వారికి లాభదాయకము.
వృత్తిపనివారలకు, టీవి మఱియు సినీకళాకారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు.
ఆదాయము కంటే ఖర్చు తక్కువగా వున్నప్పటికి అప్పుడప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు కలుగును.
రాజకీయనాయకులైన యీ రాశివారికి తగినంత ప్రోత్సాహకరమైన కాలముకాదు.
ఈ రాశి స్త్రీలకు తమమాట చెల్లుబాటుకాదు. వ్యతిరేకత ఎక్కువ. చోరభయం, ఉదర సంబంధమగు వ్యాధులు, తలపోటు, జ్వరములు వచ్చుట సంభవించును.
అవివాహితులకు వివాహము జాప్యమగును.

ఈ రాశివారి అదృష్టసంఖ్య ౧. అనుకూల సంఖ్యులు ౨,౩,౯. రాశ్యాధిపతి రవి గావున కెంపు ధరించుట, మఖానక్షత్రమువారు వైఢూర్యము పుబ్బవారు వజ్రము ను ధరించుట మంచిది. ఈ రాశి వారు గురు శనులకు జపదానములు చేయుంటకొనుట, నలమహారాజు చరిత్ర పఠించుట మంచిది. నీలిరంగు పువ్వులు నల్లని వస్తువులు నువ్వులనూనె దానంగా ఇవ్వండి. ఎఱుపురంగు పూలమొక్కలను తూర్పుదిశలలో పెంచండి. శుభం జరుగుతుంది.

===========================================

"*&^) మ్యాన్, ఈ ఏఁడు బాగా *&^% పోయినట్టున్నాం" అనుకున్నాను. వీడు ఇంత సువివరంగా వ్రాయడం మానేసి, "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.

వ్యాపారం చేద్దామంటే నష్టపోతామంట. ఉద్యోగం చేయబోతే అది కాస్తా ఊడిపోతుందఁట. పోనీలే మళ్ళీ పైచదువులకు పోదామంటే, అవీ కుదరవఁట. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం కళారంగం అబ్బే ఎక్కడా లాభం లేదు. పోనీలే పెళ్ళి చేసుకుంటే పోతుంది అని అనుకుంటే, ఆ భాగ్యమూలేదు. పెపెచ్చు అనారోగ్యం కూడానఁట. కాబట్టి ఈ ఏఁడు కూడా ఇలా నిస్త్రాణ నిరాశలతో గడిపేయాలఁట. (నిస్త్రాణ nis-trāṇa. n. Weakness.).
పోనీలెండి, ఈయనెవరో ముందే చెప్పి మనల్ని మానసికంగా సిద్ధంగా వుంచాడు. ఇప్పుడు నాకు ఏంజరిగినా, "అఱె ఆ రోజు పలానా నామాని వారి పంచాంగంలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని వ్రాసారే" అనుకోవచ్చు. అలానే అడ్డమైన ప్రయత్నాలలో శ్రమ, డబ్బు ఖర్చు మానుకోవచ్చు. ఇంచక్కా కాళీగా కూర్చుని బ్లాగులు చదువుకోవచ్చు.

===========================================


ఏమిటి రాకేశ్, ఇంతా చదువుకొని నువ్వు కూడా ఇలాంటి మూడనమ్మకాలు పెట్టుకంటావా?
ఆఖరికి ఇంతకి దిగజారిపోయావా?
ఇవన్ని సోది మాటలు రాకేశ్, పొట్టగడుపుకోవడానికి వ్రాస్తారు, వాటిని నమ్మకూడదు.
అసలే స్టాటిస్టికల్ అనలిష్టువి, వెయ్యమందిలో ఒకఁడికి పది సార్లు టాసు వేస్తే వరుసగా పదిసార్లూ బొరుసే రావడం సహజం అని తెలిసినవాడివి. మానవకృషి యొక్క విలువ తెలియకపోవడమేమిటి?
ఇలాంటి మాటలు మీరు అంటూవుండవచ్చు.

అవును నిజమే, నేను చాలా చదువుకున్నాను. లెక్కల నుండి ఛందస్సు వఱకూ, ఆర్థిక శాస్త్రం నుండి మానసిక శాస్త్రం వఱకూ. ఆచార్యుని అద్వైతం దగ్గర నుండి ఐనిస్టీను రిలేటివిటీ వఱకూ చాలా విషయాలు చూచాయిగా పరిచయం కూడా వున్నాయి. ఏన్నో పరీక్షలు కష్టపడి వ్రాసాను, పలుదేశాల్లో పలు రంగాల్లో పనికూడా చేశాను.

నేనూ రెండేండ్ల క్రితం వఱకూ మీలాగానే ఆలోచించాను. తుస్ ఈ జాతకాల్లో ఏం లేదని. ఇదే ఏలినాటి శని గుఱించి మీరు నాకు రెండేళ్ళ క్రితం అనగా ౨౦౦౭ ఉగాదిలో చెప్పుంటే. "తుస్ శనీ లేడు గినీ లేడు, నా రాశిలో కొస్తేనేం, వెనుకభాగం మీద తంతే, వీధవతల పడతాడు" అనేవాడిని. అలా ౨౦౦౮ ఉగాదిలో చెబితే, "వెల్... అంటే... ఇలాంటివి నమ్మకూడదనుకో... కానీ చెప్పలేం.. ద యీనివర్స్ కెనోన్లీ బీ సో రేణ్డమ్ కదా... దానీకీ దీనికీ స్టాటిస్టికల్ కోరిలేషన్ వుండడం పెద్ద ఆశ్చర్యమేముంది. గత ఏఁడాది నేను అనుకున్నట్టుగా ఒక్కటీ జరగలేదు చూడండి. మా బామ్మ కూడా 'జాతకం బాలేదురా అందుకే అమెరికానుంచి వచ్చేసావు' అనంది" అని అనేవాడిని.

ఇక ఈ ఏటికి వచ్చేసరికి పంచాంగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. "శని ఎలా వున్నాడు, అతనికి అన్ని మర్యాదలూ జరుగుతున్నాయా, ఇంకెన్నాళ్ళుంటాడు మన రాశిలో" వంటివి తెలుసుకుందామని. వాళ్ళు "పర్వాలేదు, ఈ ఏఁడు బానేవుంటుంది" అనంటే నా పనులు నేను చూసుకుందామని, లేకుంటా - ప్రస్తుతం ఉన్నట్లుగా కాళీగానే వుందామని నిర్ణయించుకున్నాను.

మొన్నటి వఱకూ ఎవరైనా "వూళ్లోనేం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు?" అనడిగితే మార్చనో మాఘమనో ఏదో చెప్పేవాడిని. ఇప్పుడేమో ఆ శ్రమంతా లేక "ఇక్కడే వుంటున్నా ఎక్కడికీ వెళ్ళట్లేదు" అని చెబుతున్నాను. ఇఁక మొన్నొకసారి ఒక హస్తజ్యోతిష్యుని దగ్గర చెయ్య చూపించుకుంటే, "అఱ్ఱె ఈపాటికే నువ్వు ఆసుపత్రిలోనుండాలే" అన్నాడు. "వెల్ డ్యూడ్ యు గాటే పాయింట్" అనుకున్నాను మనసులో. అలా ఆ డ్యూడ్ పాయింటుతో అప్పటికే బలంగానున్న నా నమ్మకం ఇంకా బలపడింది.

పోనీ లెండి నల్లమబ్బుకి తెల్లంచు అన్నట్టు. ఫైనాన్సులో వున్నవారికి లాభదాయకం అన్నాడు. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ . కొనసాగిస్తే సరిపోతుందిదేమో. అసలే రెండు నెలలుగా లాభాలువస్తున్నాయి. అలలే ఇవాళ అచ్చంగా నా కోసమే అన్నట్టు నిఫ్టీ 3050 పైన ఆగింది. కాని నా స్నేహితురాలు తన తరఫున కూడా పెట్టుబడి పెట్టమంటుంది. "నా పంచాంగంలో జాయింటు వ్యాపారం వల్ల నష్టాలు వస్తాయనుంది, కాబట్టి నీ రెండు లక్షల పెట్టుబడీ నువ్వే వుంచుకోవమ్మా" అని చెప్పేశాను.

===========================================

"ఈ టపా చదువుతున్న సింహరాశి సోదరసోదరీమణులు, బావమరిది మరదలాదులు, నిస్త్రాణ నిరాశ పడవలసిన అవసరం లేదు" అని నేనంటే, నేను మీ సగటు తెలుఁగు రాజకీయవెత్త కంటే దుష్టుడనైపోతాను. కాబట్టి నిస్త్రాణ నిరాశ పడదాం, కానీ అది ఉమ్మడిగా పడదాం. యద్భవిష్యులమై కూర్చోకుండా, మనం సింహరాశి అనానిమిషులు అని ఒక సపోర్టు గుంపు ఏర్పఱచుకుందాం.

ప్రతి శని వారం, అలానే ప్రతి నెలలోనూ మన అదృష్ట సంఖ్యలైన ౧, ౨, ౩, ౯ అలానే ౧౧, ౧౨, ౧౩, ౧౯, ౨౧, ౨౨, ౨౩, ౨౯, ౩౧ తేదీలలో కూడలి వారి కబుర్ల గదిలోఁ కలసి మన దగ్గరున్న వజ్రవైడూర్యకెంపులను పంచుకుందాం. మఱి నాలాంటి నిరుద్యోగులకు వజ్రం కొనుక్కోవాలంటే కష్టమేకదా. శని గురువులకు జపదానం చేద్దాం, వాళ్ళైనా పాపం ఇంటింటీకీ ఏం వెళతారు. మన రాశి లోకి శని అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాడు. కానీ పాపం శనిని శని ఎప్పుడూ పీడిస్తూనేవుంటుంది. అలానే నేను నలమహారాజు చరిత్ర కాపీ చేస్తాను మీరు పేస్టు చేసుకోండి.

మీరందఱూ నాకు తలో ఐదువేలు నగదు పంపండి, నేను మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయంలో శనిత్రయోదశినాడు మీ పేర్ల మీదఁ లక్షనామజపదానం చేయిస్తాను. సరేనా మఱి. అప్పటి వఱకూ ఈ బరాకేశ్వర మంత్రం గుర్తుపెట్టుకోండి.
ఆ॥
కద్దు కటిక రాత్రి పొద్దు పొడుపు ముందు
ఇట్టు యీసు గోన గెట్టు వర్సు
బీఫొరిట్టు గెట్సు బెటరు! సో టేక్కేరు
విశ్వదాభిరామ వినుఁ బరాక!

Monday, March 23, 2009

ఇంసోమ్నియపు పద్యాలు

రోజూ రాత్రి పడుకునేముందు ప్రొద్దుటే ఆఱింటికి లేవాలి అనుకొని తొందరగా పడుకోవడం జరుగుతుంది. కానీ నిద్రపట్టిచావదు - వేడనో దోమలనో ఆలోచనలనో. అలా నిద్రకోసం వేచిచూస్తున్నంతసేపు, ప్రపంచ పరిస్థితిని బాగుచేయాలనే ఆలోచనల ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి నిన్న రాత్రి రెండు వృత్తాలు వ్రాయఁబూనుకున్నాను. కాగితం కలం కంప్యూటరు కీబోర్డు లేకుండా బుఱ్ఱలోనిలా ..
చం॥
కవితలు మాని యీ యువత కాసులె లెక్కలు వేసుకొంటిరే ।
అవతల పేదజీవితము లాకలి కేకలు పట్టవేవి । పై
స విలువ యైన లేని జలసాలకు బోతిరి నాగరీకులై ।
సుమిమల సౌమ్య సుందరతఁ జూడక పోతిరి కామచారులై ॥

చంపకమాలంటే నజభజజజర అని కాకుండా తననన తాన తాన తన తానన తానన తానతానతా అని గుర్తు పెట్టుకంటే మంచిదని విని అలా పట్టాను. కాబట్టి ఈ పద్యంలో పదాల విఱుపులు కూడా అలానే వస్తాయి.


మ॥
కడుపా? అయ్యది ఖండవల్లి మడుగా? కాజాలు, లడ్డూలు, మీ
గడ బొబ్బట్లును, పప్పుచారు, పెరుగూ, కారాల పచ్చళ్ళు, మా
మిడి పళ్ళేమిటి, పాయసాలిఁక యిలా మీరెంత వడ్డించినా
మిడతంభొట్ల గణేశు గాడికసలేమీ చాలదంటే నిజం॥

కడుపా అయ్యది ఖండవల్లి మడుగా అన్నది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారనే కవి వ్రాసిన "బొబ్బిలి యుద్ధం" నాటకం లోనిదఁట. ఖండవల్లి మడుగు ఇప్పుడో జాతీయంగా మారినా (ఖండవల్లిలోని ప్లాస్టిక్ చెత్తకి అది ఒక ముఱికి కూపంలా కూడా మాఱివుంటుంది లెండి అది వేఱే విషయం) ఆ మిగిలిన పద్యం ఎవరికీ తెలియదు. ఆ మత్తేభ విక్రీడితమెలా వుంటుందో నాకు తెలియదు గాని, ఇలావుంటుందేమో అన్నట్టుగా మీకోసం అచ్చమైన వాడుక తెలుఁగులో పూరించాను. ఆస్వాదించండి.

Sunday, March 08, 2009

బృహన్ముంబయి - ౧వ భాగము

ప్యాంటులో పాసు పోస్తూ స్కూలు నుండి వీధిలోనికి పెరుగెడుతున్న ఆరేళ్ళ కుఱ్ఱాడిలా, కంగారు కంగారు గా బంబాయి వీధులలో పరుగెడుతున్న నీళ్ళ లారీ పై బృహన్ముంబయి మహానగర పాలికా, అని వ్రాసివుండడం చూస్తే మీకు మొదట అనిపించేదేఁవిటంటే,
బృహత్ + ముంబయి = బృహన్ముంబయి
, అనునాసిక సంధి బాగుంది అని.

ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి వీరు ఇంత టాం వేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ రోజు గడిచేలోపు బృహద్బృహన్ముంబయి అతిమహానగరం అని మీకు రూఢీగా తెలియవస్తుంది.

ముంబయి నగరానికి వెళ్ళడం ఒక త్రీడి వెర్చుయల్ రియాలిటి సినిమా చూడండలాంటిది. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే, సినిమాలో పాత్రలు మీతో సంభాషించడం. మీ చేయి పట్టుకున్ని మిమ్మల్ని సినిమాలోపల నడిపించడం. నాకు ముంబయిలో పని పడింది. దానికి రెండు రోజులు ముందు వెళ్లి , పని అయన ఒక రోజు తరువాత వెనక్కి వచ్చాను. నేను అక్కడవున్నన్నాళ్ళూ వర్షం పడుతూనేవుంది. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల అంత కసిగా అంత సుధీర్ఘకాలం వర్షం పడడం సహజంగా పరిగణించబడుతుంది. నగరంలో కంపు చూసి దాన్ని శుభ్రం చేయబూనిందేమో వర్షం అని మీకు అనుమానం కలుగవచ్చు. ఆ అనుమానం బహుసహజం. కానీ సహ్యాద్రులకు పశ్చిమ పక్క నివసించిన ఎవరికైనా, ఈ వర్షం ఈ ప్రాంతాలలో ఈ కాలంలో ఇలానే పుడుతుందని తెలుసు. కేరళలో రవి నేల కానలేని కారడవులనుండి, కొంకణి నిర్మానుష్య సముద్రాల మీద వాన పడడం కోసం మాత్రమే పడుతూవుంటుంది. పడుతూనేవుంటుంది.

అలాంటి ఒక వాన ఆదివారం నాడు, రెండు కోట్ల జనులపై దయలేకుండా నగరంపై విరుచుకు పడ్డ వానలో ఉదయాన్నే ఆరున్నరకి బయలుదేరా నగరం మీదకు, నగరం లోనికి. సరిగా గంటన్నరలో చాలా దూరం వెళ్ళాలి.
వెళ్లాను రైలుమందిరానికి. పూజారి గారి పలుకుకోసం పడిగాపులుగా పురజనులు ప్రక్రమాలు కట్టారు. అక్కడ నించుంటే గంటన్నర కాస్త గట్టెక్కేస్తుంది, దానితోఁ బాటు నా అరవై వేలు కూడా, వెంటనే ఆటో కోసం వెదకి, ఇంకో రైలు స్టేషను దగ్గర దింపమన్నా, ఎక్కడ నుండి నేను వెళ్ళాల్సిన చోటుకు రైళ్ళు దొరుకుతాయో అలాంటి స్టేషను ఇంకొకటి కడ దింపమన్నాను. అతను ఎక్కించుకొని, కొంత దూరంలో ఉన్న ఒక కూడలి దగ్గర వదలి. అదిగో అక్కడ నీకు కావలసిన బస్సు దొరుకుతుంది అని చెప్పి డబ్బు తీసుకొని తుఱ్ఱుమన్నాడు. అక్కడికి వెళ్ళి నించున్నాను. నలుగురునీ అడగసాగాను పలానా స్టేషనుకు బస్సు వస్తుందా అని.

సకుటుంబ సమేతంగా బస్సు కోసం వేచివున్న ఒకాయన మీరు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు, కాందివిలి అని చెప్పాను. అరె మేమూ అక్కడికే. ఇక్కడనుండి నేఱుగా బస్సులు దొరుకుతాయి, ట్రెయిను అవసరం లేదు. అన్నాడాయన. మాతోఁ బాటు రండి బస్సులో వెళ్దాం అన్నాడు. సరే బస్సు ఎప్పుడు వస్తుంది ఎంత సేపు పడుతుంది అని అడిగాను. ఇప్పుడు వస్తే గంటన్నర పడుతుంది అన్నాడు. నాకు నా అరవై వేలూ, దానితోఁబాటూ ఎన్నో చదువుతూ గడిపిన అర్థరాత్రులూ గుర్తుకువచ్చాయి.
సరె బస్సురావడానికో అనడిగితే.. "మేము ఇక్కడే అరగంట నుండి చూస్తున్నాము రాలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు". హూఁ... అవునా, నాకు పదేళ్ళగా లాటరీ తగలలేదు కాబట్టి ఇవాళ తగలవచ్చు అన్నట్టుగానుంది జవాబు. గత్యంతరం లేక నేను నా అరవై వేలూ ఆయన బుట్టలో పెట్టాను. ఆ సమయంలో నేను మార్కావ్ ప్రాసెస్ల గురించీ, ఎక్సుపోనెన్షియల్ డిసట్రిబ్యూషణ్ల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను. ఆయనట్టుగానే యాండ్రే మార్కావ్ ని వెక్కిరిస్తున్నట్టుగా బస్సు వచ్చింది. నా కొత్త మిత్రులు పెట్టెలతోఁ బస్సువైపు పరుగెడుత్తడానికి పూనుకున్నారు. వారికి ఒక సమాను ఎక్కువయ్యేసరికి. భయిసాబ్ కాస్త ఈ పెట్టి మోసుకెళ్ళండి అని నాకు ఒక పెట్టి పారేసారు. మొత్తానికి బస్సు ఎక్కి కూర్చున్నా. కాళీగానే వుంది. గంటన్నర ప్రయాణమట, టికెట్టు మాత్రం పద్నాలుగు రూపాయిలే. బస్సు వెళుతూ వుంది. నేను ఏ పరివారంలో భాగమయ్యానో వారు నాకు అభయ-చూపులు ఇస్తూండడంతో లేని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. నా అఱవై వేల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నిస్తూ.

తడిచి ముద్దైన ముంబయి రోడ్ల మీద చక్రాలున్న పడవా యిది, లేదా నీట ప్రయాణించే బస్సా ఇది అన్నట్టుగా శర వేగంతో దూసుకుపోతుంది బస్సు. మధ్యలో నాకెందుకో నేను వెళ్ళాల్సిన చోటు నుండి కొంత దూరంగా వెళుతున్నానేమో అని అనుమానం కలిగింది. మా కొంగ్రొత్త ఇంటిపెద్దకి చూపించా నేను వెళ్ళవలసిన చిరునామా ఇది అని. ఆయన దాన్ని కొంత బాధగా చూసి, నువ్వు వెళ్ళాల్సింది కాందివిలి తూర్పు, మేము పడమర. మన దార్లు త్వరలోనే విడిపోతాయి, అని చెప్పాడు. పుంతలు విడిపోయిన చోట నేను దిగాను. మా పెద్దాయిన నన్ను ఎంతో బాధతో చూస్తూనే వీడ్కోలు చెప్పారు. గంటన్నర పాటూ ఒక కుటుంబంలో భాగమై, వాళ్లు దిగేటప్పుడు వాళ్ళ పెట్టెలు ఎవరు దించుతారో అన్న సంశయంతోనే నేను దిగి కిటికోలోనుండి వీడ్కోలు చెప్పి ఆటోకోసం వెదక సాగాను.

ఒకళిద్దరు ఆటోవాళ్లు నేను రానన్ననారు. మూడో ఆయన ఎక్కు అన్నాడు. కానీ అతని ముఖంలో 'నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది, దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం' అంటున్నప్పడు ఒక ఆత్మవిశ్వాసం గల వైధ్యుని ముఖంలో కనిపించే చూపు అతని ముఖంలో నాకు కనిపించింది. ఆటో కొంత కాలం తోలాక తీఱికగా అన్నాడు. ఇప్పుడు భారీవర్షాలవలన అవతలకు (తూర్పుకు) వెళ్ళవలసిన సురంగ రోడ్డు నీట మునిగింది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నేను నిన్ను రైల్వేటేషను ఇవతల వదులు తాను. నువ్వు దాన్ని దాటి అవతలకు వెళ్ళు. ఆవతలి పక్క షేర్డు ఆటో నీ కోసం ఉంటుంది అన్నాడు. నాకు మళ్ళీ నా అరవై వేలు నా దగ్గర నుండి దూరంగా పోతున్నట్టు అనిపించింది.

కొంత సేపటికి అలానే ఒక స్టేషను ఇవతల వదిలాడు. అవతల కెళడానికి దారి అదిగో అటు అని చూపి. అటు పోయి చూడగా, చాలా మంది రైలు పట్టాల ప్రక్కన దాట కూడని గేటు క్రింద నుండి దాటి, అవతలి ప్రక్కకు వెళ్ళడం చేస్తున్నారు. నేనూ అదే పని చేయబోయేటప్పుడు సరిగ్గా రైలు వచ్చింది. హూఁ జపానులో మూకుమ్మడి ఆత్మహత్యలంటారు, ఇలానే వుంటాయేమో.. అనుకున్నాను.

చివరకు ఎప్పుడో నేననుకున్న రైల్వేష్టేషను యొక్క అనుకున్న ప్రక్కకు రావడంతో నా జీవితం నేను వేసిన ప్లానుకు అనుగుణంగా వచ్చి చేరింది. మన నిజ జీవితాలలో కూడా ఇంతే, మీరు ఇఱవైకి నేను చదువు చించి పారేశ్తా, పాతికకి పెళ్ళాడతా, ముప్పైకి మూడు కోట్లు పోగుజేస్తా, నలభైకి నలుగురు పిల్లల్ని కంటా అని లెక్కలేస్తారు గదా. కానీ నిజంగా అలా ససేమిరా జరగదు. మీరు ఎంత తక్కువ అంచనాలు వేసినా అవి అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదు. మీరు అనుకోనట్టు మాత్రం జరుగుతుంటాయి, అంటే మీరు పాతికకు పెళ్ళి చేసుకుంటాననుకున్నారనుకోండి. అది పాతిక బదులు ముప్పై అవుతుంది. అలాగే నేను నలభైకి నలుగురు పిల్లల్ని కంటా ననుకున్నారనుకోండి, అది ముప్పైకే జరిగిపోవచ్చు. నాకూ అలానే జరిగింది, నేను పావుతక్కువ ఎనిమిదింటికి కాందివ్లి స్టేషను బయట (తూర్పు పక్క సుమీ) ఉంటానని లెక్క వేశానా, కానీ నేను అక్కడికి చేరుకునే సరికి ఎనిమిది అయ్యింది.

ఏఁవైతేనే అవతలి ప్రక్కకు చేరుకొని ఆటోకోసం చూస్తుంటే, నాలాంటి ఇంకో నలుగురు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు.
కుఱ్ఱాళ్ళు అంటే ఒక మాట గుర్తుకువచ్చింది. ఇది అప్పుడు ఆ కుఱ్ఱాళ్ళని చూసినప్పుడు గుర్తుకురాలేదనుకోండి, కానీ ఇప్పుడిలా ఆ మాటని అక్షరాల్లో చూస్తుంటే నాకు గుర్తుకువచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ ఊళ్ళోకి పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చారఁట. ఆయన కుఱ్ఱాళ్ళోయ్ కుఱ్ఱాళ్ళూ అన్న పాట పడారట. చాలా బాగా పాడరు అని ఇప్పటికీ చెబుతూంటుంది. నేను ఆ పాట వినక పోయిన, నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏఁవనిపిస్తుందంటే, నాకు ఆ పాట నచ్చడానికి గల కారణం కుఱ్ఱాళ్ళు అనే మాటలో వరుసా వచ్చే బండి ర క్రింద బండి ర దాని వెనకే వచ్చే అళ క్రింద అళ. వాటిని బండి ర, అళ అనడం మంచిది కాదనుకోండి. ఱ ని ఱ అనాలి గాని బండి ర అంటే ఏం బాగుంటుంది. చూడడానికి ఎంత బండిలా వుంటే మాత్రము. ఉదాహరణకు మీ పేరే అయినాపురం కోటీశ్వరరావు అనుకోండి. మీరు బండగా వుంటారనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా బండ కోటి అంటే ఏం బాగుంటుంది. మీ వూళ్ళో వీదికో కోటీశ్వరరావు ఉన్నాడనుకోండి, అందులో ఇప్పటికే చాలా మందిని కోటి అనే అంటున్నారనుకోండి. అయినా మీమ్మల్ని బండ కోటి అనడం మిమ్మల్ని నొప్పిస్తుందిగా. అందుకే ఱని బండీ-ర అనకుండా ఱ అనాలి. ళని అళ అని ఎందుకనకూడదో చెప్పాలంటే, మీ పేరు సత్తుపల్లి సీతాలు అనుకోండి, మీవూళ్ళో ఇంకా చాలా మంది సీలాళ్ళు వున్నారనుకోండి, ఇంతమంది సత్తుపల్లి సీతాళ్ళున్న ఈ సచ్చుపల్లి సత్తుపల్లిలో ఎన్నాళ్ళుంటామనిఁ దలచి, మీరు కన్నడనాడు వలస వెళ్ళారనుకోండి. అక్కడ మిమ్మల్ని అందరూ సత్తుహళ్ళి సీతాళు అనిపిలుస్తున్నారనుకోండి. అది చాలా భావ్యమే అయినా - ఎందకంటే కన్నడవారికి ళ అంటే మమకారం ఎక్కువ, పైగా వారికిఁ ను, వు, ళు, గళు ప్రథమా విభక్తి - అయినా మీకు మనసు నొచ్చుతుంది కాదా. అందుకనే ళ ని అళ అనకూడదు. అలానే ఙకి తమిళ కథ, ఞకి మలయాళీ కథ వున్నాయి, అవి మరెప్పుడైనా చెప్పుకుందాం. అప్పటివఱకూ ఱ,ళ,ఙ,ఞ లను ర,ల,న,న లగా పలక రాదని బండ గుర్తు మాత్రం పెట్టుకోండి.

ఇంతకీ టేషనీకి అవతల ప్రక్క ఏఁవ్ జరిగిందో నేను చెప్పనేలేదు కదా. అవతల ప్రక్కకు వెళ్ళగానే అక్కడ కొందరు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు. వారు కూడా పరీక్ష వ్రాయడానికి వచ్చిన వారల్లే వుంటే నేను వెళ్ళి అడిగాను ఫలానా కాలేజీకి వెళుతున్నారా అని. వారు వేంటనే అవునన్నారు. నలుగురం కలసి ఆటో వెదకబోయాం. చాలా ఆటోలు వున్నాయి గానీ ఎవరూ రామన్నారు. ఒకతను పాతిక ఇస్తే వస్తాను అన్నాడు. సరే అయితే రెండు ఆటోలు తీసుకుంటాం చెరో ఇద్దరూ అన్నాడితను. ఆటోవాడికి అలాగైతే వాడికి పజ్ఞెండు రూపాయలే చిక్కుతానుకున్నాడో ఏఁవోగాని వాడు మనాచేశాడు. ఇంతకీ ఇతని ఉద్ధేశం మాత్రం ఇద్దరికే పాతిక ఇస్తామని. అక్కడ అరవై వేలు గాలిలో వ్రేలాడుతూంటే, ఇక్కడ వీడు పాతికలకు బేరాలేఁవిటా అనుకొని వుంటాడతను.

తరువాత ఇంకొకతను నలుగురినీ ఎక్కుంచుకుంటా కానీ నలభై ఇవ్వాలి అన్నాడు. కాస్త ఎక్కువ అడుగుతున్నాడన్న సిగ్గు ముగంలే కనిపించేడట్టే. పాపం వానికేం తెలుసు ఎక్కువ అడగడం గుఱించి. మీ మనీ మేనేజర్‌ని పరిచయం చేయండి అతనికి కొంతైనా బుద్ధివస్తుంది, మీ మనీ మేనేజర్ కి కాదు, ఈ ఆటోవాడికి.

----------------------------------------------
నేను ముంబయి వెళ్ళింది 6, జూను, 2008
పై టపా వ్రాసింది 8, జూలై, 2008 (అప్పటికి ఇంకా పేళుళ్ళు వంటివి జరగలేదు).
కథ ఇంకా సగం బాకీ వుంది. కానీ అది ఎప్పటికి వ్రాస్తానో తెలియదు. వ్రాసిన అందులో ఎంత నాకు బాగా గుర్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాకేశ్వర-రావు-అముద్రితాలు లోనికి వెళ్ళిపోకుండా కపాడడానికి దీనిని ఇక్కడే ఇప్పుడే టపా చేస్తున్నాను. త్వరలో వీలైతే తఱువాయి భాగం ప్రచురిస్తాను.

Thursday, January 22, 2009

మదినెమిలి


అల్లో నేరేళ్ళ
నీ కళ్ళ నీలాల్లో
ఎగురనీ నా ఊహా విహఁగాలని

తెలినుఱుగుటలల
నీ వొడి సుడిగుండాల్లో
తిఱుగనీ నా కోరికల నౌకలని

అరుణ కిరణముల
నీ ఆశా జ్యోతులలో
కరుగనీ నా కలతల కారు యిరులని

విమల సిత కమల
నీ హృదాలవాలములో
ఒదగనీ నా పసిడి వన్నె కలలని

అల్లి తెమ్మెరల
నీ శ్వాస నిశ్వాసల్లో
చెరగనీ నా చేదు జ్ఞాపకాలని

సూన్యేందు అర్ధేందు రాకేందు
వలయమున భ్రమరింప లేకున్న
నీ ప్రేమతోఁ
విముక్తి నొసంగి, భానుగా
నిత్యము నీ వింట విహరింపని

గగన రతనమై, నీ నీలాలను చీఁకటి గానీను
తరఁగ హేతువై, నీ వలపుటలలకలుపు రానీను
ఆది జ్యోతినై, నీ ఆశా జ్యోతి నారిపోనీను
కమల నాథునై, నీ తమ్మిరేకులఁ ముడువనీను
మకర సూర్యునై, నీ అల్లిగాడ్పుల నుష్ణింపనీను

ఓసి చికాగోపురపు వయ్యారి
నా మదిన నాట్యమాడు మయూరి
నీకిదే నా నుడి!

Tuesday, January 20, 2009

నీచమానవులు

కార్యసాధన విషయంలో మనుషులు మూఁడు రకాలుగా ఉంటారని చెబుతూ ఉదరహించే పద్యం ఆరంభింపరు నీచమానవులు. భర్తృహరి రచించిన ప్రారభ్యతే న ఖలు అనే సంస్కృత పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెనిగించారిలా

శా|
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటి వారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యో అడ్డంకులను తలచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. ఏదో చేయలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములని ఊ పద్యభావం.

-
ఈ పద్యం నాకు నిన్న కంటఁబడింది. బాగా నచ్చి బ్లాగులో పెట్టుకుందాం ఇంబలువురి కంటఁబడుతుందని ఇలా పెడుతున్నాను. సువాస భారతీయులు ఎవరో ఈ పద్యాన్ని నిన్న చూసేవుంటారు, ఎక్కడ చూసారో చెప్పఁగలిగితే, పుణ్యం (గుడ్ కార్మా) వస్తుంది.
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం